Andhra Pradesh Local Elections: కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. స్థానిక ఎన్నికల నిర్వహణకు సిద్ధపడుతోంది. సాధారణంగా పంచాయతీ ఎన్నికలు అనేవి ముందుగా జరపడం సహజం. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం మున్సిపల్ ఎన్నికల వైపు మొగ్గు చూపింది. ముందుగా పట్టణాల్లో ఎన్నికలను నిర్వహించాలని నిర్ణయించింది. దీని వెనుక భారీ వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. 100కు పైగా మున్సిపాలిటీలు, 12 కార్పొరేషన్లను కైవసం చేసుకుని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని కోలుకోలేని దెబ్బతీయాలన్నది కూటమి ప్రణాళికగా తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాలతో పోల్చుకుంటే పట్టణ ప్రాంతాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనంగా ఉంది. అందుకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చావు దెబ్బ తీసేందుకు ముందుగా మున్సిపల్ ఎన్నికల వైపు కూటమి అడుగులు వేస్తోంది. మున్సిపల్ ఎన్నికల తర్వాత ప్రాదేశిక.. చివరిగా పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలన్నది ప్రణాళికగా తెలుస్తోంది.
* కేవలం ఆ కారణంతో..
పట్టణాల్లో విద్యాధికులు, ఉద్యోగ ఉపాధ్యాయులు అధికంగా ఉంటారు. అయితే వారిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఒక రకమైన వ్యతిరేక భావన ఉంది. పైగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విధానాలు కూడా పట్టణ ప్రాంత ప్రజలకు నచ్చడం లేదు. ఆ పార్టీ నేతలు చేస్తున్న ప్రకటనలు కూడా మింగుడు పడడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో గతంలో సంక్షేమ పథకాలు అమలు చేయడం వంటి కారణాలతో వైసిపికి ఓటు బ్యాంకు స్థిరంగా ఉంది. ఆపై స్థానిక సంస్థలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు ఇటీవల వరకు కొనసాగారు. వారు పట్టు నిలుపుకుంటూ వచ్చారు. అందుకే ముందుగా పంచాయితీలకు ఎన్నికలు నిర్వహిస్తే కూటమికి కాస్త ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. పైగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలు అనే మాట ఉండకూడదు అని జగన్ సొంత పార్టీ క్యాడర్ను హెచ్చరించారు. అలా చేస్తే పార్టీ నియోజకవర్గ బాధ్యతలను మార్చేస్తానంటూ ఇంచార్జ్లను హెచ్చరించారు. అందుకే ముందుగా మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించి తర్వాత మిగతా స్థానిక సంస్థలకు నిర్వహించాలన్నది కూటమి ప్రభుత్వ ఆలోచనగా అర్థం అవుతుంది.
* పట్టణాల్లో వైసీపీ బలహీనం..
పట్టణాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉండడంతో ఆ పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు రావడం ఖాయం. పైగా మూడు పార్టీల కలయికతో కూటమి దూకుడుగా ఉంటుంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో జత కలిపేందుకు ఏ పార్టీ ముందుకు రాదు. పైగా మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ అనుసరించిన తీరు ఆ పార్టీ శ్రేణులకు తెలుసు. అధికార పార్టీ ఎలాంటి దూకుడు కనబరుస్తుందో ఆ పార్టీకి తెలియంది కాదు.. అందుకే ముందుగా మున్సిపల్ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని చావు దెబ్బ కొట్టి.. మిగతా ప్రాదేశిక ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోంది కూటమి. చివరిగా గ్రామీణ ప్రాంతాలకు ప్రతీకలుగా నిలిచే పంచాయితీలను ఏకపక్షంగా గెలుచుకొని.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పుంజుకునే పరిస్థితి లేకుండా చేయాలన్నది కూటమి ఆలోచన. అందుకే ముందుగా మున్సిపల్ ఎన్నికల వైపు ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ నుంచి డిసెంబరు లోపు మొత్తం స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలన్నది ప్రభుత్వ ఆలోచనగా అర్థం అవుతుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో??



