Joseph Ravan Arrest: సాధారణంగా నాస్తికులు అంటే దేవుడిని నమ్మరు. ప్రతి మతంలోనూ ఉంటారు ఇలాంటి నాస్తికులు. కానీ ఇప్పుడు మరో రకమైన నాస్తికత్వం కనిపిస్తోంది. అదే మతతత్వం మాటున. సోషల్ మీడియా విస్తృతం అయ్యాక.. ఇలా మతపరమైన ప్రేరేపిత కుట్రలు పెరిగాయి. నాస్తికత్వం మరో మతంపై అనుచిత వ్యాఖ్యలు కూడా పెరుగుతూ వస్తున్నాయి. బహుశా ఏపీలో ఇప్పటివరకు ఆ పరిస్థితి లేదు. కానీ జోసఫ్ రావణ్ లాంటి వారితో ఈ పరిస్థితి జరిగింది. అయితే ఏ మతం పైన అయినా… ఏ దేవుళ్ళ పైన అయినా.. అనుచిత వ్యాఖ్యలు చేస్తే అది ముమ్మాటికీ నేరమే. దానిని ఖండించాల్సిన అవసరం ఉంది. అయితే ఏపీలో జోసెఫ్ రావణ్ అరెస్టు వెనుక రాజకీయ కోణం ఉందనేది కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న ఆరోపణ. ప్రధానంగా ఆయనను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు సిపిఐ మద్దతుగా మాట్లాడుతోంది. ఈ తరుణంలో ఏపీలో పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
* ఆందోళనలో అనుబంధ సంస్థలు..
సాధారణంగా బిజెపి అంటేనే హిందుత్వవాదం అని ఎక్కువ మంది భావిస్తారు. అలానే నడిచింది వారి రాజకీయాలు. విశ్వహిందూ పరిషత్ తో పాటు ఆర్ఎస్ఎస్, భజరంగదళ్ వంటి అనుబంధ సంఘాలు హిందుత్వ వాదాన్ని ఎక్కువగా ముందుకు తీసుకెళుతుంటాయి. ఈ తరుణంలో ఏపీలో జరుగుతున్న పరిణామాలను చూసి బిజెపి అనుబంధ సంస్థలు ఆందోళనతో ఉన్నట్లు తెలుస్తోంది. పైగా ఇక్కడ విపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు సిపిఐ సమర్ధించడం పై కూడా తప్పుపడుతున్నట్లు తెలుస్తోంది. ఒక పద్ధతి ప్రకారం హిందుత్వవాదం పై కుట్ర జరుగుతోందన్న అనుమానం కేంద్రంలో ఉంది. ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు సైతం ఈ వాదాన్ని విస్తరిస్తారని ప్రచారం జరుగుతోంది. దీంతో కేంద్రం కన్నెర్ర జేసే అవకాశం ఉంది.
* కేంద్రం అనుమతితో..
ఏపీలో దళిత క్రైస్తవ శంఖారావసభలో జోసెఫ్ రావణ్ చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. ఆయనపై పోలీసులు వరుసగా కేసులు నమోదు చేసి అరెస్టుల పర్వం కొనసాగిస్తున్నారు. ఒక కేసులో బెయిల్ దక్కుతుంటే… మరో కేసులో అరెస్టు చేస్తున్నారు. ఇప్పుడు ఉగ్రవాద నిర్మూలనకు సంబంధించిన ఓ చట్టంలో ఉన్న కేసును ప్రయోగించారు. ఈ కేసులో ఆయనకు ఇప్పట్లో బెయిల్ లభించే అవకాశం లేదు. అయితే ఈ కేసు నమోదు వెనుక కేంద్ర ప్రభుత్వ అనుమతి ఉంది అనేది ఒక విశ్లేషణ. ఏపీలో మతపరంగా జరుగుతున్న కుట్రలపై కేంద్ర ప్రభుత్వానికి సమాచారం ఉంది. దేశ సమైక్యత భావానికి ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నిస్తున్న తరుణంలో.. మత విద్వేషాలకు ఏపీ వేదిక అవుతుండడాన్ని.. కేంద్ర ప్రభుత్వం గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీరుపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి అందులో వాస్తవం ఎంత ఉందో చూడాలి.
