AP Assembly Election Results 2024: ఏపీలో ఓట్ల లెక్కింపు సజావుగా కొనసాగుతోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం టిడిపి 127, జనసేన 19, బిజెపి 7 అభ్యర్థులు స్థానాలలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వైసిపి అభ్యర్థులు 22 స్థానాలలో లీడ్ లో ఉన్నారు. ఇక పార్లమెంట్ ఫలితాల విషయానికొస్తే టిడిపి 15, జనసేన 2, బిజెపి 5 స్థానాలలో లీడ్ లో ఉంది. వైసిపి మూడు స్థానాల్లో ఆధిక్యం లో కొనసాగుతోంది.
ఏపీలో కూటమి అధికారాన్ని ఏర్పాటు చేసే దిశగా కదులుతున్న నేపథ్యంలో.. పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా వైసిపి అభ్యర్థులలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ మినహా మిగతా వారంతా ఓటమి దిశగా పయనం సాగిస్తున్నారు. గుడివాడలో వైసీపీ అభ్యర్థి కొడాలి నాని వెనుకంజ వేశారు.. రెండవ రౌండ్ లెక్కింపు పూర్తయ్యే సరికి టిడిపి అభ్యర్థి మరింత లీడ్ లోకి రావడంతో.. వైసీపీ అభ్యర్థి కొడాలి నాని నిరాశతో కౌంటింగ్ కేంద్రం నుంచి వెనుతిరిగారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టిడిపి నాయకులను కొడాలి నాని తీవ్రంగా విమర్శించే వారని ఆరోపణలు ఉన్నాయి. పైగా అప్పట్లో నిండు శాసనసభలో చంద్రబాబు నాయుడిని దూషించడంతోనే కన్నీటి పర్యంతమయ్యారనే వాదనలు ఉన్నాయి. అయితే రెండవ రౌండ్ లోనే కొడాలి నాని ఇంటి ముఖం పట్టడం పట్ల సోషల్ మీడియాలో ట్రోల్స్ వ్యక్తమవుతున్నాయి. కృష్ణా యూనివర్సిటీ నుంచి కొడాలి నాని వెనక్కి వెళ్లిపోవడంతో.. ఆయన ఓటమిని ఒప్పుకున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఇక పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 19,000 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
బనగానపల్లి లో టిడిపి అభ్యర్థి జనార్దన్ రెడ్డి ముందంజలో ఉన్నారు.
సర్వేపల్లి లో టిడిపి అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
కోడుమూరు నియోజకవర్గంలో బొగ్గుల దస్తగిరి దూసుకుపోతున్నారు.
ప్రతిపాడు నియోజకవర్గంలో వరుపుల సత్యప్రభ లీడ్ లో కొనసాగుతున్నారు.
చింతలపూడిలో సొంగా రోషన్ కుమార్ పై చేయి సాధించారు.
విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం లో పిజివిఆర్ నాయుడు ( గణబాబు) లీడ్ లో కొనసాగుతున్నారు.
ఉరవకొండలో పయ్యావుల కేశవ్ దూసుకెళ్తున్నారు.
విశాఖ దక్షిణ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ ముందంజలో ఉన్నారు.
విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం లో బిజెపి అభ్యర్థి విష్ణుకుమార్ రాజు ఆధిక్యం లో కొనసాగుతున్నారు.
విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం లో వెలగపూడి రామకృష్ణ బాబు విజయం దిశగా పరుగులు తీస్తున్నారు.