Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu: చంద్రబాబు సేఫ్ గేమ్ అట్లుంటది

Chandrababu: చంద్రబాబు సేఫ్ గేమ్ అట్లుంటది

Chandrababu: ఏపీలో ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. ఎన్డిఏ కూటమిలో అభ్యర్థుల ఎంపిక చిత్ర విచిత్రంగా జరుగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుండడం విశేషం. 2014 ఎన్నికల్లో టిడిపి, బిజెపి మధ్య పొత్తు కుదిరినప్పుడు.. బిజెపికి కేటాయించిన స్థానాల్లో.. ఆ పార్టీకి చెందిన సీనియర్లే పోటీ చేసేవారు. ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్ మూలాలు ఉన్నవారు అభ్యర్థులుగా బరిలో దిగేవారు. కానీ ఈసారి ఆ పరిస్థితి లేదు. పక్క పార్టీల నుంచి చేరిన వారికి ప్రాధాన్యం ఇచ్చారు. ఎటువంటి బిజెపి నేపథ్యం లేని వారు సైతం టిక్కెట్లు దక్కించుకున్నారు. చివరి నిమిషం వరకు అనపర్తి, దెందులూరు విషయంలో పెను తుఫాన్ నడిచింది. అనపర్తి బిజెపికి కేటాయించడం, ఆ సీటును టిడిపి ఇన్చార్జ్ ఆశిస్తుండడం.. అదే సమయంలో అనపర్తి బదులు దెందులూరు చర్చకు రావడం.. అక్కడ టిడిపి ఫైర్ బ్రాండ్ చింతమనేని ప్రభాకర్ ఉండడంతో జఠిలంగా మారుతుందని అంతా భావించారు. కానీ ఇక్కడ వివాదం టీ కప్పులో తుఫానుగా మిగిలింది. అయితే ఇదంతా చంద్రబాబు వాడిన సేఫ్ గేమ్ గా ప్రచారం జరుగుతోంది.

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. లోక్సభ తో పాటు ఏపీ అసెంబ్లీకి సైతం ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొత్తం ఏడు విడతల్లో ఎన్నికలు జరుగుతుండగా.. ఏపీలో మాత్రం నాలుగో విడత పోలింగ్ మే 13న జరగనుంది. అయితే ఎన్డీఏ మధ్య సీట్ల సర్దుబాటు ప్రక్రియలో భాగంగానే నాలుగో విడత పోలింగ్ నకు చంద్రబాబు పావులు కదిపినట్లు వార్తలు వచ్చాయి. ఎన్డీఏలో ప్రధాన పార్టీగా తెలుగుదేశం పార్టీ ఉంది. సహజంగానే సీట్ల కేటాయింపులో ఆ పార్టీపై ఒత్తిడి ఉంటుంది. ముఖ్యంగా బీజేపీకి పది అసెంబ్లీ సీట్లు ఇవ్వాలన్న విషయంలో టిడిపిలో తీవ్ర తర్జనభర్జన జరిగింది. బిజెపికి కేటాయించిన సీట్లు టిడిపికి పట్టు ఉన్నవే. పైగా అక్కడ సీనియర్లు ఉన్నారు. ఈ తరుణంలో చంద్రబాబు పురందేశ్వరితో కీలక చర్చలు జరిపారు. అనపర్తిని బిజెపికి విడిచి పెట్టాలని పురందేశ్వరి కోరారు. అయితే ఆ సీటు సోము వీర్రాజు కేటాయిస్తారని ప్రచారం జరిగింది. కానీ ఆయనకు బదులు గత ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా పోటీ చేసిన శివరామకృష్ణంరాజుకు టికెట్ ఇచ్చారు. అయితే అప్పటికే టిడిపి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేరును అధిష్టానం ప్రకటించి ఉంది. దీంతో ఆయన తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. గత ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయిన వ్యక్తికి ఎలా టిక్కెట్ ఇస్తారని నల్లమిల్లి ప్రశ్నించేసరికి అది ప్రజల్లోకి బలంగా వెళ్ళింది.

బిజెపితో పాటు టిడిపి పై ముప్పేట ఒత్తిడి పెరిగింది. గెలిచిన సీటు కావడంతో ఆ రెండు పార్టీలు ఆలోచనలో పడ్డాయి. అనపర్తి బదులు దెందులూరు ఇస్తే తీసుకుంటామని బిజెపి ముందుకు వచ్చింది. దెందులూరు లో బిజెపికి సీనియర్ నేత గారపాటి చౌదరి ఉన్నారు. అయితే అక్కడ కూడా చింతమనేని ప్రభాకర్ రూపంలో బలమైన అభ్యర్థి టిడిపికి ఉన్నారు. పైగా ఈ రెండు సీట్లు బిజెపికి కేటాయిస్తే.. వైసిపి గెలిచే ఛాన్స్ ఉందని అంతర్గత సర్వేల్లో తేలింది. అదే జరిగితే ఓడిపోయిన సీట్లను చంద్రబాబు తమకు అంటగట్టారన్న అపవాదు పడుతుంది. అందుకే అనపర్తిలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని బిజెపిలోకి పంపించి ఆ పార్టీ అభ్యర్థిని చేశారు. చింతమనేని ప్రభాకర్ కు లైన్ క్లియర్ చేశారు. మొత్తానికైతే చంద్రబాబు ఆడిన సేఫ్ గేమ్ లో బిజెపి పావుగా మారిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version