AP TIDCO Houses: ఏపీ ప్రభుత్వం( AP government ) గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నో ఏళ్లుగా కలగా మిగిలిన టిడ్కో ఇళ్లకు మోక్షం కలగనుంది. రాష్ట్రవ్యాప్తంగా పూర్తిచేసిన లక్ష ఇళ్లను ఉగాదికి లబ్ధిదారులకు అందించనుంది. సీఎం చంద్రబాబు స్వయంగా గృహప్రవేశాల కార్యక్రమానికి హాజరుకానున్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం అప్పట్లో టిడ్కో ఇళ్లను మంజూరు చేసింది. అందులో కొన్నింటి నిర్మాణం కూడా పూర్తి అయ్యింది. ఇంతలో ఎన్నికలు రావడం, రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావడం జరిగింది. దీంతో ఆ ఇళ్ల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఆ ఇళ్ల ప్రాంగణంలో మౌలిక వసతుల కల్పన వంటివి జరగలేదు. ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడంతో దృష్టి పెట్టింది. వాటన్నింటినీ పూర్తి చేసి ఉగాది నాటికి గృహప్రవేశాలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
మూడు విభాగాలుగా నిర్మాణం..
వాస్తవానికి టిడ్కో ఇళ్లను( tidco house) మూడు విభాగాలుగా నిర్మించారు. 54,943 ఇళ్ళు 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నాయి. మరో 28,986 ఇళ్లు 430 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నాయి. 16,223 ఇళ్లు 365 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నాయి. ఇలా లక్ష వరకు నిర్మాణాలు దాదాపు పూర్తయ్యాయి. వీటిని ముందుగా ప్రారంభించి గృహప్రవేశాలు చేయాలని నిర్ణయించింది కూటమి ప్రభుత్వం. మిగతా చోట్ల వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని చూస్తోంది.
గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం..
పట్టణ పేదలకు గాను ఈ ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నది ప్రణాళిక. కానీ వైసీపీ ప్రభుత్వంలో వీటిపై తీవ్ర నిర్లక్ష్యం కొనసాగింది. గత ప్రభుత్వ హయాంలో ఈ ఇళ్ల నిర్మాణానికి గాను హడ్కో రుణం తీసుకునేందుకు ప్రయత్నాలు జరిగాయి. అధికారులు రెండేళ్లుగా ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేకపోయింది. కూటమి ప్రభుత్వం రావడం.. ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వడంతో హడ్కో ఏకంగా రూ.4451 కోట్ల రుణం ఇచ్చేందుకు అంగీకరించింది. వీటికి తోడు లబ్ధిదారులు తమ వాటా కింద 1500 కోట్ల రూపాయలు చెల్లించనున్నారు. అందుకే ఈ ఇళ్ల నిర్మాణం విషయంలో ఏపీ ప్రభుత్వం దూకుడు పెంచింది. జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తానికైతే ఉగాది రోజు లక్ష గృహప్రవేశాలతో సందడి ఉండనందన్న మాట.