Site icon OkTelugu

AP Rain Alert: ఏపీకి చల్లటి కబురు.. ఆ జిల్లాలకు హెచ్చరిక!

AP Rain Alert

AP Rain Alert

AP Rain Alert: ఏపీకి చల్లటి కబురు చెప్పింది వాతావరణ శాఖ. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈరోజు కొన్ని జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయని చెప్పింది. పిడుగులతో కూడిన వానలు పడతాయని కూడా హెచ్చరిస్తోంది. ప్రధానంగా ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, మార్కాపురం జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే చాన్స్ ఉంది.
* పార్వతీపురం మన్యం, పోలవరం, తూర్పుగోదావరి, పల్నాడు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వానలు పడే అవకాశం ఉంది. అక్కడక్కడ ఉరుములతో పాటు పిడుగులు పడతాయని.. జాగ్రత్తగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచిస్తోంది. ఆ సమయంలో చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో నిలబడకూడదు అని హెచ్చరిస్తోంది.
* గడిచిన 24 గంటల్లో చాలా ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. ఏలూరు జిల్లా కుకునూరులో 28.4 మిల్లీమీటర్లు, కర్నూలు జిల్లా గూడూరులో 19.8, కర్నూలులో 18.4, ఓర్వకల్ లో 16.2, ఏలూరు జిల్లా చింతలపూడిలో 15.8, ఎమ్మిగనూరులో 15.4, మంత్రాలయంలో 13, ఆత్మకూరులో 12.4, ఏలూరు జిల్లా పోలవరం లో 11.6, కాకినాడలో 10.4, ధవలేశ్వరంలో పది, కర్నూలు జిల్లా ఆలూరులో 10, నందవరంలో పది మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

* ఎల్ నినో ప్రభావంతో

ఇప్పటికే ఎల్ నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఖరీఫ్ అదును దాటుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పనులు నిలిచిపోయాయి. ప్రాజెక్టుల్లో కనీస స్థాయిలో కూడా నీరు లేదు. పూర్తిగా డెడ్ స్టోరేజీ కి చేరుకుంది. వాస్తవానికి నైరుతీ రుతుపవనాలు ఆలస్యం అయ్యాయి. జూన్ రెండో వారంలో ప్రవేశించాయి. అనుకున్న స్థాయిలో విస్తరించలేదు. దాని ప్రభావం వర్షాలపై పడింది. బంగాళాఖాతంలో వాయు గుండాలు, ఆవర్తనాలు కూడా తగ్గాయి. కనీస స్థాయిలో వర్షాలు పడకపోవడంతో ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పుడు మళ్లీ రుతుపవనాల్లో కదలిక వచ్చినట్లు వాతావరణ శాఖ చెబుతోంది. దాని ప్రభావంతోనే వర్షాలు పడుతాయని చెప్పుకొస్తోంది. దీంతో రైతుల్లో ఆశలు చిగురించాయి.

Exit mobile version