Bhogapuram International Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం తుది దశకు చేరుకుంది. మరి కొద్ది రోజుల్లో ప్రజలకు అందుబాటులోకి రానుంది. జూలై నుంచి అధికారికంగా విమాన రాకపోకలు ప్రారంభం కానున్నాయి. అయితే విశాఖ నగరం నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ కు చాలా రహదారులు ఉన్నాయి. 52 కిలోమీటర్ల దూరం కాగా.. ట్రాఫిక్ ఇబ్బందులతో దాదాపు రెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంటుంది. ఈ ఇబ్బందులను అధిగమించి నేరుగా విశాఖ నగరం నుంచి ఎయిర్పోర్ట్ కు రహదారులను మెరుగుపరిచేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే విశాఖ నుంచి భోగాపురం వెళ్లడానికి విమాన ప్రయాణికులకు ఎదురయ్యే ఇబ్బందుల పరిష్కారం పై.. ఆంధ్రప్రదేశ్ విమాన ప్రయాణికుల సంఘం జిఎంఆర్ సంస్థకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసింది. విమాన ప్రయాణికులు తమ సొంత కార్లపై భోగాపురం వెళితే ట్రాఫిక్ మరింత ఇబ్బందికరంగా మారుతుందని.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేసింది.
* సరికొత్తగా ఆలోచన..
విశాఖ నుంచి వచ్చే విమాన ప్రయాణికులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా జిఎంఆర్ సంస్థ సరికొత్త ఆలోచన చేసింది. విశాఖ నగరంలో 9 చోట్ల వెయిటింగ్ లాంజ్ లు ఏర్పాటు చేయనుంది. దేశంలోనే తొలిసారి ఇటువంటి ఏర్పాట్లు చేయడం. తొలి విడతలో ఐదు లాంజ్ లు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నంలో ఉంది. ఇందుకోసం జిఎంఆర్ గ్రూపు ముంబైలో ప్రత్యేకంగా కంటైనర్లను తయారుచేస్తోంది. 40 అడుగుల వెడల్పు, పది అడుగుల పొడవు కలిగిన కంటైనర్లు లాంజ్ రూపంలో అందుబాటులోకి రానున్నాయి. భోగాపురం వెళ్లాల్సిన విమాన ప్రయాణికులు వారికి సమీపంలో ఉన్న కంటైనర్ల వద్దకు చేరుకుంటే.. అక్కడి నుంచి ఆర్టీసీ నడిపే ఎలక్ట్రిక్ బస్సుల్లో భోగాపురం ఎయిర్పోర్ట్ వెళ్ళవచ్చు. దీనివల్ల విమానాశ్రయ మార్గంలో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది. తక్కువ చార్జీలతో విమానాశ్రయానికి చేరుకోవచ్చు. భారతదేశంలోనే తొలిసారిగా విమాన ప్రయాణికుల కోసం కంటైనర్ లాంజ్ అందుబాటులోకి వస్తుండడం విశేషం.
* నాలుగు రోజుల్లో రానున్న బస్సులు..
విశాఖ మహా నగరానికి ప్రభుత్వం 50 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించింది. వాటిలో తొలి విడత 20 బస్సులు నాలుగు రోజుల్లో విశాఖకు రానున్నాయి. మరోవైపు చార్జింగ్ స్టేషన్ల నిర్మాణం కూడా చురుగ్గా సాగుతోంది. బస్సులు రాగానే ట్రైల్ రన్ కూడా నిర్వహిస్తారు. వీటిలో పది బస్సులు గాజువాక నుంచి జాతీయ రహదారిలో ఆనందపురం మీదుగా భోగాపురం వరకు తిరుగుతాయి. మరో 10 బస్సులు గాజువాకలో బయలుదేరి నగరంలోని ముఖ్యమైన ప్రాంతాల మీదుగా భోగాపురం విమానాశ్రయానికి వెళ్తాయి. ట్రయల్ రన్ లో భాగంగా చెక్ ఇన్ కౌంటర్లు, లగేజీ స్కానింగ్ వంటి వాటికి సంబంధించి ప్రక్రియను నిర్వహిస్తున్నారు. మరోవైపు జూలై 5న అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ముహూర్తం గా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం రావాల్సి ఉంది.
