Hawaii: మలేరియా తగ్గించాలని.. దోమలు పెంచుతున్నారు.. హవాయ్‌లో వినూత్న కార్యక్రమం..!

ప్రకృతి అందానికి పెట్టింది పేరు హవాయి దీవులు వీటిలో 33 రకాల పక్షులు అంతరించిపోతున్నట్లు స్థానిక ప్రభుత్వం గుర్తించింది. మరో 17 రకాల జాతులు ముప్పును ఎదుర్కొంటున్నాయి.

Written By: Raj Shekar, Updated On : June 22, 2024 5:51 pm

Hawaii

Follow us on

Hawaii: అంతరించిపోతున్న జీవ జాతులను రక్షించేందుకు అనేక దేశాలు సంరక్షణ చర్యలు చేపడుతుంటాయి. ఉత్పత్తి పెంపునకు ఏర్పాటు చేస్తాయి. అలాగే.. అమెరికాలోకి హవాయి రాష్ట్రం కూడా ఓ వినూత్న కార్యక్రమం చేపట్టింది. తమ ప్రాంతంలో అంతరించిపోయే అరుదైన పక్షులను కాపాడుకునేందుకు బ్యాక్టిరియాతో కూడిన లక్షలాది దోమలను విడిచిపెడుతోంది. హెలిక్యాప్టర్లలో తీసుకొచ్చి మరీ వదిలిపోడుతున్నారు.

50 పక్షిజాతులకు ముప్పు..
ప్రకృతి అందానికి పెట్టింది పేరు హవాయి దీవులు వీటిలో 33 రకాల పక్షులు అంతరించిపోతున్నట్లు స్థానిక ప్రభుత్వం గుర్తించింది. మరో 17 రకాల జాతులు ముప్పును ఎదుర్కొంటున్నాయి. వాటిలో కొన్ని ఏడాదిలో కనుమరుగయ్యే అవకాశం ఉంది. ’అకికికి’ అనే పక్షుల సంఖ్య 2018లో 450 ఉన్నట్లు అంచనా వేయగా.. 2023 నాటికి వాటి సంఖ్య ఐదుకు పడిపోయింది. ఇప్పుడు ఒక్కటి మాత్రమే మిగిలి ఉండొచ్చని అంచనా.

పర్యావరణవేత్తల ఆందోళన..
అంతరించిపోతున్న జీవజాతులపై పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందుకోసం భారీస్థాయిలో దోమలను హెలిక్యాప్టర్ల సాయంతో విడుదల చేస్తోంది. వారానికో హెలిక్యాప్టర్‌లో రెండున్నర లక్షల మగ దోమలను తీసుకువస్తున్నారు. ఇప్పటి వరకు కోటి దోమలను వివిధ ప్రదేశాల్లో విడిచిపెట్టారు.

మలేరియా ముప్పు..
హవాయిలో మాత్రమే కనిపించే కొన్ని అరుదైన పక్షిజాతులు(హనీక్రీపర్స్‌) మలేరియా ముప్పును ఎదుర్కొంటున్నాయి. వ్యాధి కారక దోమ కుడితే 90 శాతం చనిపోయే ప్రమాదం ఉంది. మలేరియాను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి వీటికి లేదు. ఈ నేపథ్యంలో వోల్బాకియా అనే బ్యాక్టీరియాతో కూడిన మగ దోమలను ఉత్పత్తి చేస్తున్నారు. వీటిని కలిసిన ఆడ దోమలు గుడ్లు పొదగవు. ఇలా క్రమంగా దోమల సంఖ్యను తగ్గించే ఉద్దేశంతో ఈ సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. దీన్ని ఇన్కంపాటబుల్‌ ఇన్సెక్ట్‌ టెక్నిక్‌గా వ్యవహరిస్తారు. యూఎస్‌ నేషనల్‌ పార్క్‌ సర్వీస్‌ సహాయంతో హవాయి రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టింది. చైనా, మెక్సికోలో దోమల సంఖ్యను తగ్గించేందుకు ఇదే విధానాన్ని అనుసరించినట్లు నివేదికలు తెలిపాయి.