Andhra Pradesh Weather: ఏపీలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. అన్ని ప్రాంతాలకు విస్తరించాయి. ఈ పరిస్థితుల్లో ఏపీకి వర్ష సూచన వచ్చింది. తూర్పు విదర్భ, తెలంగాణ మీదుగా దక్షిణ కోస్తాంధ్ర వరకు ఒక ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో ఏపీలో పలు జిల్లాల్లో ఈరోజు పిడుగులతో కూడిన వర్షాలు, అదే సమయంలో కొన్ని చోట్ల ఎండ తీవ్రత ప్రభావం చూపే పరిస్థితి ఉంది. ప్రధానంగా పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, పోలవరం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి తేలికపాటి వానలు పడే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో సైతం పిడుగులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
* భారీగా ఉష్ణోగ్రతలు..
రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత ఇంకా కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు ఇంకా నమోదవుతున్నాయి. అందుకే విపత్తుల నిర్వహణ సంస్థ గట్టి హెచ్చరికలే పంపుతోంది. గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం, రక్త పోటు ఉన్నవారు ఎండలో తిరగవద్దని సూచిస్తున్నారు. మొన్ననే నైరుతి రుతుపవనాలు ఏపీకి తాకాయి. రాష్ట్రం మొత్తం విస్తరించాయి. కానీ వర్షాలు మాత్రం ఆశాజనకంగా పడటం లేదు. గతవారం విస్తారంగా వర్షాలు కురిసాయి కానీ ఆగిపోయాయి. ఇప్పుడు ఉపరితల ద్రోణీ ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది ఏపీ ఫై ఎల్ నినో ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ ముందస్తుగానే హెచ్చరించింది. సెప్టెంబర్ వరకు వర్షపాతం సాధారణం కంటే తక్కువ ఉంటుందని అంచనా వేశారు. దీంతో ఏపీ ప్రజల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది.
* ఖరీఫ్ కు నిరాశ..
సాధారణంగా జూన్ మొదటి వారం నుంచి ఏపీలో ఖరీఫ్ పనులు ప్రారంభం కావడం జరుగుతూ వస్తోంది. కానీ రెండో వారం దాటుతున్న ఇంతవరకు ఖరీఫ్ పనులు మొదలు కాలేదు. నదులు ఖాళీగా కనిపిస్తున్నాయి. కాలువలు బేల చూపులు చూస్తున్నాయి. సాగునీటి ప్రాజెక్టుల్లో ఆశించిన స్థాయిలో నీరు లేదు. కొన్ని ప్రాజెక్టుల్లో నిల్వలు డెడ్ స్టోరేజ్ కు చేరుకున్నాయి. భూగర్భ జలాలు కూడా అడుగంటి పోయాయి. ఎల్ నినో ప్రభావంతో పరిస్థితి తీవ్రంగా ఉంటుందన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు ఆందోళనతో ఉన్నారు. అయితే ఎటువంటి పరిణామాన్నైనా తట్టుకునేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఇప్పటికే కార్యాచరణ మొదలుపెట్టింది.
