AP Rain Alert: ఏపీకి నైరుతి రుతుపవనాలు ముఖం చాటేసాయి. ఆలస్యంగా వచ్చి మందగించాయి కూడా. దీంతో వర్షం పడకపోగా లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఇటువంటి క్రమంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొంత ఉపశమనం ఇస్తోంది. దీని ప్రభావంతో ఏపీలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు నమోదు అవుతున్నాయి. ఈరోజు కూడా అల్పపీడన ప్రభావంతో వర్షాలు కొనసాగునున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై ఉంటుందని.. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ చెబుతోంది.
* ఉత్తరాంధ్ర పై ప్రభావం..
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. దీని ప్రభావంతో ఏపీలో పలుచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రత్యేకించి ఉత్తరాంధ్ర పై ప్రభావం చూపే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, కోనసీమకు వర్ష సూచన ఉంది. అక్కడక్కడ భారీ వర్షాలు కూడా కురుస్తాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడనున్నాయి. పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచిస్తోంది.
* సముద్రం అల్లకల్లోలం..
బంగాళాఖాతంలో వాయుగుండం నెలకొన్న నేపథ్యంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. మత్స్యకారులు బుధవారం వరకు సముద్రంలో వేటకు వెళ్లరాదని అధికారులు సూచించారు. వచ్చే 24 గంటల్లో ఈ అల్పపీడనం తీవ్ర వాయుగుండం గా మారుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. నేడు పారాదీప్- సాగర్ దీప్ మధ్య తీరం దాటి అవకాశం ఉందని తెలుస్తోంది. దాని ప్రభావంతో ఉత్తరాంధ్ర తీరం వెంబడి 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ఏడు మీటర్ల కంటే తక్కువ వెడల్పు ఉన్న పడవల వినియోగం కూడా సురక్షితం కాదని విపత్తుల నిర్వహణ సంస్థ చెబుతోంది. అకస్మాత్తుగా వర్షం కురిసేటప్పుడు పిడుగుల ముప్పు పొంచి ఉంటుందని.. ఈ పరిస్థితుల్లో బహిరంగ ప్రదేశాలలో పనులు చేసేవాళ్లు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తుంది. మేఘాలు గర్జిస్తున్నప్పుడు చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల సమీపంలో నిల్చో వద్దని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రత్యేక ప్రకటన జారీ చేసింది.






