Karnool Diamond Found: పొలంలో వజ్రం.. రికార్డు ధరకు కొనుగోలు.. మారిన రైతు దశ!

ఒక వజ్రం దొరికితే జీవితంలో సెటిల్ అయిపోవచ్చు. అందుకే అక్కడ రైతులు పొలం పనులు మానుకొని వజ్రాల కోసం వెతుకుతుంటారు. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో.. కొన్ని ప్రాంతాల్లో వర్షాకాలం వజ్రాలు వెలుగు చూస్తుంటాయి.

Written By: Dharma, Updated On : August 24, 2024 10:49 am

Karnool Diamond Found

Follow us on

Karnool Diamond Found: కర్నూలు జిల్లాలో రైతుకు అదృష్టం దక్కింది. చాలా రోజుల తర్వాత పొలంలో వజ్రం లభించింది.భారీ వర్షాలు పడడంతో కర్నూలు జిల్లాలో వజ్రాల వేట ప్రారంభమైంది.ఈ క్రమంలో రైతులకు వజ్రాలు దొరుకుతున్నాయి.రైతులు వ్యవసాయ పనులు మానుకొని మరి వజ్రాలు వేట సాగిస్తున్నారు.ఈ క్రమంలో తుగ్గలి మండలం జొన్నగిరిలో పొలం పనులకు వెళ్లిన రైతుకు వజ్రం దొరికింది.వ్యాపారి ఒకరు రూ.12 లక్షల నగదు, ఐదు తులాల బంగారం ఇచ్చి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. రైతుకు వజ్రం దొరికిందని తెలియడంతో.. జిల్లా వ్యాప్తంగా రైతులు, కూలీలు వజ్రాల వేటలో పడ్డారు. కొందరు వ్యాపారులు అయితే వజ్రాల కొనుగోలుకు ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నారు. పొలాల్లో దొరుకుతున్న వజ్రాలను కొనుగోలు చేస్తున్నారు. రైతుల వద్ద నుంచి తక్కువకు కొనుగోలు చేసి.. తాము మాత్రం ఎక్కువ మొత్తానికి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.ప్రస్తుతం కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఈ వజ్రాల వేట కొనసాగుతుండడం విశేషం.

* కర్నూలులో ఈ గ్రామాల్లో
సాధారణంగా వర్షాకాలంలో కర్నూలు, అనంతపురం జిల్లాలో వజ్రాలు లభ్యమవుతుంటాయి. కర్నూలు జిల్లా తుగ్గలి, మద్దికేర మండలాల్లో వజ్రాలు రైతులకు దొరుకుతుంటాయి. ప్రధానంగా తుగ్గలి, జొన్నగిరి, పెరవలి, పగిడి రాయి, కొత్తపల్లి, మద్దికేర, అగ్రహారం, హంప, యడవల్లి తదితర గ్రామాల్లో ఈ వజ్రాలు ఎక్కువగా లభ్యమవుతుంటాయి.

* అనంతపురంలో ఈ గ్రామాల్లో
అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలంలోని తట్రకల్లు, రాగులపాడు, గంజికుంట, పొట్టిపాడు, గూళపాళ్యం, కమలపాడు, ఎన్ఎంపి తండా తోపాటు మరికొన్ని గ్రామాల్లో వజ్రాలు దొరుకుతాయి. అందుకే వర్షాలు పడితే చాలు ఆయా గ్రామాల్లో రైతులు పనులు మానుకొని మరి వజ్రాలు వేట చేస్తారు. మరికొందరైతే కూలీలను సైతం పురమాయిస్తారు.

ఈ ఏడాది వేసవి నుంచే..
ఈ ఏడాది వేసవిలో వర్షాలు పడడంతో వజ్రాల వేట ప్రారంభమైంది. చాలామంది రైతులకు వజ్రాలు దొరికినట్లు తెలుస్తోంది. ఇలా దొరుకుతాయో లేదో వ్యాపారులు అక్కడ వాలిపోతారు. మరికొందరు వ్యాపారులైతే గ్రామాల్లో దళారులను నియమించుకుంటున్నారు. అయితే వజ్రాల ధర ఎక్కువ పలకకుండా ఉండేందుకు వ్యాపారులు సిండికేట్ గా మారుతున్నారు. ఏటా ఈ వజ్రాల వ్యాపారం కోట్లలో జరుగుతుందని తెలుస్తోంది. మొత్తం మీద రాయలసీమలో ఈ వజ్రాల వేట అనేది ఒక ప్రత్యేకత అని చెప్పవచ్చు.