Andhra Pradesh Monsoon: ఏపీకి చల్లటి కబురు వచ్చింది. రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించాయి. గత కొంతకాలంగా భానుడి భగభగలతో ఉడికిపోతోంది రాష్ట్రం. ఒకవైపు వేడి గాలులు, మరోవైపు ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇటువంటి సమయంలో వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. ఏపీలోని అనంతపురం, శ్రీ సత్య సాయి, చిత్తూరు జిల్లాలకు నైరుతి రుతుపవనాలు తాకినట్లు వాతావరణ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ పదో తేదీ నాటికి ఏపీలో సగానికి పైగా భూభాగాన్ని రుతుపవనాలు తాకే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. మరో మూడు రోజుల్లో తొలకరి జల్లులు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
* మూడు రోజుల కిందట..
ఈనెల 4న కేరళకు నైరుతి రుతుపవనాలు తాకాయి. సాధారణంగా జూన్ 1 కేరళలోకి నైరుతీ రుతుపవనాలు ప్రవేశిస్తాయి. కానీ ఈ ఏడాది మూడు రోజులు ఆలస్యంగా ప్రవేశించాయి. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కొనసాగే రుతుపవనాల సీజన్లో 90 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. అయితే రుతుపవనాలు తాకినా ఏపీకి మాత్రం ఎండల తీవ్రత వెంటాడుతూనే ఉంది. దక్షిణ కోస్తాకు వేడిగాలుల ప్రభావం అధికంగా ఉంది. ఉక్క పోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు.
* విస్తరించే అవకాశం..
రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో నైరుతీ రుతుపవనాలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం రుతుపవనాలు రాయలసీమను తాకడంతో అక్కడ వాతావరణ పరిస్థితి మారింది. చల్లటి వాతావరణం నెలకొంది. గత ఏడాది ముందుగానే రుతుపవనాలు తాకాయి. వాటి ప్రభావంతో విస్తారంగా వర్షాలు పడ్డాయి. కానీ ఈ ఏడాది ఎల్ నినో ప్రభావంతో వర్షాలు ఆశించిన స్థాయిలో పడవని వాతావరణ శాఖ ముందే హెచ్చరించింది. దీంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. నైరుతి రుతుపవనాల రాకతో వర్షాలు ఊపందుకునే అవకాశం ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..
