Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ నిధులపై బిగ్ అప్డేట్ వచ్చింది. రైతులకు ఖరీఫ్ సాగు సాయం కింద నిధులు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడింది. కేంద్రం అందించే పీఎం కిసాన్ తో కలిపి రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద సాయం అందించేందుకు నిర్ణయించింది. జూన్ 20న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు అన్నదాత సుఖీభవ పథకం కింద తప్పుల సవరణకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. అన్నదాత సుఖీభవ కింద ఏటా మూడు విడతల్లో సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం 14 వేల రూపాయలు అందిస్తుండగా.. కేంద్ర ప్రభుత్వం 6000 రూపాయలు సాయం అందిస్తూ వస్తోంది. ఇప్పటివరకు కేంద్రం పీఎం కిసాన్ కింద 23 విడతల్లో రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసింది. గత ఏడాది నుంచి అన్నదాత సుఖీభవ అమలవుతోంది. రెండు విడతల్లో 7000 చొప్పున.. చివరి విడత 6000 రూపాయల చొప్పున జమ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది మార్చి నెలలో ఒక విడత నిధులు జమ అయ్యాయి.
* భారీగా పెరిగిన సాయం..
గతంలో రైతు భరోసా పేరుతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సాగు సాయం అందించేది. అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం వాటాగా రూ.7500 మాత్రమే అందించేవారు. కేంద్ర ప్రభుత్వంతో కలిసి కేవలం రూ.13,500 సాయం మాత్రమే అందేది. కానీ ఇప్పుడు ఆ సాయం మొత్తం 20 వేలకు పెరగగా.. రాష్ట్ర ప్రభుత్వం 14 వేల రూపాయలు అందిస్తూ వచ్చింది. ఈనెల 20న కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ నిధులు జమ చేస్తున్న నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే రోజున అన్నదాత సుఖీభవ నిధులు విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
* తప్పుల సవరణకు అవకాశం..
అర్హత గల ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ పథకం అందించేందుకు ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. తప్పుల సవరణకు కూడా అవకాశం ఇచ్చింది. ఏవైనా తప్పుల కారణంగా అన్నదాత సుఖీభవ సాయం పొందని రైతులు.. తమ సమీప రైతు సేవా కేంద్రాలకు వెళ్లి వివరాలను నమోదు చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. భూముల వివరాలకు ఆధార్ లింకు చేయించుకోవాలని కూడా చెబుతున్నారు. ఆధార్ ఇన్ యాక్టివ్ అని వస్తుంటే సరి చేయించుకుంటే అన్నదాత సుఖీభవ తో పాటు పిఎం కిసాన్ నిధులు జమకు అవకాశం ఉంటుంది. పీఎం కిసాన్ పొందేందుకు మాత్రం తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకోవాలి. తొలకరి వానలు పడుతుండడంతో రైతులు ఖరీఫ్ కు సిద్ధం అవుతున్నారు. ఈ పరిస్థితుల్లో అన్నదాత సుఖీభవ తో పాటు పీఎం కిసాన్ నిధులు జమ కానుండడం రైతులకు ఎంతో ప్రయోజనం.
