Annadata Sukhibhava Latest Update: రైతులు ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్నారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆశాజనకంగా పడుతుండడంతో రైతులు వరి సాగుకు సన్నద్ధం అవుతున్నారు. ఇటువంటి సమయంలో రైతులకు పెట్టుబడి సాయంగా ఉపయోగపడేందుకు అన్నదాత సుఖీభవ పథకం నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టినట్లు సమాచారం. ఏటా మూడు విడతల్లో కేంద్ర ప్రభుత్వంతో కలిపి అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ యోజన పథకం కింద రూ.20 వేలు జమ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ వాటాగా రూ.14,000, కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ వాటాగా రూ.6000 చొప్పున సాయం అందిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఖరీఫ్ లో తొలి విడత సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది.
* సాంకేతిక కారణాలతో దూరం..
అయితే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి చాలా మంది రైతులు వివిధ సాంకేతిక కారణాలతో దూరమవుతూ వచ్చారు. అటువంటి వారికి సంబంధించి ఏవైనా తప్పులు ఉంటే సరి చేసుకునే అవకాశం కల్పించింది ప్రభుత్వం. ఇప్పటివరకు ఈ పథకం లబ్ధి పొందని రైతులు తమ సమీప రైతు సేవా కేంద్రాలకు సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. అక్కడ తమ వివరాలను నమోదు చేయించుకోవాలని సూచిస్తున్నారు. అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు పొందాలంటే రైతులు తమ భూముల వివరాలకు ఆధార్ అనుసంధానం తప్పనిసరిగా చేయించుకోవాలి. ఒకవేళ ఆధార్ ఇన్ యాక్టివ్ అని వస్తే సరి చేయించుకోవాలని కూడా అధికారులు సూచిస్తున్నారు. పీఎం కిసాన్ యోజన డబ్బులు పొందాలంటే ఈ కేవైసీ తప్పనిసరి.
* ఆధార్ లింక్ తప్పనిసరి..
చాలామంది అర్హత ఉన్నా అన్నదాత సుఖీభవ పథకం పొందలేకపోయారు. ఈ పథకం పొందాలంటే ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్, భూమి రికార్డుల్లో ఎలాంటి తప్పులు లేకుండా ముందే సరి చూసుకోవాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను చెల్లించే వారికి, విద్యుత్తును అధికంగా ఉపయోగించే వారికి, ఇళ్ల స్థలాలు, కార్లు వంటి నాలుగు చక్రాల వాహనాలు ఉన్నవారికి ఈ పథకం నుంచి మినహాయించారు. వారి స్థితిగతుల్లో ఏమైనా మార్పులు ఉంటే… దానికి సంబంధించిన పత్రాలతో సచివాలయాలు, రైతు సేవా కేంద్రాలు, వ్యవసాయ శాఖ కార్యాలయాలకు సంప్రదిస్తే అప్డేట్ లను సరి చేసుకోవాల్సి ఉంటుంది.

