Chandrababu Naidu BJP Rajya Sabha Seats: ఏపీ సీఎం చంద్రబాబు పెద్ద సాహసమే చేస్తున్నారు. ఈసారి కేంద్ర పెద్దలకు ఆయన నో చెప్పారు. రాజ్యసభ పదవుల విషయంలో ఈసారి అవకాశం ఇవ్వలేమని తేల్చి చెప్పారు. కానీ బిజెపి పెద్దలు మాత్రం తమ ప్రతిపాదన పంపించారు. ఏపీ నుంచి నలుగురు రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేస్తున్న సంగతి తెలిసిందే. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వాని, పిల్లి సుభాష్ చంద్రబోస్ పదవీ విరమణ చేయనున్నారు. వీరితోపాటు టిడిపికి చెందిన సానా సతీష్ పదవీ విరమణ చేస్తారు. వీరి స్థానంలో కొత్త వారి ఎంపిక కోసం ఎన్నిక జరగనుంది. ఈనెల 8 నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. అయితే ఇప్పుడు అభ్యర్థుల ఎంపిక అనేది చంద్రబాబుకు తలనొప్పిగా మారనుంది. ముఖ్యంగా నాలుగు పదవులను కూటమిలోని మూడు పార్టీలకు సర్దుబాటు చేయడం పెద్ద కసరత్తు. అయితే టిడిపిలో విపరీతమైన పోటీ ఉన్న నేపథ్యంలో బిజెపికి ఈసారి అవకాశం ఇవ్వలేమని చంద్రబాబు తేల్చి చెప్పినట్లు ప్రచారం సాగుతోంది. ఈ విషయంపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ కు సమాచారం అందించగా… ఆయన కేంద్ర పెద్దలకు నివేదించారు.
* దేశవ్యాప్తంగా 24 ఖాళీలు..
దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల నుంచి 24 మంది రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. అందులో 11 రాజ్యసభ సీట్లు నేరుగా బిజెపికి దక్కే అవకాశం ఉంది. ఆరు చోట్ల మాత్రం ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు దక్కనున్నాయి. అందులో ఏపీలో నాలుగు సీట్లు ఉన్నాయి. అయితే ఈ నాలుగింటిలో ఒకదానిని జనసేనకు కేటాయించి.. టిడిపి మూడు తీసుకోవాలని భావిస్తోంది. ఇటీవల రాజ్యసభ పదవుల ఎంపికపై బిజెపి కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఏపీ నుంచి ఒక పదవి తీసుకోవాల్సిందేనని నేతలు అభిప్రాయపడ్డారు. కానీ ఇచ్చేందుకు మాత్రం తెలుగుదేశం పార్టీ సుముఖంగా లేదు. ఎందుకంటే ఇంతకుముందు రెండుసార్లు రాజ్యసభ పదవులను బిజెపికి కేటాయించింది టిడిపి.
* రెండుసార్లు ఛాన్స్..
ఓ ముగ్గురు సభ్యులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. కూటమి అధికారంలోకి వచ్చిన కొత్తలో ఆర్ కృష్ణయ్య, బీదా మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణలు రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నికల్లో.. బిజెపికి ఒకటి, టిడిపికి రెండు రాజ్యసభ పదవులు దక్కాయి. తర్వాత విజయసాయిరెడ్డి తన రాజ్యసభ పదవితో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అప్పుడు కూడా బిజెపి ఆ పదవిని తీసుకుంది. ఇప్పటివరకు రెండు బిజెపికి, రెండు టీడీపీకి దక్కాయి. జనసేనకు ఎటువంటి ప్రాతినిధ్యం లేదు. తెలుగుదేశం పార్టీలో ఆశావహుల సంఖ్య అధికంగా ఉంది. అందుకే ఈసారి నాలుగింటిలో మూడు పదవులను తీసుకోవాలని చూస్తోంది టిడిపి. జనసేనకు ఒకటి కేటాయించనుంది. బిజెపికి రాజ్యసభలో మెజారిటీ మార్కు దగ్గరలోకి వచ్చింది. ఈసారి రాజ్యసభ పదవుల భర్తీతో పూర్తి ఆధిపత్యం రానుంది. అందుకే ఏపీ విషయంలో పట్టుబట్టి అవకాశం లేదు. కానీ చివరి వరకు మాత్రం ప్రయత్నంలో ఉంటుంది. మరి చంద్రబాబు మెత్తబడతారా? లేకుంటే పదవి కేటాయిస్తారా? అన్నది చూడాలి.
