AP Local Body Elections 2026: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. పంచాయితీతోపాటు మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే పంచాయతీల పాలకవర్గం ముగిసింది. కొత్తగా ప్రత్యేక అధికారులను కూడా నియమించారు. మున్సిపాలిటీలకు సైతం ఆర్డీవో స్థాయి అధికారులు ప్రత్యేక అధికారులుగా వచ్చారు. అయితే ముందుగా పంచాయితీలకు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. రెండేళ్ల పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని కూటమి భావిస్తోంది. ఎన్నికల నిర్వహణకు ఇదే సమయం అని అంచనా వేస్తోంది. మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సైతం స్థానిక ఎన్నికలకు సిద్ధపడుతోంది. ప్రతిచోట వైసీపీ అభ్యర్థి బరిలో ఉండాల్సిందేనని.. లేకుంటే మాత్రం వైసిపి ఇన్చార్జ్ పై వేటు వేస్తామని జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు. మరోవైపు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిస్తున్నారు.
* ఇదే నెలలో సంక్షేమ పథకాలు..
కూటమి ప్రభుత్వపరంగా ఈనెల కీలకం. ముఖ్యంగా ఇదే నెలలో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మత్స్యకారుల భరోసా వంటి పథకాలను కూటమి ప్రభుత్వం అమలు చేయనుంది. దీంతో ప్రజల్లో సంతృప్తి శాతం పెరుగుతుందని అంచనా వేస్తోంది. మరోవైపు కొత్త పింఛన్లకు సంబంధించిన బిగ్ అప్డేట్ వచ్చింది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. కొత్త పింఛన్లు మంజూరు చేసి.. ప్రజల్లో మరింత సంతృప్తి సాధించి.. ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచనలో కూటమి ఉంది. అయితే జూలై నుంచి స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
* ముందుగా పంచాయతీలకు..
ముందుగా పంచాయితీలకు ఎన్నికలు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 13 వేలకు పైగా పంచాయతీలు ఉన్నాయి. వీటికి ఏప్రిల్ నాలుగు తో పదవీకాలం గడువు ముగిసింది. అప్పటినుంచి ప్రత్యేక అధికారులను నియమించారు. మరోవైపు ఏప్రిల్ నుంచి 16వ ఆర్థిక సంఘం గడువు ప్రారంభం అయింది. పంచాయితీలకు పాలకవర్గాలు ఉంటేనే ఆర్థిక సంఘం నిధులు దక్కేవి. అందుకే ముందుగా పంచాయితీలకు ఎన్నికలు నిర్వహించాలని కూటమి ప్రభుత్వం సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. వీలైనంతవరకు పంచాయితీలను ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నాలు చేసే అవకాశం కనిపిస్తోంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఏకగ్రీవాలకు ఒప్పుకోవద్దు అని జగన్మోహన్ రెడ్డి గట్టిగానే చెప్పారు. అయితే క్యాడర్ మాత్రం విముఖత వ్యక్తం చేస్తోంది. స్థానిక ఎన్నికలు అంటేనే అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి. పైగా ఆర్థిక భారం తప్పేలా లేదు. కానీ అధినేత జగన్మోహన్ రెడ్డి వైఖరి చూస్తుంటే తప్పనిసరిగా బరిలో ఉండాల్సిందేనని చెబుతున్నారు. కానీ పార్టీ శ్రేణులు మాత్రం పులివెందుల జడ్పిటిసి ఎన్నికలను గుర్తుచేసుకొని భయపడుతున్నారు.
* 100కు పైగా మున్సిపాలిటీలకు..
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 110 కి పైగా మున్సిపాలిటీలు, 12 కార్పొరేషన్లు ఉన్నాయి. పట్టణాలతో పాటు నగరాల్లో కూటమికి సంతృప్తికర వాతావరణముంది. పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతుండడంతో అక్కడి ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అక్కడ కూడా కూటమి సత్తా చాటాలని చూస్తోంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఏకగ్రీవాలు కాకుండా పోటీ చేయించాలన్న ఆలోచనలో వైసిపి ఉంది. కానీ వైసీపీ క్యాడర్ మాత్రం అందుకు సుముఖంగా లేదు. కానీ అధినేత జగన్మోహన్ రెడ్డి పట్టుబడుతుండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పోటీ చేయాల్సి ఉంటుంది.
