RK Roja And Baireddy Siddharth Reddy: ఏపీలో( Andhra Pradesh) కొత్త కేసు తెరపైకి రానుంది. అయితే ఇది పాత కేసు. కానీ సరికొత్త ఆధారాలతో ఇద్దరు నేతలపై పట్టు బిగించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో ఆడుదాం ఆంధ్ర పేరిట క్రీడా పోటీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆటల నిర్వహణ అప్పట్లో అవినీతిమయంగా మారిందన్న ఆరోపణలు ఉన్నాయి. నాసిరకం క్రీడా కిట్లు, ఇష్టారాజ్యంగా ఆటల పోటీల నిర్వహణ, వైసిపి అభిమానులనే విజేతలుగా ప్రకటించడం.. ఇలా భారీ అవకతవకలు చోటు చేసుకున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆడుదాం ఆంధ్ర పై విచారణ మొదలు పెట్టింది. విజిలెన్స్ విచారణ తుది దశకు చేరుకుంది. ఇప్పుడు దీనిపై సిఐడి లేదా ఏసీబీకి కేసు అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పాలు కదుపుతోంది. తద్వారా మాజీ మంత్రి ఆర్కే రోజా, అప్పటి శాప్ అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చుట్టూ ఇప్పుడు ఉచ్చు బిగుస్తోంది.
Also Read: ఏబీఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలు తప్పు.. వైసిపి చేసింది అంతకంటే తప్పు
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దాదాపు 47 రోజులపాటు ఆడుదాం ఆంధ్ర ( Aadu Dham Andhra )క్రీడా పోటీలు నిర్వహించారు. అప్పట్లో భారీ ఎత్తున నిధులు దుర్వినియోగం అయినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం గుర్తించింది. ఈ కార్యక్రమం కోసం ఏకంగా రూ.125 కోట్లు వరకు ఖర్చు చేయగా.. అందులో రూ.40 కోట్ల నుంచి రూ.60 కోట్ల వరకు అవకతవకలు జరిగినట్లు ప్రాథమిక సమాచారం. దీనిపై విజిలెన్స్ అధికారులు సుదీర్ఘ విచారణ జరిపి వేల పేజీల నివేదికను సిద్ధం చేశారు. ఈ నివేదికలో అప్పటి క్రీడల శాఖ మంత్రి ఆర్కే రోజా, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పాత్ర పై కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది.
* నాసిరకం కిట్లు..
ప్రధానంగా వివిధ క్రీడాంశాలకు సంబంధించి నాసిరకం స్పోర్ట్స్ కిట్లను( sports kits) సరఫరా చేసి భారీగా నిధులు గోల్మాల్ చేశారన్నది ప్రధాన ఆరోపణ. బ్రాండెడ్ కంపెనీల స్టిక్కర్లను వాడి.. అత్యంత నాణ్యతలేని బ్యాట్లు, బంతులు, టీ షర్టులు సరఫరా చేసినట్లు అధికారులు నిర్ధారించారు. పంపిణీ చేయాల్సిన కిట్లను పక్కదారి పట్టించడం.. ప్రైజ్ మనీని విజేతలకు అందకుండా అడ్డుకోవడం వంటి అంశాల్లో భారీ అక్రమాలు జరిగినట్లు విచారణలో తేలింది. కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు నిబంధనలకు విరుద్ధంగా అదనపు నిధులు కేటాయించినట్లు విజిలెన్స్ విచారణలో గుర్తించారు. ఈ వ్యవహారంలో ప్రజాధనం ఏ విధంగా పక్కదారి పట్టిందో గణాంకాలతో సహా నివేదికలో పొందుపరిచారు. ప్రధానంగా మంత్రి రోజా, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కి అవినీతిలో ఎక్కువ భాగం ఉన్నట్లు విచారణలో తేలినట్లు సమాచారం.
* దెబ్బతిన్న క్రీడా స్ఫూర్తి..
మరోవైపు ఆడుదాం ఆంధ్రాలో కేవలం ఆర్థికపరమైన అవినీతి మాత్రమే లేదు. అప్పట్లో విజేతలుగా వైసిపి శ్రేణులను చూపి భారీగా నిధులు పక్కదారి పట్టించారన్న ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో క్రీడాధికారులు ప్రమేయం లేకుండా.. అసలు సిబ్బందితో కాకుండా వలంటీర్లతో క్రీడా పోటీలు నిర్వహించారన్న విమర్శ ఉంది. క్రీడా స్ఫూర్తిని దెబ్బతీస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని విజేతలుగా ఎంపిక చేసినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే అప్పట్లో ఈ కార్యక్రమాన్ని వాడుకున్నట్లు విచారణలో తేలింది. కొత్త ప్రభుత్వం రాగానే అధికారులు కొందరు పాత సమాచారాన్ని డిలీట్ చేసే ప్రయత్నం చేశారని.. కానీ విజిలెన్స్ అధికారులు రికార్డులు బయటకు తీసి అవినీతి బాగోతాన్ని బయటపెట్టారని సమాచారం.
* కేసులతో సిద్ధం..
అయితే విజిలెన్స్ విచారణ పూర్తి అయి.. నివేదిక ప్రభుత్వానికి అందింది. దీని ఆధారంగా చేసుకుని మాజీ మంత్రి రోజాతో పాటు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. త్వరలో ఈ కేసును ఏసీబీకి లేదా సిఐడికి అప్పగించే ఛాన్స్ కనిపిస్తోంది. విజిలెన్స్ వివరాలు పక్కాగా ఉంటే మాత్రం ఈ కేసులో అరెస్టులు తప్పవనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. అయితే ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర అవినీతి బయటపడడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.