CM Ramesh Bengal Political Strategy: రాజకీయ పార్టీల్లో ట్రబుల్ షూటర్స్ ఉంటారు. పార్టీ కష్టకాలంలో ఉంటే వారే అండగా నిలుస్తారు. ఎటువంటి క్లిష్ట పరిస్థితి నైనా అనుకూలంగా మార్చే ట్రబుల్ షూటర్లు అన్ని పార్టీల్లో కనిపిస్తుంటారు. ఇప్పుడు జాతీయస్థాయిలో దూకుడుగా ఉన్న భారతీయ జనతా పార్టీకి ట్రబుల్ షూటర్ గా దొరికారు ఏపీ ఎంపీ సీఎం రమేష్. బెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణముల్ కాంగ్రెస్ పార్టీలో ఓ 20 మంది ఎంపీలు ప్రత్యేక శిబిరంగా ఏర్పడిన సంగతి తెలిసిందే. వారంతా ఇప్పుడు బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ కు మద్దతు తెలిపారు. అయితే టీఎంసీ ఎంపీల తిరుగుబాటు, ప్రత్యేక శిబిరం ఆపరేషన్ వెనుక ఉన్నది సీఎం రమేష్ అని తేలిపోయింది. బెంగాల్ లో చేపట్టిన ఈ ఆపరేషన్ సక్సెస్ కావడంతో ఢిల్లీలో అత్యంత పవర్ఫుల్ లీడర్ గా అవతరించారు సీఎం రమేష్.
* సీఎం రమేష్ కు కీలక బాధ్యతలు..
ప్రత్యేక పరిస్థితుల్లో రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ తెలుగుదేశం పార్టీ నుంచి బిజెపిలో చేరారు సీఎం రమేష్. మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు.. బిజెపి పరంగా ఏపీలో ఓట్లతో పాటు సీట్లు పెంచుకోవడం.. మోదీ నేతృత్వంలో ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి రావడం వెనుక ఏపీ బలంగా నిలవడం.. ఇలా అన్ని అంశాల్లో సీఎం రమేష్ దూకుడు కలిసి వచ్చింది. దీనిని గమనించింది బిజెపి హై కమాండ్. అందుకే ఈసారి బెంగాల్ లో తృణముల్ అంతర్గత సంక్షోభాన్ని క్యాష్ చేసుకునే బాధ్యతను సీఎం రమేష్ కె అప్పగించారు. బెంగాలీ ఎంపీల అసంతృప్తిని పసిగట్టడం, వారిని ఏకతాటి పైకి తేవడం, చట్టపరమైన చిక్కులు లేకుండా త్రిపురకు చెందిన ఎన్సిపిఐ లో విలీనం చేసే లా రూట్ మ్యాప్ గీయడం వంటి వాటిలో సీఎం రమేష్ క్రియాశీలక పాత్ర పోషించారు.
* భవిష్యత్తులో మంచి ఛాన్స్..
సీఎం రమేష్ పై కేంద్ర పెద్దలకు రోజురోజుకు నమ్మకం పెరుగుతోంది. ఆయనకు ఏపీ ప్రభుత్వం నుంచి మంచి దన్ను ఉండడం కూడా కలిసి వచ్చే అంశం. బెంగాల్లో కేవలం టిఎంసి ఎంపీలను తేవడమే కాదు.. బిజెపికి మట్టి అంటకుండా.. బిజెపి పై రాజకీయ విమర్శలు రాకుండా.. టీఎంసీ సీనియర్ ఎంపీ కాకోలి ఘోష్ దస్తిదార్ ను రాజకీయంగా సిద్ధం చేయడంలో కూడా సీఎం రమేష్ క్రియాశీలక పాత్ర పోషించారు. ఢిల్లీలోని కేంద్రమంత్రి ఉపేందర్ యాదవ్ నివాసంలో జరిగిన చర్చల్లో కీలకంగా మారారు. రాత్రికి రాత్రి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా వద్దకు 20 మంది ఎంపీలను తీసుకెళ్లి విలీన పత్రాలను సమర్పించేలా చేయడంలో సీఎం రమేష్ పాత్ర కీలకం. అయితే సీఎం రమేష్ వ్యవహారం మోడీతో పాటు అమిత్ షాకు ఎంతో నచ్చిందట. భవిష్యత్తులో సీఎం రమేష్ సేవలను మరింతగా వినియోగించుకోవాలని కేంద్ర పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..
