YCP: బిజెపియా, కాంగ్రెస్సా.. వైసీపీ నేతల ముందున్నది ఈ రెండు ఆప్షన్లే!

బిజెపిలోకి తాజా మాజీ మంత్రులు చాలామంది వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నది ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి నేతృత్వంలోనే నలుగురు వైసీపీ ఎంపీలు బిజెపిలో చేరతారని టాక్ నడుస్తోంది. మరి ముఖ్యంగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి ని సీఎం జగన్ బిజెపిలోకి పంపిస్తున్నారు అన్నది ఒక వార్త వైరల్ అంశంగా మారింది. మిథున్ రెడ్డి విషయంలో ఇదే తరహా ప్రచారం జరగగా.. ఆయన ఫుల్ క్లారిటీ ఇచ్చారు. వైసీపీలోనే కొనసాగుతానని తేల్చి చెప్పారు.

Written By: Dharma, Updated On : July 11, 2024 8:50 am

YCP

Follow us on

YCP: అమరావతి : వైసీపీకి దారుణ పరాజయం ఎదురైంది. ఓటమిని పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. అధినేత జగన్ వరుస సమీక్షలు నిర్వహించి నాయకులతో మాట్లాడుతున్నారు. నియోజకవర్గాల వారీగా వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. లోపం ఎక్కడ జరిగిందో ఆరా తీస్తున్నారు. 2029 నాటికి పార్టీని పూర్వ వైభవం దిశగా తీసుకెళ్తానని చెబుతున్నారు. పార్టీలో ప్రక్షాళన సైతం ప్రారంభించారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన ఒకరిద్దరిని సస్పెండ్ కూడా చేశారు. నియోజకవర్గాల ఇన్చార్జిలను కూడా మార్చుతున్నారు. అయితే అంతవరకు ఓకే కానీ.. పార్టీలో సీనియర్లు మాత్రం మౌనం వీడడం లేదు. కొందరైతే పార్టీ కార్యక్రమాల విషయంలో అంటీ ముట్టనట్టుగా ఉన్నారు. ముఖ్యంగా జగన్ క్యాబినెట్లో మంత్రి పదవులు అనుభవించిన వారు సైతం అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం ఆందోళన కలిగిస్తోంది. చాలామందికి వైసిపి పూర్వవైభవం వస్తుందని నమ్మకం లేదు. ఆ దిశగా జగన్ తీసుకెళ్లలేరనేది ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు. అందుకే ప్రత్యామ్నాయాలు చూసుకోవాలని చూస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బిజెపిలోకి వెళ్తే సేఫ్ జోన్ లో ఉంటామని భావిస్తున్నారు.

* పుంజుకుంటున్న కాంగ్రెస్..
జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుంటోంది. ఆ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి ఎన్డీఏకు గట్టిగానే ఫైట్ ఇచ్చింది. బిజెపి బలం సైతం తగ్గింది. ఇటువంటి తరుణంలో కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుంటే ఆ ప్రభావం ఏపీ పై తప్పకుండా పడుతుంది. ఇప్పటికే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. బిజెపికి అక్కడ జనం తిరస్కరించారు. తెలంగాణలో సైతం మూడో స్థానంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా అధికారంలోకి రాగలిగింది. ఆ రెండు రాష్ట్రాలతో ఏపీకి ప్రత్యేక అనుబంధం ఉంది. ఇప్పటికీ వైసీపీ నేతలకు హైదరాబాదులో ఆస్తులు ఉన్నాయి. రాయలసీమ నేతలకు బెంగళూరులో వ్యాపారాలు నడుస్తున్నాయి. సహజంగానే వారు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతారు. మెజారిటీ వైసీపీ నేతల పూర్వాశ్రమం కాంగ్రెస్ పార్టీ. వైసిపి బలహీనమైంది. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం దూకుడు మీద ఉంది. అందుకే ఎక్కువమంది వైసీపీ నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు సమాచారం. ఒకవేళ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే మాత్రం.. వైసిపి సీనియర్లు కాంగ్రెస్ లోకి వెళ్లడం ఖాయంగా తేలుతోంది.

