Homeఆంధ్రప్రదేశ్‌Telugu Desam Party Rajya Sabha Selection: టిడిపి సీనియర్లకు ఎలా న్యాయం చేస్తారు?!

Telugu Desam Party Rajya Sabha Selection: టిడిపి సీనియర్లకు ఎలా న్యాయం చేస్తారు?!

Telugu Desam Party Rajya Sabha Selection: తెలుగుదేశం పార్టీ రాజ్యసభ ఎంపికను పూర్తి చేశారు చంద్రబాబు. పార్టీ తరపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ పేరు ఖరారు చేశారు. సామాజిక సమతూకం పాటిస్తూ.. యువతకు ప్రాధాన్యం ఇస్తూ ఈ ఎంపిక పూర్తి చేశారు. అయితే ఈ పదవులపై చాలామంది సీనియర్లు ఆశలు పెట్టుకున్నారు. కానీ సీనియారిటీ కంటే సామాజిక సమతూల్యత, యువతకే ప్రాధాన్యం ఇచ్చారు. పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకున్నారు. సీనియర్ నేతలను వేరే అవకాశాలు కల్పించాలని భావిస్తున్నట్లు అర్థమవుతోంది. అయితే కాపులకు ఒక పదవి.. బీసీలకు ఒక పదవి.. అగ్రవర్ణాలకు ఒక పదవి అన్నట్టు కేటాయించారు. ఇందులో సానా సతీష్ కాపు సామాజిక వర్గానికి చెందిన నేతకాగా.. భాష్యం రామకృష్ణ కమ్మ.. చింతకాయల విజయ్ బీసీ సామాజిక వర్గానికి చెందినవారు.

* పాపం యనమల..
టిడిపిలో చాలామంది సీనియర్లు రాజ్యసభ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తనకు అవకాశం కల్పించాలని కోరారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన కొనసాగుతున్నారు. పైగా చంద్రబాబుకు అత్యంత విధేయుడు. 1995 టీడీపీ సంక్షోభ సమయంలో స్పీకర్ గా ఉండి చంద్రబాబు కు అండగా నిలిచారు. అందుకే చంద్రబాబు సైతం పార్టీతో పాటు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి మంచి అవకాశాలు ఇస్తూ వచ్చారు. ఏడు పదుల వయసు దాటిన యనమల గౌరవప్రదమైన పదవీ విరమణ కోరుకున్నారు. తనకు పెద్దల సభకు వెళ్లాలని ఉంది అని అధినేత చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్లారు. అయినా ఈసారి ఆయనకు అవకాశం దక్కలేదు. అయితే ఇంకా మూడేళ్ల వ్యవధి ఉండడంతో.. తప్పకుండా యనమల రామకృష్ణుడు కు అవకాశం ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది.

* గల్లా జయదేవ్ సైతం..
మాజీ ఎంపీ గల్లా జయదేవ్ కూడా రాజ్యసభ పదవి పై ఆశలు పెట్టుకున్నారు. గుంటూరు ఎంపీగా ఉన్న ఆయన గడిచిన ఎన్నికలకు ముందు క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు. ఆయన స్థానంలో పోటీ చేసిన పెమ్మసాని చంద్రశేఖర్ ఎంపీగా గెలవడమే కాదు కేంద్ర మంత్రి అయ్యారు. వాస్తవానికి గల్లా జయదేవ్ పొజిషన్ కూడా అదే. ఈసారి పోటీ చేసి గెలిచి ఉంటే ఆయన కేంద్ర మంత్రి అయ్యేవారు. అయితే రెండుసార్లు టిడిపి తరఫున ఎంపీగా గెలిచిన జయదేవ్ తనకు రాజ్యసభకు ఎంపిక చేస్తారని ఆశించారు. కానీ ఈసారి ఆ అవకాశం దక్కలేదు. రాజ్యసభ ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వర్ల రామయ్య పేరు వినిపిస్తూనే ఉంటుంది. ఈసారి కూడా ఆయన పేరు తెరపైకి వచ్చింది. కానీ చివరి నిమిషంలో చంద్రబాబు బీసీ సామాజిక వర్గానికి చెందిన చింతకాయల విజయ్ వైపు మొగ్గు చూపారు. దీంతో వర్ల రామయ్య కు ఛాన్స్ లేకుండా పోయింది.

* తెలంగాణ నేతలు సైతం..
మరోవైపు తెలుగుదేశం పార్టీని అట్టి పెట్టుకున్న తెలంగాణ నేతల్లో కంభంపాటి రామ్మోహన్ రావు ఒకరు. ఆయన సైతం ఈసారి రాజ్యసభ పదవి ఆశించారు. కానీ ఛాన్స్ దక్కలేదు. ఏపీ నుంచి తెలంగాణ నేతలకు అవకాశం ఇస్తే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని తెలిసి చంద్రబాబు పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సైతం రాజ్యసభ పదవి ఆశించారు. కానీ ఆయనకు అవకాశం దక్కలేదు. మొన్నటి ఎన్నికల్లో మైలవరం సీటును వసంత కృష్ణ ప్రసాద్ కోసం త్యాగం చేశారు దేవినేని ఉమామహేశ్వరరావు. రాజ్యసభ కానీ ఎమ్మెల్సీ కానీ ఇస్తారని ప్రచారం నడిచింది. అయితే ఈసారి రాజ్యసభ పదవికి కనీసం దేవినేని ఉమామహేశ్వరరావు పేరును పరిగణలోకి తీసుకోకపోవడం ఆయన అనుచరుల్లో అసంతృప్తి నింపింది. అయితే ఈ సీనియర్ లందరికీ హై కమాండ్ నుంచి సమాచారం ఉంది. భవిష్యత్తులో అవకాశాలు కల్పిస్తామన్న హామీ ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version