Andhra Pradesh Heatwave: ఏపీలో వేసవి తాపం పెరుగుతోంది. ఓవైపు ఎండలు, ఇంకోవైపు వేడి గాలులు, మరోవైపు ఉక్కపోత తో ప్రజలు అల్లాడిపోతున్నారు. అదే సమయంలో కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. ఇలా ఏపీలో భిన్న వాతావరణం కనిపిస్తోంది. పిడుగులు పడుతున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచిస్తోంది. ప్రజలకు కీలక సూచనలు చేసింది. ఎప్పటికప్పుడు తీవ్ర వడగాల్పులు, వేడి గాలులు వీచే ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు జారీచేస్తోంది. భిన్న వాతావరణం అంచనా వేయలేక చాలా జిల్లాల ప్రజలు మూల్యం చెల్లించుకుంటున్నారు. మధ్యాహ్నం వరకు తీవ్రమైన ఎండలు ఉండగా.. అటు తరువాత ఆకాశం మేఘావృతమై ఉరుములతో కూడిన వర్షం పడుతుంది. ఈ పరిస్థితుల్లో పిడుగుపాటుకు చాలామంది మృత్యువాత చెందుతున్నారు. అందుకే విపత్తుల నిర్వహణ సంస్థ ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ వస్తోంది.
* ఈరోజు ఎండ తీవ్రత..
ఈరోజు రాష్ట్రంలోని 46 మండలాల్లో తీవ్రవడగాలులు వీచే అవకాశం ఉంది. బుధవారం 54 మండలాల్లో తీవ్రమైన వేడి గాలులు, 15 మండలాల్లో వేడి గాలులు వీచే ఛాన్స్ కనిపిస్తోంది. రాష్ట్రంలో క్రమేపి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎప్పటికప్పుడు సూచనలు చేస్తోంది. మరోవైపు తెలంగాణ నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా కోరిమన్ ప్రాంతం వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి సాధారణ వర్షాలు పడతాయని అంచనా వేస్తోంది వాతావరణ శాఖ. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో సైతం పిడుగులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ కనిపిస్తోంది.
* పెరిగిన వేడి గాలులు..
మరోవైపు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి రాష్ట్రవ్యాప్తంగా. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఎండల తీవ్రత పెరిగింది. సోమవారం పార్వతీపురం మన్యం జిల్లా మక్కువలో 44.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. కర్నూలు జిల్లా చిప్పగిరి లో 43.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం విశేషం. సోమవారం 289 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం. మరోవైపు ఉరుములతో కూడిన వర్ష సూచనల నేపథ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేస్తోంది. విద్యుత్ స్తంభాలు, సెల్ టవర్లు, భారీ చెట్ల కింద ఉండకూడదని సూచిస్తోంది. మరోవైపు వేసవి తాపం దృష్ట్యా పిల్లలు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.