* బిజెపిలోకి తాజా మాజీ మంత్రులు..
బిజెపిలోకి తాజా మాజీ మంత్రులు చాలామంది వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నది ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి నేతృత్వంలోనే నలుగురు వైసీపీ ఎంపీలు బిజెపిలో చేరతారని టాక్ నడుస్తోంది. మరి ముఖ్యంగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి ని సీఎం జగన్ బిజెపిలోకి పంపిస్తున్నారు అన్నది ఒక వార్త వైరల్ అంశంగా మారింది. మిథున్ రెడ్డి విషయంలో ఇదే తరహా ప్రచారం జరగగా.. ఆయన ఫుల్ క్లారిటీ ఇచ్చారు. వైసీపీలోనే కొనసాగుతానని తేల్చి చెప్పారు. మరోవైపు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నేతృత్వంలో కొందరు వైసీపీ రాజ్యసభ సభ్యులు బిజెపిలోకి వెళ్తారని కూడా టాక్ నడిచింది. జగన్ పై ఉన్న కేసుల దృష్ట్యా.. గత ఎన్నికల్లో ఓడిపోయిన టిడిపి అనుసరించిన వ్యూహాన్ని జగన్ కొనసాగిస్తారని కూడా ఊహాగానాలు వచ్చాయి. నాడు తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన వెంటనే నలుగురు రాజ్యసభ సభ్యులు బిజెపిలో చేరారు. ఇలా చేరిన వారంతా చంద్రబాబుకు అత్యంత విధేయులే. ఇప్పుడు కూడా జగన్ తన విధేయులను బిజెపిలోకి పంపించి… కేసుల ప్రమాదం నుంచి తప్పించే ప్రయత్నం చేస్తారని టాక్ నడుస్తోంది. తాజాగా తాజా మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బిజెపిలోకి వెళ్తారని ప్రచారం నడుస్తోంది. ఆర్థిక శాఖ పై శ్వేత పత్రం విడుదల చేసేందుకు చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఈ తరుణంలో ఆ శాఖలో చాలా రకాల అవకతవకలు వెలుగు చూసినట్లు ప్రచారం జరుగుతోంది. వైసిపి ప్రభుత్వ హయాంలో అడ్డగోలుగా అప్పులు, పరిమితికి మించి రుణాలు తీసుకున్న సంగతి తెలిసిందే. అందుకే భారీ లోపాలు వెలుగు చూసినట్లు తెలుస్తోంది. ఆర్థిక శాఖ నిర్వర్తించిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్లు సమాచారం. అందుకే సేఫ్ జోన్ గా ఉండాలంటే బిజెపి శ్రేయస్కరమని బుగ్గన భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఫుల్ క్లారిటీ రావాల్సి ఉంది.

* అజ్ఞాతంలోకి సీనియర్లు..
వైసీపీకి పరాజయం తర్వాత చాలామంది సీనియర్లు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఒకరిద్దరు తప్ప అంతా సైలెంట్ అయ్యారు. అటువంటి వారికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ టచ్ లోకి వచ్చినట్లు ప్రచారం జరిగింది. స్వయంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారని.. గతం మాదిరిగా సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారని తెలుస్తోంది. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగిన నాయకులు.. తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీని వీడారు. వైసీపీలో చేరారు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న స్వేచ్ఛను మాత్రం వారు మర్చిపోలేదు.అందుకే కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటే ఆ పార్టీలో చేరడం ఉత్తమమని చాలామంది నాయకులు ఒక భావనతో ఉండేవారు. అయితే ఇప్పుడు వైసిపి ఓడిపోవడం, కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడంతో ఇటువంటి నేతలు పునరాలోచనలో పడ్డారు. ఏకంగా అగ్రనేత రాహుల్ ఆహ్వానించడంతో కొందరు సీనియర్లు సమయం చూసి కాంగ్రెస్ పార్టీలోకి వస్తామని చెప్పినట్లు సమాచారం. వచ్చే కాలంలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. వాటిలో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటితే మాత్రం ఆ ప్రభావం ఏపీ పై పడనుంది. ముఖ్యంగా వైసీపీలో ఉన్న పూర్వ కాంగ్రెస్ నేతలంతా యూటర్న్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

* అటువంటి నేతలకు భయం..
బిజెపిలో చేరేందుకు చాలా మంది వైసీపీ నేతలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ఈ జాబితాలో పలువురు తాజా మాజీలు కూడా ఉన్నారు. కూటమి ప్రభుత్వంతో తమకు ఇబ్బందులు ఎదురవుతాయని భావిస్తున్న నేతలంతా బిజెపి అగ్ర నాయకత్వానికి టచ్ లోకి వస్తున్నారు. బిజెపిలోకి వచ్చేస్తామంటూ వర్తమానం పంపిస్తున్నారు. అయితే ఎన్డీఏలో కీలక భాగస్వామి కావడంతో.. టిడిపి నుంచి అభ్యంతరాలు వస్తాయని తెలిసి అగ్రనాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. బిజెపిలో అసమ్మతి వర్గం.. చాలామంది వైసిపి నేతలను చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తుండగా.. రాష్ట్ర నాయకత్వం మాత్రం అడ్డు చెప్పుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో బిజెపికి ప్రాతినిధ్యం పెరిగింది. పార్టీ అభివృద్ధికి కృషి జరుగుతోంది.అందులో భాగంగా వైసీపీ శ్రేణులను ఆహ్వానించినా ఆశ్చర్యపోనవసరం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే వైసిపి పాలనలో దూకుడుగా వ్యవహరించిన నేతల విషయంలో మాత్రం బిజెపి హై కమాండ్ ఒకటికి రెండుసార్లు ఆలోచన చేస్తోంది. బిజెపి భావజాలాల పట్ల ఆకర్షితులు అయినవారు కంటే.. కూటమి ప్రభుత్వం ఇబ్బందుల నుంచి తప్పించుకునేందుకు చాలామంది బిజెపి బాట పట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అటువంటి వారిని మాత్రం చేర్చుకోమని బిజెపి అగ్ర నాయకత్వం తేల్చి చెబుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం కేసుల నుంచి తప్పించుకోవాలంటే బిజెపి, భవిష్యత్తు రాజకీయాలు చేయాలంటే కాంగ్రెస్.. ఈ రెండు ఆప్షన్లే వైసిపి నేతల ముందు ఉన్నాయి. మరి మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.