America Pakistan
America Pakistan: అమెరికా ఏదీ చేసినా…దానికి ఓ లెక్కుంటుంది. ఏ దేశంతోనైనా..స్నేహం చేసినా..మరే దేశంతోనైనా కయ్యం పెట్టుకున్నా..యూఎస్ థీయరీనే వేరు. అమెరికా ఏదీ చేసినా..పక్కా వ్యాపారమే చేస్తోంది. ఆదేశ ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొనే పనిచేస్తుంటుంది. ఇందుకోసం ఏ దేశ ప్రభుత్వాలను కూలగొట్టేందుకు అయినా..మరే దేశంలోనైనా పప్పెట్ ప్రభుత్వాలను నెలకోల్పడంలోనైనా అమెరికాది అందవేసిన చెయ్యి. సరిగ్గా ఇప్పుడు మన దాయాది పాకిస్థాన్ విషయంలోనూ ఇదే ఫార్మూలాను అనుసరిస్తోంది. చాన్నాళ్లుగా ఆ దేశంతో అట్టిముట్టనట్లున్న యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ ఇప్పుడు దాన్ని దువ్వేందుకు యత్నిస్తున్నారు. ఎలాగైనా పాకిస్తాన్తో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించాలని ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ఇటీవలే ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్కు అమెరికా అధ్యక్షులు జో బైడెన్ ఓ లేఖ కూడా రాశారు. పాకిస్థాన్ తో తాము సత్సంబంధాలను కోరుకుంటున్నట్లు ఆ లేఖలో వెల్లడించారు.
అయితే చాన్నాళ్లుగా పాకిస్థాన్ ను పెద్దగా లెక్క చేయని అమెరికా అధ్యక్షులు జో బైడెన్ ఇప్పుడు ఎందుకు పాకిస్థాన్ మంచిగా చేసుకునేందుకు యత్నిస్తున్నారనేదే ఆసక్తికరంగా మారింది. అయితే ఇందుకు ప్రధాన కారణం ఇరానేనని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత నెల 23న ఇరాన్ అధ్యక్షులు ఇబ్రహీం రైసీ పాకిస్థాన్లో పర్యటించారు. పాకిస్థాన్-ఇరాన్ మధ్యన మిగిలిపోయిన గ్యాస్ పైప్ లైన్ పనుల పూర్తి గురించి ