Thalliki Vandanam Scheme: తల్లికి వందనం పథకం పై క్లారిటీ వస్తోంది. విద్యా సంవత్సరం ప్రారంభం అయింది. తరగతులు కూడా మొదలయ్యాయి. ఈ పరిస్థితుల్లో తల్లికి వందనం పథకం అమలు ఎప్పుడు అని తల్లిదండ్రులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ అధికారులతో సమావేశం అయ్యారు. తల్లికి వందనం పథకం నిధుల విడుదలపై చర్చించారు. వీలైనంత త్వరగా విద్యార్థుల తల్లుల ఆధార్ వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తి చేసి.. నిధుల విడుదలకు చర్యలు తీసుకుంటున్నారు విద్యాశాఖ అధికారులు. క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తుంటే మాత్రం తల్లికి వందనం నిధుల విడుదల కాస్త జాప్యం జరిగే అవకాశం ఉంది. అర్హుడైన ప్రతి విద్యార్థికి సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తోంది. గత ఏడాది మాదిరిగానే విజయవంతంగా అమలు చేసేందుకు నిర్ణయించింది.
* పెరగనున్న లబ్ధిదారులు..
పాఠశాలకు వెళ్లే ప్రతి విద్యార్థికి చదువు సాయం కింద పదిహేను వేల రూపాయలు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. గత ఏడాది ఈ పథకాన్ని అమలు చేసింది. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 13 వేల రూపాయలు, పాఠశాలల అభివృద్ధికి సంబంధించి ఆయా జిల్లా కలెక్టర్ల ఖాతాలో ఒక్కో విద్యార్థికి రెండు వేల చొప్పున జమ చేశారు. గత ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 67 లక్షల మందికిపైగా విద్యార్థులకు తల్లికి వందనం కింద సాయం అందింది. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 13 వేల రూపాయల చొప్పున సాయం అందించారు. ఈ ఏడాది కూడా అవే మార్గదర్శకాలతో పథకాన్ని అమలు చేసేందుకు రైతులు సిద్ధపడ్డారు. గత ఏడాదితో పోల్చితే లబ్ధిదారుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
* అవి తప్పనిసరి..
తల్లికి వందనం పథకం అర్హత కోసం విద్యార్థుల తల్లిదండ్రులు కొన్ని విషయాలను గమనించుకోవాల్సి ఉంటుంది. విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతా.. ఆధార్ కార్డు నంబర్ తో లింక్ అయ్యి ఉండాలి. విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతాకు ఎన్పీసీఐ లింకింగ్ అనేది కూడా తప్పనిసరి. అలాగే సచివాలయ మ్యాపింగ్ కూడా ఉండాలి. ఈ అంశాలు సక్రమంగా ఉన్నాయో లేదో విద్యార్థుల తల్లిదండ్రులు పరిశీలించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం తల్లికి వందనం అర్హుల జాబితాను రూపొందిస్తున్నారు. ఈ జాబితా రూపకల్పన తర్వాత సచివాలయాల వారీగా జాబితాలను ప్రదర్శించనున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం జూలై మూడో వారంలో తల్లికి వందనం పథకం నిధులు జమ చేసే అవకాశం ఉంది.
