Bill Gates to Amaravati: ఏపీలో( Andhra Pradesh) ఆసక్తికర పరిణామం ఒకటి జరిగింది. అమరావతి పర్యటనకు గాను విచ్చేశారు బిల్ గేట్స్. ప్రతినిధులతో పాటు ప్రత్యేక విమానంలో ఆయన వచ్చారు. అయితే గన్నవరం ఎయిర్పోర్ట్ లో వాతావరణ పరిస్థితులు కలిసి రాలేదు. విపరీతమైన పొగ మంచు కారణంగా లాండింగ్ కు ఇబ్బందికరంగా మారింది. ఈ క్రమంలో ఆ విమానం కొద్దిసేపు గాల్లో చక్కర్లు కొట్టింది. అటు తరువాత పరిస్థితి చక్కబడడంతో గ్రీన్ సిగ్నల్ లభించింది. దీంతో ప్రత్యేక విమానం గన్నవరం ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయింది. బిల్ గేట్స్ కు మంత్రి నారా లోకేష్ బృందం ప్రత్యేకంగా స్వాగతం పలికింది.
కీలక చర్చలు..
ఈరోజు అమరావతిలో పర్యటిస్తారు బిల్ గేట్స్( Bill Gates). సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తో సమావేశం అవుతారు. ఏపీ ప్రభుత్వంతో గేట్స్ ఫౌండేషన్ వాళ్ళు ఒప్పందాలు చేసుకోనుంది. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సంజీవని ప్రాజెక్టు చేపడుతున్న సంగతి తెలిసిందే. దీనిపైనే ఈరోజు చర్చలు జరపనున్నారు. టెక్నాలజీ ఆధారిత డయాగ్నస్టిక్ సేవలు, మెడ్ టెక్ కార్యక్రమాలపై కూడా చర్చిస్తారు. ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న రియల్ టైం గవర్నెన్స్ స్టేట్ సెంటర్ ను కూడా బిల్ గేట్స్ సందర్శిస్తారు. పాలనలో టెక్నాలజీని ఎలా ఉపయోగిస్తున్నారని అంశాన్ని కూడా పరిశీలిస్తారు.
సంజీవని ప్రాజెక్టులో భాగస్వామ్యం..
సంజీవని ప్రాజెక్టులో( Sanjivani project ) బిల్ గేట్స్ ఫౌండేషన్ సేవలు అందించనుంది. ఆరోగ్య రంగంలో విప్లవాత్మక సంస్కరణగా ఏపీ ప్రభుత్వం సంజీవని పథకాన్ని రూపొందించింది. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో సంజీవని ప్రాజెక్టు కింద గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు, మాతా శిశు సంరక్షణ, వ్యాక్సినేషన్ వంటి సేవలు అందించే వీలుగా బిల్ గేట్స్ సేవలందించనుంది. సంజీవని ప్రాజెక్టు కింద డిజిటల్ హెల్త్ కార్డుల జారీ ప్రక్రియ ఉంటుంది. వైద్య పరీక్షలు, చికిత్సల వివరాలతో పాటుగా డాక్టర్లు రాసిన ప్రిస్క్రిప్షన్లు, లాబ్ నివేదికలు, వాక్సినేషన్ వివరాలు కూడా నమోదు అవుతాయి. ఇప్పటికే కుప్పం నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా సంజీవని ప్రాజెక్టును చేపట్టారు. విజయవంతం కావడంతో రాష్ట్రంలో విస్తరించాలని చూస్తున్నారు. అందులో భాగస్వామ్యం కానుంది బిల్ గేట్స్ ఫౌండేషన్. అందుకే ఈరోజు తన ప్రతినిధి బృందంతో అమరావతికి చేరుకున్నారు బిల్ గేట్స్.