AP housing scheme 15 lakh houses: ఏపీ ప్రభుత్వం( AP government) కీలక నిర్ణయాలు దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా ఎన్నికల హామీలపై దృష్టి పెట్టింది. ప్రతి హామీని నెరవేర్చి ప్రజల అభిమానాన్ని పొందాలని భావిస్తోంది. ఇప్పుడు గృహ నిర్మాణంపై దృష్టి పెట్టింది ఏపీ ప్రభుత్వం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పేదలందరికీ ఇళ్ల పంపిణీ పై కార్యాచరణ సిద్ధం చేస్తోంది. స్పష్టమైన కాల పరిమితిని పెట్టుకొని పేదల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని భావిస్తున్నారు సీఎం చంద్రబాబు. ప్రతి మూడు నెలలకు ఒకసారి సామూహిక గృహ ప్రవేశాలు చేసేలా ఒక ప్రణాళిక సిద్ధం చేస్తోంది ఏపీ ప్రభుత్వం. వచ్చే ఉగాది నాటికి అంటే ఏడాది కాలంలో ఐదు లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్ల తాళాలు అందించే విధంగా లక్ష్యం నిర్ణయించింది. పెరిగిన గృహ నిర్మాణ భారంతో ఒక్కో యూనిట్ ధరను కూడా పెంచింది. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ. 1.20 లక్షలు అందిస్తుండగా దానిని..రూ.2.39 లక్షలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. ఇది నిజంగా నిర్మాణదారులకు గుడ్ న్యూస్.
నెరవేరనున్న హామీ
అర్హులైన పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని చంద్రబాబు( CM Chandrababu) హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ పేదలకు శాశ్వత గృహ వసతి కల్పించడమే లక్ష్యమని ఆయన ప్రకటన చేశారు. అయితే ఇప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0 పథకం కింద మంజూరు అయ్యే ఇంటి యూనిట్ ధరను రూ. 1.20 లక్షల నుంచి రూ. 2.39 లక్షలకు పెంచారు. ఈ మేరకు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో రాష్ట్రంలో గృహ నిర్మాణం వేగవంతం చేసినట్లు అవుతుంది. ఏడాదికి ఐదు లక్షలు అంటే.. వచ్చే మూడేళ్లలో 15 లక్షల ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇంటి నిర్మాణానికి సంబంధించి అర్హుల నుంచి దరఖాస్తులు కూడా తీసుకున్నారు. ఎట్టకేలకు దీనికి కదలిక వచ్చినట్లు అవుతుంది.
పెరిగిన యూనిట్ ధర..
ప్రజలందరికీ సొంత ఇల్లు నిర్మించాలన్న ప్రణాళికలో భాగంగానే ప్రధానమంత్రి ఆవాస్ యోజన( Prime Minister Aawas Yojana) ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఈ ఇంటికి సంబంధించి కేంద్ర వాటా రాయితీ కింద రూ.72000.. అంటే 60%.. రాష్ట్ర ప్రభుత్వ వాటా రాయితీ రూ.48,000.. అంటే 40%.. కలిపి మొత్తం రూ.1.20 లక్షలు.. దీనికి జి రామ్ జి కింద 90 రోజుల పని దినాలకు కన్వర్జేన్స్ రూపంలో రూ.27000.. స్వచ్ఛభారత్ మిషన్ కింద రూ.12000… ఎన్ హెచ్ జి లోన్ పై వడ్డీ రాయితీ రూ.80000… కలిపి మొత్తం రూ.2.39 లక్షలు గా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తారన్నమాట. మొత్తానికి అయితే ఏపీలో పేదల సొంతింటి కల ఎట్టకేలకు తీరనుందన్నమాట.