BJP strategy South India politics: ఎన్డీఏ ( National democratic Alliance )కూటమి వ్యూహం ఎవరికి అంతుపట్టడం లేదు. ముఖ్యంగా ఏపీ విషయంలో బిజెపి పెద్దల వైఖరి ప్రత్యర్థులకు కూడా అందడం లేదు. మొన్నటి వరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి తెరవెనుక బిజెపి సహకారం అందిస్తుంది అనేది బలమైన ప్రచారం. అందుకు తగ్గట్టుగానే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సైతం బిజెపి అడగకుండానే పెద్ద ఎత్తున తన మద్దతు తెలుపుతూ వచ్చింది. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులు, వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు కు సంబంధించిన విచారణ జాప్యం వంటివి ఆ రెండు పార్టీల మధ్య స్నేహం ఉన్నట్టు అనుమానం కలిగించేలా ఉండేవి. మరోవైపు వైసీపీ నేతలు సైతం తమకు బిజెపి స్నేహం కొనసాగుతుందని అర్థం వచ్చేలా వ్యవహరించేవారు. కానీ అమరావతికి చట్టబద్ధత కల్పించడంలో కేంద్రం తీసుకున్న చొరవ తో వైసీపీతో బిజెపి స్నేహం పై ఒక స్పష్టత వచ్చింది. వారి మధ్య ఎటువంటి సంబంధం లేదని తేలిపోయింది.
చంద్రబాబుకు ఎనలేని ప్రాధాన్యం..
మరోవైపు ఏపీలో సీఎం చంద్రబాబు తో( CM Chandrababu) పాటు ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేష్ కు ఎనలేని ప్రాధాన్యం దక్కుతోంది. ఆయన అడిగిన వెంటనే ప్రధాని మోదీ అపాయింట్మెంట్ ఇస్తున్నారు. నిన్ననే ప్రధానిని కలిశారు లోకేష్. రాజ్యసభ గ్యాలరీలోకి వెళ్లారు. కేంద్ర మంత్రులు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అయితే అటు నుంచి అడ్డు అన్నట్టు కర్ణాటక వెళ్లారు నారా లోకేష్. అక్కడ కేంద్ర మంత్రులతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. లోకేష్ కు అక్కడ ఘనస్వాగతం లభించింది. ఉత్సాహంగా కర్ణాటకలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు లోకేష్.
Also Read: లోకేష్ ను అలా చూసి తట్టుకోలేకపోతున్న వైసిపి
కర్ణాటక కాంగ్రెస్ ముద్దు..
ప్రస్తుతం కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి రాజకీయాలు చేస్తున్నారు. ఢిల్లీ కాంగ్రెస్ ను వ్యతిరేకిస్తున్న ఆయన కర్ణాటక కాంగ్రెస్ సేవలను మాత్రం వినియోగించుకుంటున్నారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీలో కూడా అదే అనుమానం ఉంది. వచ్చే ఎన్నికల్లో కర్ణాటకలో అధికారంలోకి రావాలని భావిస్తోంది బిజెపి. వైసీపీ భావజాలం కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా ఉంటుంది. అందుకే అది కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి వైసీపీ సహకరిస్తుంది అనేది బహిరంగ రహస్యం. అయితే ఇప్పుడు కర్ణాటకలో అధికారంలోకి రావాలంటే సరిహద్దు ప్రాంతాల్లో టిడిపి కూటమి సేవలను వినియోగించుకోవాలని చూస్తోంది బిజెపి. అందుకే లోకేష్ ను రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. మరోవైపు తమిళనాడులో పవన్ కళ్యాణ్ సేవలు వినియోగించుకుంటుంది. కర్ణాటకలో మాత్రం లోకేష్ సేవలను వినియోగించుకోవడం ద్వారా అధికారంలోకి రావాలని భావిస్తోంది. మొత్తానికి అయితే దక్షిణాది రాష్ట్రాల విషయంలో బిజెపి పెద్దలు గట్టి వ్యూహంతోనే ఉన్నారు.
బెంగళూరు నుంచి సంప్రదింపులు..
జగన్మోహన్ రెడ్డి ( Y S Jagan Mohan Reddy) బెంగళూరు నుంచి జాతీయ రాజకీయ పార్టీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారన్న అనుమానం బీజేపీలో ఉంది. ఎందుకంటే కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో చాలామంది సన్నిహితులు జగన్ మోహన్ రెడ్డికి ఉన్నారు. అయితే తెలంగాణలో సైతం కాంగ్రెస్ అధికారంలో ఉంది. కానీ అక్కడ చంద్రబాబు సన్నిహితుడు రేవంత్ రెడ్డి సీఎం గా ఉన్నారు. అందుకే జగన్ కర్ణాటకను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. కర్ణాటకలో ఉండి అక్కడి నేతల సహకారం తీసుకొని ఏపీలో రాజకీయాలు చేస్తున్నారు. ఈ సమాచారం బిజెపికి ఉండడం వల్లే లోకేష్ ను కర్ణాటకలో ప్రయోగిస్తోందన్న టాక్ వినిపిస్తోంది.
