Telugu States: రాష్ట్ర విభజనకు పదేళ్లు.. మరి హామీలు, సమస్యల మాటేంటో?

రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణకు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉండేవారు. 2014 నుంచి 2013 వరకు ఆయనే సీఎం. విభజిత ఏపీకి మాత్రం తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు.

Written By: Dharma, Updated On : May 16, 2024 3:04 pm

Partition of Telugu states

Follow us on

Telugu States: తెలుగు రాష్ట్రాల విభజన జరిగి దశాబ్ద కాలం పూర్తవుతోంది. జూన్ 2 నాటికి విభజన జరిగి 10 ఏళ్లు అవుతుంది. పునర్విభజన చట్టంలో పదేళ్లలో అన్ని సమస్యలు పరిష్కారం అయ్యేలా, వివాదాలు లేకుండా ఉండేలా చూసేలా ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే ఉమ్మడి రాజధాని అంశాన్ని పదేళ్లపాటు చేర్చారు. ఆ సమయం ఇప్పుడు ముగుస్తుంది. కానీ చాలా రకాల సమస్యలకు ఇంకా పరిష్కార మార్గం దొరకలేదు. ప్రస్తుతం ఏపీలో ఆపద్దర్మ ప్రభుత్వం ఉంది. సీఎం జగన్ విదేశాలకు వెళ్తున్నారు. ఆయన పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు. రేవంత్ సీఎం అయిన తర్వాత రెండు రాష్ట్రాల సమస్యల పరిష్కారం కోసం జగన్ ఒక్కసారంటే ఒక్కసారి కూడా ప్రయత్నించలేదు.

రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణకు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉండేవారు. 2014 నుంచి 2013 వరకు ఆయనే సీఎం. విభజిత ఏపీకి మాత్రం తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. అయితే కెసిఆర్ తో ఆయన గట్టిగానే ఫైట్ చేశారు. విభజన హామీల అమలుకు ప్రయత్నించారు. కానీ చంద్రబాబుతో ఉన్న రాజకీయ విభేదాలతో కెసిఆర్ కొన్నింటికి మోకాల అడ్డు వేశారు. 2019లో ఏపీలో జగన్ అధికారంలోకి రావాలని కెసిఆర్ కోరుకున్నారు. అందుకు తగ్గట్టుగానే జగన్ అధికారంలోకి రాగలిగారు. విభజన హామీల పరిష్కారానికి రెండు సానుకూల ప్రభుత్వాలు వచ్చినా అది వీలు కాలేదు.

అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో విభజన హామీలకు సంబంధించి ఒక్కో అంశము కొలిక్కి వస్తోంది. ఉద్యోగుల కేటాయింపు, ఆస్తులు అప్పులు పంపిణీ.. ఇలా అన్ని అంశాలపై ఒక నివేదిక తయారు చేయాలని సీఎం రేవంత్ తెలంగాణ అధికారులను ఆదేశించారు. షెడ్యూల్ 9, 10 లో ఉన్న సంస్థలు, కార్పొరేషన్లకు సంబంధించిన పంపిణీ, విద్యుత్ సంస్థల బకాయి తదితర అంశాలపై ఇప్పటివరకు చేసిన ప్రయత్నాలను సీఎం రేవంత్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. రెండు రాష్ట్రాలు సామరస్యంగా పరిష్కరించుకునేందుకు వీలున్న ఉద్యోగుల బదిలీల వంటి చిన్న చిన్న అంశాలను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

అయితే ఈ తరహా ప్రయత్నాలు ఏపీ నుంచి కనీస స్థాయిలో జరగకపోవడం విశేషం. ఎప్పుడైతే తెలంగాణలో సీఎం కేసీఆర్ అధికారాన్ని కోల్పోయారో.. నాటి నుంచే జగన్లో ఒక రకమైన నిర్లిప్తత చోటు చేసుకుంది. ఈ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తే చూసుకుందాంలే అనే రీతిలో జగన్ ఉన్నారు. అందుకే ఏపీ పరంగా విభజన హామీల అమలుకు ఎటువంటి డిమాండ్ చేయలేని స్థితిలో గడిపేశారు. ఏపీ పై తెలంగాణ పాలకులకు ఉన్న చిత్తశుద్ధి కూడా జగన్లో కనిపించలేదు. అది ఏపీ ప్రజలకు శాపమే. కొత్త ప్రభుత్వంలోనైనా విభజిత హామీలకు, ఏపీ ప్రయోజనాలు కాపాడే పరిస్థితి ఉంటుందా? లేదా? అన్నది చూడాలి.