AP Heatwave Alert: ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత రోజురోజుకు పెరిగిపోతోంది. ఇకప్పుడు 40 సెల్సీయస్ డిగ్రీలు నమోదైతేనే హడలిపోయేవారు. కానీ ఇప్పుడు 45 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు అల్లాడుతున్నారు. ఆదివారం మార్కాపురం జిల్లా కంభం మండలంలో 44.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో APSDMA (ఆంధ్రప్రదేశ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ) తాజాగా ప్రజలకు హెచ్చరికలతో పాటే కొన్ని సూచనలు జారీ చేసింది. అవేంటంటే?
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదవుతోంది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఎండ తీవ్రత విపరీతంగా ఉంది. కడప, అనంతపురం, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో 42 నుంచి 44 డిగ్రీల వరకు టెంపరేచర్ నమోదవుతోంది. తీరప్రాంతాల్లో కూడా 41 డిగ్రీల స్థాయి వరకు వెళ్తోంది. దీంతో వాతావరణం వేడెక్కడంతో ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఎండవేడి భరించలేక ఇళ్లలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అయితే అత్యవసర పనుల నిమిత్తం బయటకు వెళ్లే వ్యవసాయ కార్మికులు, కూలీలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి సమయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
APSDMA హెచ్చరికల ప్రకారం సోమవారం నుంచి ఎండలు మరీ దండి కొడతాయి. విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని 23 మండలాల్లో వడగాల్పులు ఎక్కువగా వీస్తాయని పేర్కొంది. ఈ ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 42 నుంచి 45 డిగ్రీల వరకు ఉండవచ్చని తెలిపింది. హీట్ వేవ్ ప్రభావం తీవ్రంగా ఉండడం వల్ల వడగాల్పులు ఎక్కువవుతాయని తెలిపింది. దీంతో ఆర్ద్రత తగ్గి ఉక్కపోత మరింత పెరుగుతుందని APSDMA అధికారులు హెచ్చరించారు.
ప్రజలు ఉదయం 11 గంటలు నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లవద్దని, తగిన నీటి సరఫరా తీసుకోవాలని అంటున్నారు. తలనొప్పి, వాంతులు, డీహైడ్రేషన్ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలని చెబుతున్నారు. వ్యవసాయ కార్మికులు, పిల్లలు, వృద్ధులు శరీరానికి చల్లదనాన్ని ఇచ్చే పానీయాలు తీసుకోవాలని అంటున్నారు. ఈ ఎండలు రాష్ట్రంలో వ్యవసాయానికి, నీటి సమస్యలకు దారి తీస్తాయని అధికారులు చెబుతున్నారు. రైతులు పంటలను రక్షించుకోవాలని సూచించారు. రానున్న రోజుల్లో కూడా హీట్ వేవ్ కొనసాగుతుందని, ప్రజలు అప్డేట్స్ను ట్రాక్ చేయాలని APSDMA పిలుపునిచ్చింది.
