Homeఆంధ్రప్రదేశ్‌AP Elections 2024: వైసీపీలో అసహనమా? అంతర్మధనమా?

AP Elections 2024: వైసీపీలో అసహనమా? అంతర్మధనమా?

AP Elections 2024: వైసీపీది సేమ్ టిడిపి పరిస్థితి. గత ఎన్నికల్లో అధికార పార్టీగా ఉన్న టిడిపి కోరుకున్నట్టు ఒక్క పని కూడా జరగలేదు. ఎలక్షన్ క్యాంపెయిన్ మొత్తం వైసిపి చెప్పినట్టే జరిగింది.అధికారుల మార్పు ఆ పార్టీ సిఫారసుల మేరకే జరిగింది.పోలింగ్ కూడా వారికి లబ్ధి చేకూరేలా నిర్వహించారు. చంద్రబాబుపై కేంద్ర పెద్దల ఆగ్రహాన్ని నాడు జగన్ సద్వినియోగం చేసుకున్నారు. అయితే ఇప్పుడు అదే పరిస్థితి జగన్ కు ఎదురయింది. చివరకు ఈసీ నిర్ణయాలపై కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది. ఒక్కటంటే ఒక్కటి కూడా అనుకూలంగా లేదు.చివరకు పోలింగ్ నాడు సహకరిస్తారనుకున్న యంత్రాంగం ఎదురు తిరిగింది.ఎంత దాకా పరిస్థితి వచ్చిందంటే.. నిన్నటి వరకు పోలీస్ శాఖకు ఆదేశాలు ఇచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వారిపై.. అదే పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసినంత దాకా. దీంతో వైసీపీ నేతలకు మైండ్ బ్లాక్ అవుతోంది. రేపు అన్నది ఒకటి ఉంది అని గుర్తించుకోండి.. అని అధికారులకు హెచ్చరించే దాకా పరిస్థితి వచ్చింది.

గత ఎన్నికల సమయంలో ఒక్క అధికారి కూడా టిడిపి మాట వినలేదు.ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టారో అంతలా పెట్టారు.ఇప్పుడు అదే అధికారులు వైసీపీకి కూడా ఎదురు తిరిగారు. కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. నెల్లూరు జిల్లా కలెక్టర్ తమకు సహకరించలేదని.. కూటమికి అనుకూలంగా పనిచేసారని సాక్షాత్ ఆ జిల్లా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎలక్షన్ కమిషన్ మొత్తం టిడిపి కూటమికి బాగా సహకరించిందని నరసాపురం వైసీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ తెగ బాధ పడిపోయారు. మంత్రి అంబటి రాంబాబు అయితే తన నియోజకవర్గంలో రెండు చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని ఏకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పేర్ని నాని అయితే తెగ బాధ పడిపోయారు. తమ ఫిర్యాదులను పట్టించుకోని ఎలక్షన్ కమిషన్.. టిడిపి కూటమి నేతలు ఇలా అడిగారో లేదో యాక్షన్ లోకి దిగుతున్నారని వాపోయారు.

ఏపీలో శుక్రవారం రెండు ఘటనలు వైసీపీకి కంటిమీద కునుకు లేకుండా చేశాయి.ఒకటి ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్,రెండు సజ్జల రామకృష్ణారెడ్డి పై క్రిమినల్ కేసు నమోదు. ఈ రెండు పరిణామాలతో వైసిపికి తత్వం బోధపడింది. పూర్తిస్థాయి క్లారిటీ వచ్చింది. అధికారుల్లో మార్పు, న్యాయస్థానాల తీర్పులు చూసి మైండ్ బ్లాక్ అవుతోంది. ఎక్కడో తేడా కొడుతోంది అన్న అనుమానాలు బలపడుతున్నాయి. కేవలం నాయకత్వం మేకపోతు గాంభీర్యం చూపిస్తోందని.. సగటు వైసిపి అభిమాని ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే సజ్జలపై కేసు నేపథ్యంలో.. రేపు అంటూ ఒకటి ఉంటుందని పేర్ని నాని అధికారులను హెచ్చరించారు. అయితే ఆయనకు తెలియంది కాదు.. రేపు అనేది ఒక క్లారిటీ రావడం వల్లే అధికారుల్లో మార్పు వచ్చిందన్న విషయం ఆయన తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తానికైతే వరుసగా జరుగుతున్న పరిణామాలు వైసీపీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కనీసం ఈరోజు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల చెల్లుబాటు విషయంలో న్యాయస్థానం ఎటువంటి తీర్పు ఇస్తుందో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version