Nellore: తల్లి, కొడుకును వెంటాడిన మృత్యువు.. ఇలా కబళించేసింది

నెల్లూరు జిల్లా సైదాపురం మండలం చాగణం గ్రామానికి చెందిన సుభాషిని అనే మహిళ అంగన్వాడి కార్యకర్తగా పనిచేస్తున్నారు. ఆమెకు కావలి పరిధిలో ఎన్నికల విధులు కేటాయించారు.

Written By: Dharma, Updated On : May 13, 2024 10:12 am

Nellore

Follow us on

Nellore: ఒక్కోసారి ప్రమాదాలు ఏ రూపంలో వస్తాయో తెలియదు. మృత్యువు ఎలా కబళిస్తుందో కూడా చెప్పలేము. అయితే రోడ్డు ప్రమాదాల రూపంలో ఓ కుటుంబానికి కుటుంబమే ప్రాణాలు కోల్పోవడం విచారకరం. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో వెలుగు చూసింది ఈ విషాద ఘటన. రైల్వే ట్రాక్ పై పడిపోయిన తల్లిని రక్షించే క్రమంలో కుమారుడు చనిపోయాడు. అటు తల్లిని కాపాడలేకపోయాడు.

నెల్లూరు జిల్లా సైదాపురం మండలం చాగణం గ్రామానికి చెందిన సుభాషిని అనే మహిళ అంగన్వాడి కార్యకర్తగా పనిచేస్తున్నారు. ఆమెకు కావలి పరిధిలో ఎన్నికల విధులు కేటాయించారు. ఆదివారం ఉదయం రైలులో గూడూరు నుంచి కుమారుడు విజయ్ కుమార్ తో కలిసి వచ్చారు. వారు ఎన్నికల విధులకు గాను విట్స్ కళాశాలకు రిపోర్ట్ చేయాల్సి ఉంది. ఇది రైల్వే స్టేషన్ కు పడమర వైపు ఉంది. త్వరగా వెళ్లవచ్చని భావించి ప్లాట్ ఫాం పై కాకుండా రైల్వే ట్రాక్ పై దిగారు. అదే సమయంలో ఆ మార్గంలో సూపర్ ఫాస్ట్ రైలు వస్తోంది. దీనిని సుభాషిని గమనించలేదు. ఆపదలో ఉన్న తల్లిని కాపాడేందుకు కుమారుడు విజయ్ కుమార్ ప్రయత్నించాడు. ఇద్దరినీ రైలు ఢీ కొట్టింది. క్షణంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఒక్కసారిగా అక్కడున్న ప్రయాణికుల్లో ఆందోళన రేకెత్తించింది. ప్రతి ఒక్కరి కళ్ళు చెమ్మగిల్లాయి.

సుభాషిని భర్త ప్రకాష్ మూడు నెలల కిందట రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. అప్పటినుంచి కుమారుడితో కలిసి నివాసం ఉంటోంది. ఎన్నికల విధులకు గాను వెళుతూ.. రైలు ప్రమాదంలో కన్ను మూసింది. ఆ కుటుంబంలో ఎవరు మిగలలేదు. దీంతో స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు.