Ashok Gajapathi Raju: టీటీడీ చైర్మన్ గా అశోక్ గజపతిరాజు?

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం, మంత్రులు, శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం సైతం ముగిసింది. స్పీకర్ ఎంపిక పూర్తి చేసి ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు.

Written By: Dharma, Updated On : June 29, 2024 1:58 pm

Ashok Gajapathi Raju

Follow us on

Ashok Gajapathi Raju: ఏపీలో టీటీడీ చైర్మన్ పదవి మరోసారి తెరపైకి వచ్చింది. సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, ఓ సీనియర్ నేతకు ఆ పదవి ఆఫర్ చేసినట్లు సమాచారం. తెలుగుదేశంలో కూడా బలమైన చర్చ నడుస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మెగా బ్రదర్ నాగబాబు పేరు బలంగా వినిపించింది. ఆయనను టీటీడీ అధ్యక్షుడిగా నియమిస్తారని ప్రచారం జరిగింది. అయితే ఆయన పదవిపై ఆసక్తి చూపలేదని టాక్ నడిచింది. ఈసారి టిడిపి సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజుకు టీటీడీ అధ్యక్ష పదవి ఇస్తారని ఒక ప్రచారం అయితే ఊపందుకుంది. కానీ ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం, మంత్రులు, శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం సైతం ముగిసింది. స్పీకర్ ఎంపిక పూర్తి చేసి ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు. మరోవైపు కొత్త ప్రభుత్వం నూతన నియామకాలతో పాటు పాలనపై దృష్టి పెట్టింది. అటు నామినేటెడ్ పోస్టుల విషయంలో సైతం చంద్రబాబు స్పష్టమైన ప్రకటన చేశారు. కష్టపడిన వారికి పదవులు ఇస్తామని.. ఇప్పటికే కసరత్తు చేస్తున్నట్లు కూడా ప్రకటించారు.ఈ నేపథ్యంలోనే టీటీడీ అధ్యక్ష పదవివిషయంలో ఒక క్లారిటీ వచ్చిందని.. సీనియర్ నేత అశోక్ గజపతి రాజుకు ఆ పదవి ఖాయమైందని సోషల్ మీడియాలో ఉదృతంగా ప్రచారం జరుగుతోంది.

అశోక్ గజపతిరాజు టిడిపిలో సీనియర్.పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు సైతం పక్క చూపులు చూడలేదు. ఇప్పటివరకు ఆయన ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ప్రతిసారి రాష్ట్ర క్యాబినెట్లో ఆయనకు చోటు దక్కింది. ఒకసారి ఎంపీ అయిన ఆయన కేంద్ర మంత్రిగా కూడా వ్యవహరించారు. 2014 యండి ఏ ప్రభుత్వంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి ప్రత్యక్ష రాజకీయాలనుంచి తప్పుకొని తన కుమార్తె అదితి గజపతిరాజుకు ఛాన్స్ ఇచ్చారు. ఎన్నికల్లో ఆమె భారీ మెజారిటీతో గెలుపొందింది.

2024 ఎన్నికల తర్వాత అశోక్ గజపతిరాజు గవర్నర్ గా నియమిస్తారని ప్రచారం జరిగింది. ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉండడంతో.. తెలుగుదేశం పార్టీకి బిజెపి రెండు గవర్నర్ పోస్టులు ఆఫర్ చేసిందని జోరుగా ప్రచారం సాగింది. కానీ అటు తర్వాత ఎలాంటి క్లారిటీ లేదు. ఇప్పుడు టీటీడీ చైర్మన్ గా అశోక్ గజపతిరాజు పేరు బలంగా వినిపిస్తోంది. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన లేదు. విజయనగరం సంస్థానానికి వారసుడిగా, సింహాచలంతో పాటు రామతీర్థ ఆలయ ట్రస్టీగా అశోక్ గజపతిరాజు ఉన్నారు. మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా కూడా కొనసాగుతున్నారు. రాజకీయాల్లో హుందాగా ఉంటారని ఆయనకు మంచి పేరు ఉంది. గత ఐదేళ్ల కాలంగా అశోక్ గజపతి రాజును వైసీపీ ప్రభుత్వం టార్గెట్ చేసుకుంది. అందుకే ఈసారి టీటీడీ చైర్మన్ గా అవకాశం ఇచ్చి.. ఆయన గౌరవాన్ని పెంచాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. మరి అందులో ఎంతవరకు వాస్తవం ఉందో చూడాలి.