spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Rushikonda Global Tender: 'రుషికొండ'కు గ్లోబల్ టెండర్!

Rushikonda Global Tender: ‘రుషికొండ’కు గ్లోబల్ టెండర్!

Rushikonda Global Tender: రుషికొండ భవనాలపై ప్రభుత్వం ఎట్టకేలకు ఒక నిర్ణయానికి వచ్చింది. తీవ్ర తర్జనభర్జన నడుమ ఆ భవనాలను లీజుకు ఇచ్చేందుకు ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ అధికారికంగా గ్లోబల్ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భవన సముదాయాన్ని ఎలా వినియోగించాలి అనే దానిపై తీవ్ర చర్చ నడిచింది. దీనిపై మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటయింది. పలుమార్లు సమావేశమైన ఆ మంత్రుల కమిటీ చివరకు లీజులకు ఇవ్వడమే మేలన్న నిర్ణయానికి వచ్చింది. అందుకే అంతర్జాతీయ స్థాయిలో ఈ భవన సముదాయానికి లీజు వండర్లను ఆహ్వానిస్తోంది ప్రభుత్వం. దీనికి సంబంధించిన టెండర్ నోటిఫికేషన్ జారీ అయింది. దీంతో గత కొద్ది రోజులుగా నెలకొన్న సందిగ్ధతకు తెరపడినట్లు అయింది. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో దాదాపు 500 కోట్ల రూపాయల వ్యయంతో భారీ భవన సముదాయాలను.. అంతర్జాతీయ స్థాయి వసతులతో నిర్మించారు. కానీ ఎందుకు నిర్మించారో అధికారికంగా వెల్లడించలేదు.

* పర్యాటక ల్యాండ్ మార్క్..
విశాఖ నగరానికి ఒక పర్యాటక ల్యాండ్ మార్క్ గా ఉండేది రుషికొండ. దాదాపు ఏడాదికి ఐదు కోట్ల రూపాయలకు పైగా పర్యాటక శాఖకు ఆదాయం వచ్చేది. అటువంటి రుషికొండను గుండు కొట్టించింది వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం. 500 కోట్ల రూపాయల వ్యయంతో భారీ భవన సముదాయాలను నిర్మించింది. అప్పట్లో పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా ఈ నిర్మాణాలు జరిపినట్లు ఆరోపణలు వచ్చాయి. అయినా లెక్క చేయలేదు వైసిపి ప్రభుత్వం. విశాఖలో పాలన రాజధానిగా నిర్ణయించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి పాలన కోసం అప్పట్లో నిర్మించినట్లు ఆరోపణలు వచ్చాయి. అనధికారికంగా మంత్రులు ప్రకటనలు చేశారు కానీ.. అప్పటి ప్రభుత్వం మాత్రం ఈ రుషికొండ విషయంలో గోప్యంగానే వ్యవహరించింది.

* మంత్రివర్గ ఉప సంఘం..
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రుషికొండ భవన సముదాయాల వినియోగం ఎలా చేయాలనే దానిపై ప్రభుత్వం ఆలోచన చేసింది. మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేసింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్న తరుణంలో… లీజులకు ఇవ్వాలని భావించింది ప్రభుత్వం. అంతర్జాతీయ స్థాయి లగ్జరీ రిసార్ట్ లేదా ఫైవ్ స్టార్ హోటల్గా మార్చాలని ప్రభుత్వ ఆలోచన. సహజ సిద్ధమైన సముద్రపు వ్యూ ఉన్న ఈ భవనాలను పర్యాటక రంగంలో సరికొత్త ఐకాన్ గా తీర్చిదిద్దేందుకు ఏపీ టూరిజం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. వాస్తవానికి ఈ భవనాలను లీజుకు తీసుకునేందుకు తాజ్, ఒబెరాయ్, లీలా వంటి పలు అంతర్జాతీయ దిగ్గజ హోటల్ బ్రాండ్ గ్రూపులు ఆసక్తి చూపాయి. అయితే క్షేత్రస్థాయిలో ఈ ప్రాజెక్టును పరిశీలించిన తర్వాత కొన్ని సాంకేతిక, మౌలిక సదుపాయాలలో లోపాలు చూసి వెనక్కి తగ్గాయి. ప్యాలెస్ ఆవరణలో ఉన్న ఖాళీ స్థలాన్ని.. అదనపు గదుల నిర్మాణం కోసం వాడుకునేందుకు పర్యావరణ, కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నిబంధనలు అద్దంకిగా మారాయి. దీనికి తోడు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భారీ ప్యాలెస్ లో కమర్షియల్ హోటల్ బిజినెస్ కు అవసరమైన గదుల సంఖ్య చాలా తక్కువ. అందుకే ఆ బ్రాండ్ కంపెనీలు సైతం వెనక్కి తగ్గుతున్నాయి. ఒక అంతర్జాతీయ స్థాయిలో బ్రాండ్ హోటల్ గా మార్చాలి అనుకుంటే అంతర్గతంగా భారీ మార్పులు, చేర్పులు చేయాల్సి ఉంటుంది. ఎక్కువ గదులు లేకపోతే కమర్షియల్ గా వర్క్ అవుట్ కాదనే ఉద్దేశంతోనే కొంత వెనుకడుగు వేసాయి.

* లీజుల కోసం..
గ్లోబల్ టెండరింగ్ విధానం ద్వారా అంతర్జాతీయ బ్రాండ్ హోటల్ సంస్థలకు లీజులకు ఇవ్వడం ఖాయమని తెలుస్తోంది. అందుకే ఏపీటీడీసీ అంతర్జాతీయ హోటల్ రంగ నిపుణుల సలహాతో నిబంధనలను కొంత సరళతరం చేసింది. ప్రముఖ హోటల్స్ ముందుకు వస్తే భవనాల అంతర్గత మార్పులు, నిబంధనల ప్రకారం లీజు నిబంధనలు అనుకూలంగా మార్చి ఇచ్చేసి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ భవనాలకు సంబంధించి టెండర్ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తిచేసి.. ప్రముఖ గ్లోబల్ బ్రాండ్ కు ప్యాలెస్ బాధ్యతలు కట్టబెట్టాలని చూస్తోంది ప్రభుత్వం. చూడాలి మరి ఏం జరుగుతుందో..

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular