Amaravati special system development: అమరావతిపై( Amravati capital ) ప్రత్యేకంగా దృష్టి పెట్టింది కూటమి ప్రభుత్వం. కేంద్రం చట్టబద్ధత కల్పించడంతో కొత్త ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. అమరావతి తొలి దశ నిర్మాణం 2028 నాటికి పూర్తి చేయాలన్న సంకల్పంతో ముందుకు సాగుతోంది. ఇదే సమయంలో రెండో విడత భూ సమీకరణ వేగవంతం చేసింది. మరోవైపు అమరావతిలో పోస్టల్ కార్యకలాపాలు ప్రారంభించాలని.. కొత్త పిన్కోడ్ ఇవ్వాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు చట్టబద్ధతతో అమరావతిలో ప్రత్యేక పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అమరావతి స్వయంపాలక సంస్థగా మారిన తర్వాత దానికి ప్రత్యేక పోలీస్ సిబ్బందిని కేటాయించి అంశంపై నివేదికను సిద్ధం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
భారీ ఎత్తున నిర్మాణాలు..
అమరావతిలో నవ నగరాలు నిర్మించాలన్నది ప్రభుత్వ ప్రణాళిక. ప్రభుత్వంతో పాటు ప్రైవేటు రంగ సంస్థలకు సంబంధించి భారీ నిర్మాణాలు జరుగుతున్నాయి. అందుకే భవిష్యత్తుపై దృష్టిలో పెట్టుకొని ముందుగానే ప్రత్యేక పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని చూస్తోంది ప్రభుత్వం. అక్రమాలు, అవినీతి, అధికారిక నిర్మాణాలపై నిరంతరం పర్యవేక్షణ ఉండేలా ఈ వ్యవస్థ ఉండాలని భావిస్తోంది. గతంలో ఆర్థిక వనరుల నిర్వహణ, యూజర్ చార్జీలు, డెవలప్మెంట్ చార్జీల వసూలుకు ప్రత్యేక నిబంధనలు రూపొందించాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. మొత్తంగా పరిపాలన కోసం ఒక అపెక్స్ బాడీ ఏర్పాటుకు వీలుగా పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలో, చట్టాల్లో మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. అపెక్స్ బాడీ నేరుగా నిధులు సమీకరించుకునేందుకు అధికారం కల్పించేలా ప్రతిపాదనలు సిద్ధం కానున్నాయి.
ఇటీవల ఘటనలు..
ఇటీవల అమరావతి రాజధానిలో కొన్ని రకాల ఘటనలు జరిగాయి. ముఖ్యంగా నిర్మాణ కంపెనీలకు సంబంధించి సామాగ్రి అగ్నిప్రమాదంలో కాలిపోయాయి. అయితే ఇది ప్రమాదవశాత్తు జరిగిందా? విద్రోహ కుట్ర? అన్నది తెలియడం లేదు. దీనిపై రకరకాల చర్చ అయితే మాత్రం నడుస్తోంది. అయితే ఈ ఘటనల దృష్ట్యా అమరావతికి ప్రత్యేక పోలీస్ వ్యవస్థ రావాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మరోవైపు అమరావతికి చట్టబద్ధత కల్పించిన నేపథ్యంలో ఇన్వెస్టర్లు భారీగా తరలివస్తారన్న అంచనా ఉంది. అమరావతి పై ఒక రాజకీయ వ్యవస్థ వ్యతిరేకంగా పనిచేస్తోంది. ఇటువంటి సమయంలో బలమైన రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయాల్సిన అనివార్య పరిస్థితి ప్రభుత్వానికి ఎదురైంది. అందుకే పోలీస్ వ్యవస్థ రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. కేవలం అమరావతికి నిర్దేశిత పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేస్తారని సమాచారం.