AP Land Scam: ఏపీలో( Andhra Pradesh) మరో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో సెంటు స్థలం ఇచ్చిన సంగతి తెలిసిందే. పేదలకు ఇళ్ల స్థలాలు, పట్టాల పేరుతో ఇచ్చిన భూముల్లో భారీ అవినీతి చోటు చేసుకున్న ఆరోపణలు అప్పట్లోనే వినిపించాయి. నివాసయోగ్యం కాని ప్రాంతాలు.. కొండ గుట్టలు.. ఊరికి దూరంగా.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతల భూములను భారీ ధరలకు కొనుగోలు చేసి.. పేదల ఇళ్ల స్థలాల పేరుతో అభివృద్ధి చేసి భారీగా నిధులు పక్కదారి పట్టించారన్న ఆరోపణలు ఉన్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపైన దృష్టి పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో విజిలెన్స్ విచారణ కొనసాగింది. భారీ అవినీతి జరిగిందని తేలడంతో.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం పట్టు బిగిస్తోంది. ఇక చర్యలు తీసుకోవడమే తరువాయి అన్నట్టు పరిస్థితి మారింది. అయితే ఈ పేదల ఇళ్ల స్థలాల స్కామ్ లో వైసిపి హయాంలో పెద్దల పాత్ర ఉందని తేలడం ఆందోళన కలిగిస్తోంది.
* అందరికీ ఇళ్ల పేరుతో..
జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy) హయాంలో నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పేరుతో భారీ ప్రాజెక్టు చేపట్టారు. జగనన్న కాలనీల పేరుతో పేదలకు సెంటు, సెంటున్నర స్థలం అందించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల భూములను సేకరించి అందించారు. ఇందుకు గాను నగరాలు పట్టణాల్లో ఉన్న ధరను వారికి ముట్ట చెప్పారు. అంతటితో ఆగకుండా ఆ స్థలాలను చదును చేసే బాధ్యతలను వైసీపీ నేతలకు కట్టబెట్టారు. ఆ రూపంలో సైతం వారికి భారీగా నగదు చెల్లింపులు చేశారు. సెంటు స్థలం పేరుతో పేదలు లబ్ధి పొందినది చాలా తక్కువ. పెద్దల రూపంలో వైసీపీ నేతలు పొందినది ఎక్కువ. అయితే ఇప్పుడు విజిలెన్స్ నివేదికలో ఆ స్కాం పూర్తిగా బయటకు వచ్చింది. దాదాపు సగానికి పైగా లేఅవుట్లలో లబ్ధిదారులు నిర్మాణానికి ముందుకు రాలేదు. నగరాలతో పాటు పట్టణాల్లో ఉండే లేఅవుట్లలో అయితే వైసిపి నేతలే బినామీల పేరుతో ఇంటి స్థలాలను దక్కించుకున్నారు.
* అప్పటి ప్రధాన అధికారిపై..
మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కీలక అధికారిగా వ్యవహరించిన అజేయ కల్లాం పేరు ప్రముఖంగా వినిపిస్తుండడం సంచలనంగా మారింది. ప్రధానంగా విశాఖ జిల్లా మధురవాడ పరిధిలోని రుషికొండ సమీపంలో ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టి.. లేఅవుట్ల అభివృద్ధి పేరుతో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో అజేయకల్లాం పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులే ఈ స్థాయిలో దోపిడీకి పాల్పడడం.. పేదల ఇళ్ల స్థలాల కోసం కేటాయించిన నిధులను సొంత ప్రయోజనాలకు వాడుకోవడం బయటపడింది.
* అన్ని ప్రాంతాల్లో..
ఒక్క విశాఖ జిల్లాలోనే కాదు ఇతర ప్రాంతాల్లో కూడా ఇళ్ల స్థలాల పేరుతో భారీ అవినీతి జరిగినట్లు తెలుస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలోని ఆవ భూముల కొనుగోలు వ్యవహారం ఈ స్కామ్ లోనే అత్యంత ప్రధానమైనదని తెలుస్తోంది. సాగు భూముల పేరు చెప్పి అప్పటి ప్రభుత్వం భారీగా ధరలు ఇచ్చి కొనుగోలు చేసింది. మార్కెట్ ధర కంటే ఓ అయిదు రెట్ల సొమ్ము ఇచ్చి.. ఆ మిగులు సొమ్మును అప్పటి అధికార పార్టీ నేతలు పంచుకున్నట్లు విజిలెన్స్ విచారణలో తేలింది. ఒక్క రాజమండ్రి పరిధిలోనే ఈ భూ సేకరణ ద్వారా వందల కోట్ల రూపాయలు చేతులు మారినట్లు గుర్తించింది విజిలెన్స్. చాలా జిల్లాల్లో వైసీపీ నేతలు తక్కువ ధరకు భూములు కొనుగోలు చేసి.. వాటిని ఇళ్ల స్థలాల కోసం అధిక ధరలకు అన్ని సొమ్ము చేసుకున్నట్లు విచారణలో తేలింది. భూ సేకరణ నుంచి లేఅవుట్ల చదును వరకు ప్రతి దశలోనూ కమీషన్లు పర్వం కొనసాగినట్లు విచారణలో తేలడం విశేషం.
* కఠిన చర్యలకు..
ఇప్పటివరకు మద్యం కుంభకోణమే ప్రధానమైనది అని అంతా భావించారు. కానీ అంతకుమించి ఈ భూముల వ్యవహారం నడిచింది. విజిలెన్స్ నివేదిక ఆధారంగా కఠిన చర్యలకు దిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడింది. అక్రమాలకు పాల్పడిన నేతలను, వారికి సహకరించిన అధికారులను విడిచి పెట్టే ప్రసక్తి లేదని ఇప్పటికే ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది. భూ సేకరణలో జరిగిన అవకతవకలపై క్రిమినల్ కేసులు నమోదు చేయడమే కాకుండా.. అక్రమంగా సంపాదించిన సొమ్మును రికవరీ చేసే దిశగా అడుగులు వేస్తోంది. పేదల ఎల్ల పేరుతో జరిగిన ఈ భారీ భూ దోపిడీ కేసులో కీలక అరెస్టులు జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.