Homeఆంధ్రప్రదేశ్‌Rk Roja, Krishnadas : మాజీ మంత్రులు రోజా, కృష్ణ దాస్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.....

Rk Roja, Krishnadas : మాజీ మంత్రులు రోజా, కృష్ణ దాస్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. రోజాను ఎలా బుక్ చేశారంటే*

Rk Roja, Krishnadas : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలపై వరుసగా కేసులు నమోదు అవుతున్నాయి. ఈవీఎంలను ధ్వంసం చేసిన కేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టయ్యారు. ప్రస్తుతం జైల్లో ఉన్నారు. గన్నవరంలో టిడిపి కార్యాలయం పై దాడికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పై కేసు నమోదయింది. తమ చేత బలవంతంగా రాజీనామాలు చేయించారని వలంటీర్ల ఫిర్యాదుతో గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని పై కేసు నమోదు చేశారు. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు అరెస్టయ్యారు. మరోవైపు చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన కేసులో జోగి రమేష్ ను అరెస్టు చేయడానికి రంగం సిద్ధమవుతోంది. టిడిపి కేంద్ర కార్యాలయం పై దాడి కేసులో తలశీల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, నందిగాం సురేష్ వంటి వారు కేసులను ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు తాజాగా మాజీ మంత్రి రోజా పేరు వినిపిస్తోంది. వైసిపి ప్రభుత్వ హయాంలో క్రీడల శాఖ మంత్రిగా ఆర్కే రోజా ఉన్నారు. ఆడుదాం ఆంధ్ర, సీఎం కప్, ఇతర క్రీడల్లో నిధుల గోల్ మాల్ పై చంద్రబాబు ప్రభుత్వం దృష్టి పెట్టింది. దీనిలో భాగంగా సిఐడి కి వివిధ క్రీడా సంఘాలు, సీనియర్ క్రీడాకారులు చేసిన ఫిర్యాదులపై చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధమైంది. క్రీడా పోటీల నిర్వహణలో నిధుల దుర్వినియోగం పై సిఐడి కి ఆట్యాపాట్యా సంస్థ సీఈవో ప్రసాద్ ఫిర్యాదు చేశారు. అప్పట్లో క్రీడల మంత్రిగా ఆర్కే రోజా ఉండగా.. ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ధర్మాన కృష్ణ దాస్ ఉన్నారు. వీరిద్దరి చుట్టూ ఉచ్చు బిగిసే అవకాశం ఉంది.

* ఆడుదాం ఆంధ్రాలో అవినీతి
మంత్రివర్గ విస్తరణలో భాగంగా రోజాకు ఛాన్స్ ఇచ్చారు జగన్. పర్యాటక క్రీడల శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. ఎన్నికలకు ముందు ఆడుదాం ఆంధ్ర పేరిట వివిధ క్రీడా పోటీలు నిర్వహించారు. గ్రామస్థాయిలో నైపుణ్యం గల క్రీడాకారులను ఎంపిక చేసుకుని పోటీలు జరిపారు. అయితే ఇందుకుగాను 100 కోట్ల రూపాయలు వరకు ఖర్చు చేశారు. అప్పట్లోనే నిధుల దుర్వినియోగం పై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. అయినా సరే ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో క్రీడా సంఘాల ప్రతినిధులు నేరుగా సిఐడి కి ఫిర్యాదు చేశారు.

* ఒలింపిక్ సంఘ అధ్యక్షుడిగా సేవలు
కృష్ణ దాస్ క్రీడా సంఘాల్లో యాక్టివ్ గా ఉండేవారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత తొలి క్యాబినెట్లో ఆయనకు చోటు దక్కింది. విస్తరణలో మంత్రి పదవి పోయింది. దీంతో ఒలింపిక్ సంఘ అధ్యక్షుడిగా కొనసాగారు. ప్రస్తుతం ఇద్దరూ తాజా మాజీలే. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత రోజా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆమె చెన్నైలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాజకీయాలకు గుడ్ బై చెబుతారని ప్రచారం జరుగుతోంది.

* జగన్ కు విధేయులు
ఈ ఇద్దరు నేతలు జగన్ కు అత్యంత నమ్మకస్తులే. కృష్ణదాస్ పార్టీ ఆవిర్భావం నుంచి జగన్ వెంట అడుగులు వేస్తున్నారు. సోదరుడు ధర్మాన ప్రసాదరావును కాదని కాంగ్రెస్ పార్టీ నుండి వైసీపీలో చేరారు. నరసన్నపేట ఉప ఎన్నికలో గెలిచారు. అయితే ఈ ఎన్నికల్లో ఆయనకు ఓటమి తప్పలేదు. ఎన్నికలతో ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెబుతానని ధర్మాన కృష్ణంరాజు ఇదివరకే ప్రకటించారు. తాజాగా క్రీడా సంఘాల ఫిర్యాదుతో సిఐడి స్పందించింది. కేసు నమోదు చేయాలని విజయవాడ కమిషనర్ ను ఆదేశించింది. దీంతో రోజాతో పాటు కృష్ణ దాస్ విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular