Congress: ఏపీలో కూటమికి సరికొత్త చిక్కులు కనిపిస్తున్నాయి. వైసీపీని అధికారం నుంచి దూరం చేయాలని టిడిపి, జనసేన, బిజెపి జతకట్టాయి. ఓటు బ్యాంకు చీలకుండా చూడాలని నిర్ణయించుకున్నాయి. ఎన్నో రకాల ఇబ్బందులను అధిగమించి సీట్లు సర్దుబాటు చేసుకున్నాయి. సానుకూల దృక్పథంతో మూడు పార్టీలు సాగుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీతో వైసిపి ఓట్లు చీలుతాయని భావించారు. కాంగ్రెస్ విషయంలో లైట్ తీసుకున్నారు. కానీ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన టిక్కెట్లు, నిలబెట్టిన నాయకులను గమనిస్తే కూటమి అవకాశాలకు గండి పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ తో రాష్ట్రవ్యాప్తంగా 50 నియోజకవర్గాల్లో కూటమికి ఎఫెక్ట్ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
షర్మిల కాంగ్రెస్ పగ్గాలు తీసుకున్నాక చాలామంది సీనియర్లు యాక్టివ్ అయ్యారు. కాంగ్రెస్ కంటే వ్యక్తిగతంగా చరిష్మ ఉన్నవారు ఈసారి పోటీకి ముందుకు వచ్చారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగిన నాయకులు.. గత రెండు ఎన్నికల్లో పోటీ చేసేందుకు వెనుకడుగు వేశారు. అయితే ఈ ఎన్నికల్లో మాత్రం తమకు తాముగా ముందుకు వచ్చారు. టికెట్ల కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. వీరంతా ఐదు వేల నుంచి పదివేల ఓట్లు వ్యక్తిగతంగా సమకూర్చుకున్న వారే. అయితే కాంగ్రెస్ అగ్రనాయకత్వం వైసీపీని టార్గెట్ చేయడంతో.. ఆ పార్టీ ఓట్లకే గండి పడతాయని అంతా భావించారు.కానీ క్షేత్రస్థాయిలో టిక్కెట్లు దక్కించుకున్న కాంగ్రెస్ అభ్యర్థులు కూటమి ఓట్లు చీల్చుతారని తెలుస్తోంది.
కాంగ్రెస్ టికెట్లు దక్కించుకున్న చాలామంది నాయకులు పట్ల ప్రజల్లో సానుభూతి ఉంది. అవి ఓట్ల రూపంలో మారితే ప్రధానంగా కూటమి అభ్యర్థులకు ఇబ్బందికరమే. ఎస్సీ నియోజకవర్గమైన తిరువూరులో ప్రాంతీయ కుమారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మాజీ మంత్రి కోనేరు రంగారావు కుమార్తె ఈమె. నియోజకవర్గంలో బలమైన క్యాడర్ ఉంది. గెలిచే ఛాన్స్ లేకపోయినా దాదాపు 20 నుంచి 30 వేల ఓట్ల వరకు పొందే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరో ఎస్సీ నియోజకవర్గం సింగనమలలో పిసిసి మాజీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ పోటీ చేస్తున్నారు. మంత్రిగా సుదీర్ఘకాలం ఉండడంతో ఈయనకు సొంత క్యాడర్ ఉంది. దాదాపు 20 నుంచి 25 వేల ఓట్లు ప్రభావితం చేసే ఛాన్స్ ఉంది. టెక్కలి నియోజకవర్గం లో కాంగ్రెస్ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి బరిలో దిగుతున్నారు. ఆమె తన కాలింగ సామాజిక వర్గం ఓట్లను చీల్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
కూటమిలో భాగంగా కాంగ్రెస్ వామపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో చిగురుపాటి బాబురావు పోటీ చేస్తున్నారు. ఈయన గత ఎన్నికల్లో జనసేనతో పొత్తులో భాగంగా 25 వేల ఓట్లు పొందారు. ఈసారి కూడా 10 నుంచి 15 వేల వరకు ఓట్లు చీల్చుతారని అంచనా. ఇది కూటమిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. వీరితోపాటు బాపట్ల నుంచి పోటీ చేస్తున్న జెడి శీలం, కాకినాడ నుంచి పోటీ చేస్తున్న పల్లంరాజు వంటి వారు సైతం భారీగా ఓట్లు చీల్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పటివరకు కాంగ్రెస్ కూటమితో వైసీపీకి నష్టమని టిడిపి కూటమి అంచనా వేసింది. అది తప్పని తేలడంతో ఇప్పుడు టిడిపి కూటమి కాంగ్రెస్ విషయంలో దిద్దుబాటు చర్యలకు దిగుతోంది.