Tirumala Laddu : కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి. తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడానికి ప్రతి ఒక్కరూ ఆశపడుతుంటారు.స్వామి వారిని దర్శించుకున్న తరువాత వీలైనన్ని లడ్డూలు తీసుకువెళ్లాలని భావిస్తారు.ఇందుకోసం భక్తులు పోటీ పడుతుంటారు.దేశ విదేశాల్లో కూడా తిరుమల లడ్డూకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అటువంటి పవిత్రమైన లడ్డూను అపవిత్రం చేశారని వెలుగు చూడడం కలకలం రేపుతోంది. ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో తిరుమల లడ్డూలను అపవిత్రం చేశారని తెలియడం ఆ పార్టీపై దాడి జరుగుతోంది. లడ్డూలను జంతువుల కొవ్వుతో తయారు చేశారని గుజరాత్ కు చెందిన నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ సమస్త అనుమానం వ్యక్తం చేసిందని టిడిపి ఆరోపిస్తోంది. వైసిపి ప్రభుత్వ హయాంలో లడ్డూల తయారీలో వినియోగించిన నెయ్యిలో.. జంతువుల కొవ్వు కలిపారు అన్నది ప్రధాన ఆరోపణ. ఎన్డిడిబి ఇదే అనుమానాలను వ్యక్తం చేసింది. అయితే ఈ విషయంలో తాజాగా కర్ణాటక కు చెందిన నందిని నెయ్యిని సరఫరా చేస్తున్న కేఎంఎఫ్ స్పష్టత ఇచ్చింది. ఇది మరింత అనుమానాలను పెంచే విధంగా ఉంది.
* కేఎంఎఫ్ స్పందన
తిరుమల లడ్డూ తయారీలో వినియోగించిన నెయ్యిలో గొడ్డు కొవ్వు కలిపారని ఆరోపణలు రావడం.. దీనిని కేఎంఎఫ్ సరఫరా చేస్తోందని ప్రచారం జరుగుతుండడంతో సదరు సంస్థ ప్రతినిధులు స్పందించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నెయ్యి సరఫరాను నిలిపివేసిన విషయాన్ని వెల్లడించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టిటిడి చైర్మన్గా వైవి సుబ్బారెడ్డి బాధ్యతలు తీసుకున్న సంగతి తెలిసిందే. అప్పుడే కేఎంఎఫ్ నుంచి నెయ్యి సరఫరాను నిలిపివేసినట్లు తెలిసింది. అప్పట్లో విను దుమారమే నడిచింది. కానీ నాడు జగన్ కానీ.. టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి కానీ పట్టించుకోలేదని తెలుస్తోంది. గత నాలుగు సంవత్సరాలుగా నందిని నెయ్యిని తాము సరఫరా చేయలేదని కేఎంఎఫ్ ఇప్పటికే స్పష్టతనిచ్చింది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సైతం తేల్చి చెప్పారు.
* టీటీడీ పవిత్రత ప్రశ్నార్థకం
టీటీడీ పవిత్రతను మంటగలిపేలా వైసిపి ప్రభుత్వం వ్యవహరించిందన్న ఆరోపణలు బలంగా బయటకు వచ్చాయి. ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయి. ఈ తరుణంలో వైసీపీ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. టీటీడీ చైర్మన్లుగా వ్యవహరించిన వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి మీడియా ముందుకు వచ్చారు. సీఎం చంద్రబాబుతో పాటు టిడిపి నేతల ఆరోపణలను ఖండించారు. అయినా సరే ప్రపంచవ్యాప్తంగా భక్తుల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. దీనిపై ఎక్కువ మంది స్పష్టత కోరుకుంటున్నారు. అయితే రాజకీయాలు తోడు కావడంతో ఈ వివాదం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
* హైకోర్టులో వైసిపి పిటిషన్
అయితే ఈ విషయంలో సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తూ వైసిపి హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. టీటీడీ మాజీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి తరఫున న్యాయవాది సుధాకర్ రెడ్డి హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి ఎదుట ఈ అంశాన్ని ప్రస్తావించారు. సింగిల్ జడ్జితో లేదా హైకోర్టు కమిటీతో విచారణ చేయాలని కోరారు. అయితే ఈ పిటిషన్ పై వచ్చే బుధవారం విచారణ చేస్తామని న్యాయస్థానం స్పష్టం చేసింది. మరోవైపు ఈ వివాదంపై ఈరోజు సాయంత్రం జగన్ స్పందించనున్నట్లు తెలుస్తోంది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More