AP Women Leaders Future Politics: పార్లమెంట్ ముంగిటకు మరోసారి మహిళా రిజర్వేషన్ బిల్లు వచ్చే అవకాశం ఉంది. అందుకు తగ్గ ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొన్ననే పార్లమెంట్ ముంగిటకు ఆ బిల్లు రాగా.. మూడింట రెండో వంతు మెజారిటీ లేక ఆ బిల్లు పాస్ కాలేదు. దీంతో వెంటనే నియోజకవర్గాల పునర్విభజన బిల్లును కూడా కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. అయితే మరోసారి ఆ రెండు బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదించుకోవాలని చూస్తోంది కేంద్ర ప్రభుత్వం. జాతీయస్థాయిలో మిగతా రాజకీయ పక్షాలతో సంప్రదింపులు జరుపుతోంది. ఆ బాధ్యత ఏపీ సీఎం చంద్రబాబుకు కట్టబెట్టినట్లు తెలుస్తోంది. ఇంకోవైపు తమిళనాడులో డీఎంకే లాంటి లోక్సభ ఎంపీలు ఉన్న పార్టీ సైతం ఎన్డీఏ వైపు మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందుకే తప్పకుండా రెండు బిల్లులు పార్లమెంట్లో పాస్ అయ్యే అవకాశం ఉంది. ఆమోదం లభించిన మరుక్షణం మహిళా రిజర్వేషన్ తో పాటు డీ లిమిటేషన్ సైతం జరగనుంది.
వచ్చే ఎన్నికల నాటికి..
మహిళా రిజర్వేషన్ బిల్లు వస్తే తప్పకుండా పెద్ద ఎత్తున నియోజకవర్గాలు మహిళలకు రిజర్వ్ అవుతాయి. 2029 సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఆ సమయానికి మహిళా బిల్లు కచ్చితంగా అమల్లోకి వస్తుందని తెలుగుదేశం పార్టీకి సమాచారం ఉంది. అందుకే ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరు తమ వారసులను రంగంలోకి దించుతున్నారు. మహిళా వారసులు ఉంటే అధికారిక కార్యక్రమాలకు సైతం పరిచయం చేస్తున్నారు. పాలనలోను వారిని భాగస్వామ్యం చేస్తున్నారు. అటు హై కమాండ్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నిత్యం ప్రజలతో మమేకం అయ్యేలా తమ ఆడబిడ్డలను ప్రోత్సహిస్తున్నారు. అయితే కుమార్తెలు అందుబాటులో లేని చోట కోడళ్లను సైతం రంగంలోకి దించాలని చూస్తున్నారు అధికార పార్టీ ఎమ్మెల్యేలు.
కుమార్తెలు కాకుంటే కోడళ్ళు..
రాష్ట్రవ్యాప్తంగా చూస్తే అన్ని జిల్లాల్లో నేతలు తమ కుమార్తెలను రంగంలోకి దించినట్టు స్పష్టమవుతోంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కుమార్తె సాయి వైష్ణవి ఇప్పటికే రంగంలోకి దిగారు. ఆమె మీడియా సమావేశం నిర్వహించి అనర్గళంగా మాట్లాడారు. ఒకవేళ రూరల్ నియోజకవర్గం మహిళలకు కేటాయిస్తే రంగంలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు పంపారు. నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కుమార్తె అర్చన అధికారిక కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. సీఎం చంద్రబాబు సైతం ఆమెకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం నడుస్తోంది. ఎందుకంటే ఆమె విదేశాల్లో చదువుకొని వచ్చారు. మంచి చరిష్మ ఉంది. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కుమార్తె నవ్య సైతం నేరుగా రంగంలోకి దిగారు. పార్టీతో పాటు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇలా నేతల కుమార్తెలు సిద్ధంగా ఉండడం హాట్ టాపిక్. కచ్చితంగా మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం లభిస్తుందన్న సమాచారంతోనే టిడిపి నేతలు తమ కుమార్తెలను సిద్ధంగా ఉంచారన్నది బహిరంగ రహస్యమే.
