AP Elections 2024
AP Elections 2024: ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీకి సంబంధించి ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. 175 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. ముందుగా ఏజెంట్ల సమక్షంలో అధికారులు మాక్ పోలింగ్ నిర్వహించారు. అనంతరం పోలింగ్ను ప్రారంభించారు. ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారు. ముఖ్యంగా కొత్తగా ఓటు దక్కించుకున్న యువత.. ఓటు వేసేందుకు ఉత్సాహం చూపారు.
అయితే ప్రారంభం నుంచే చెదురుమదురు ఘటనలు చోటుచేసుకున్నాయి. అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం పాపక్క గారి పల్లెలో వైసీపీ నేతలు అరాచకానికి దిగారు. టిడిపి ఏజెంట్లను బలవంతంగా బయటకు లాగేశారు. పల్నాడు జిల్లా రెంటచింతల మండలం రెంటాలలో టిడిపి ఏజెంట్ల పై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటనపై ఈ సీరియస్ అయ్యింది. అదనపు బలగాలను పంపించాలని యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది. వైయస్సార్ కడప జిల్లా చాపాడు మండలం చిన్న ఉలవలూరులో వైసిపి కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు. టిడిపి ఏజెంట్ను పోలింగ్ స్టేషన్ నుంచి బయటకు లాగేశారు. చిత్తూరు జిల్లా పీలేరులో టిడిపికి చెందిన ముగ్గురు పోలింగ్ ఏజెంట్లను వైసీపీ నేతలు కిడ్నాప్ చేశారంటూ తెలుగుదేశం ఈసీకి ఫిర్యాదు చేసింది. పలుచోట్ల ఈవీఎంలు మొరాయించాయి. కర్నూలు జిల్లా హాలహర్వి, బాపురం పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలు పనిచేయలేదు. దీంతో అక్కడ పోలింగ్ నిలిచిపోయింది.
ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అధికార వైసిపి ఒంటరి పోరాటం చేస్తుండగా.. టిడిపి,బిజెపి, జనసేన కూటమి కట్టాయి. మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి సైతం పోటీ చేస్తోంది. అయితే ప్రధానంగా కూటమి, వైసీపీ మధ్య హోరాహోరీ ఫైట్ ఉంది. ఈ తరుణంలో పోటా పోటీగా ప్రచారం చేసుకున్నాయి. గెలుపు కూడా అంత ఈజీ కాదని సర్వేలు తేల్చి చెప్పడంతో.. అన్ని పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఈ క్రమంలో పోలింగ్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సాయంత్రం ఐదు గంటల వరకు ఓటింగ్ కు ఛాన్స్ ఉంది. ఓ ఆరు నియోజకవర్గాల్లో మాత్రం సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్కు ఛాన్స్ ఇచ్చింది ఈసి.