CM Chandrababu: జగన్ కు ‘మద్యం’ షాక్ ఇచ్చిన చంద్రబాబు.. ఉచ్చు బిగించినట్టేనా? ఏం జరుగనుంది?

వైసీపీకి షాక్. జగన్ సర్కారులో జరిగిన అవినీతిపై సిఐడి విచారణ ప్రారంభం కానుంది. చంద్రబాబు శాసనసభలో స్పష్టమైన ప్రకటన చేశారు. మద్యం విధానంలో జరిగిన అవకతవకలపై దర్యాప్తునకు ఆదేశించారు.

Written By: Dharma, Updated On : July 24, 2024 6:27 pm
Follow us on

CM Chandrababu : ఏపీలో ఒక వ్యూహం ప్రకారం కూటమి పాలన కొనసాగుతోంది.ఒకవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇంకోవైపు గత ప్రభుత్వ వైఫల్యాలను బయటకు తీసి ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తోంది.సంక్షేమం మాటున ఏపీ ని ఎంతగా లూటీ చేశారో ప్రజలకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తోంది. అందుకే వరుసగా శ్వేత పత్రాలను విడుదల చేస్తోంది. ఇప్పటివరకు బయట విలేకరుల సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మూడు శ్వేత పత్రాలను విడుదల చేశారు చంద్రబాబు. కానీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతుండడంతో.. జగన్ సమక్షంలోనే మిగతా శ్వేత పత్రాలు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ జగన్ అసెంబ్లీకి డుమ్మా కొట్టారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపణలు చేస్తూ ఢిల్లీ వేదికగా ఉద్యమాన్ని ప్రకటించారు. జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టారు. అయితే అనుకున్నట్టుగానే చంద్రబాబు అసెంబ్లీ వేదికగా ఈరోజు జగన్ సర్కార్ ఎక్సైజ్ విధానంపై శ్వేత పత్రం విడుదల చేశారు.మద్యం విధానంలో భారీ అక్రమాలకు పాల్పడ్డారని వివరించారు. అందుకే దీనిపై సమగ్ర దర్యాప్తునకు సిఐడి విచారణ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. తొలిసారిగా సిఐడి దర్యాప్తునకు ఆదేశించడం విశేషం. దీనికి అసెంబ్లీలో ఎమ్మెల్యేలంతా స్వాగతించారు. సిఐడి దర్యాప్తును ఆహ్వానించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన మద్యం పాలసీని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అంతకుముందు ఎన్నికల్లో మద్య నిషేధానికి హామీ ఇచ్చినా.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అమలు చేయలేనని జగన్ తేల్చేశారు. ప్రభుత్వమే నేరుగా మద్యం దుకాణాలు నడిపింది. మద్యం తయారీ, పంపిణీ, సరఫరా, విక్రయాలన్నింటినీ ప్రభుత్వమే చేపట్టింది. దీంతో ఇప్పుడు అధికారం మారడంతో అక్రమాలు బయటపెట్టే పనిలో పడింది చంద్రబాబు సర్కార్.

* ఐదేళ్ల విధానంపై ఫోకస్
జగన్ ఐదేళ్ల కాలంలో మద్యం విధానంపై చంద్రబాబు సర్కార్ దృష్టి పెట్టింది. ఈరోజు శాసనసభలో చంద్రబాబు స్వేచ్ఛ పత్రం విడుదల చేశారు. మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పి.. ఎలా మభ్య పెట్టారో చంద్రబాబు వివరించే ప్రయత్నం చేశారు. నాసిరకం కొత్త కొత్త బ్రాండ్లు తెచ్చి.. ప్రజారోగ్యాన్ని ఎలా దెబ్బతీశారో వెల్లడించారు. దీని ద్వారా వైసిపి నేతలకు చెందిన డిస్టలరీలకు ఎలా మేలు జరిగిందో కూడా వివరించే ప్రయత్నం చేశారు. పురుగు రాష్ట్రాలతో పోలిస్తే నాసిరకం మద్యం బ్రాండ్లను తెచ్చి భారీగా అమ్మకాలు చేసి దోపిడీ చేశారని చంద్రబాబు ఆరోపించారు. పేరుకే ప్రభుత్వమని.. వైసీపీ నేతల జేబుల్లోకి మద్యం సొమ్ము వెళ్లిపోయిందని చంద్రబాబు ఆధారాలతో సహా వివరించారు.

* అటకెక్కిన నిషేధం
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం విధానాన్ని మార్చింది. ప్రభుత్వమే నేరుగా మద్యం దుకాణాలను నడపాలని డిసైడ్ అయ్యింది. ఏటా 25% షాపులను తగ్గించి.. నాలుగేళ్లలో సంపూర్ణ మధ్య నిషేధం వైపు అడుగులు వేస్తానని జగన్ ప్రకటించారు. కానీషాపులు తగ్గించలేకపోయారు. మద్యనిషేధం అమలు చేయలేక చేతులెత్తేశారు. పైగా మద్యం ధరలను అమాంతం పెంచేశారు. తద్వారా పేదవాడు తాగడం మానేస్తాడని కొత్త భాష్యం చెప్పారు. కానీ మద్యం విషయంలో జగన్ చెప్పిన ఒక్క హామీ కూడా అమలు కాలేదు. పైగా నాసిరకం మద్యంతో వేలాదిమంది చనిపోయారు అన్న ఆరోపణలు ఉన్నాయి. వేల కోట్ల రూపాయల దోపిడీ జరిగిందన్న కామెంట్స్ కూడా వినిపించాయి.

* అడుగడుగునా అవకతవకలు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మద్యం విధానంపై దృష్టి పెట్టారు చంద్రబాబు. ప్రభుత్వంలోని ఇతర శాఖల డబ్బు తీసుకొచ్చి ఎక్సైజ్ శాఖలో పెట్టుబడులు పెట్టించారని.. దీనివల్ల ఆయా శాఖలకు 250 కోట్ల నష్టం వాటిల్లినట్లు చంద్రబాబు తాజాగా ప్రకటించారు. డిజిటల్ చెల్లింపులు కూడా చేయకుండా.. నగదు లావాదేవీలతో భారీ దోపిడీకి తెర తీశారని కూడా చెప్పుకొచ్చారు. వాటన్నింటినీ సరిచేసి కొత్త మద్యం విధానాన్ని ప్రవేశపెడతామని ప్రకటించారు. వైసిపి హయాంలో మద్యం అక్రమాలపై సిఐడి విచారణ చేయిస్తున్నట్లు చంద్రబాబు శాసనసభలో ప్రకటించారు. కూటమి ప్రభుత్వపరంగా వైసీపీ పై తొలి దర్యాప్తు ఇదే కావడం విశేషం.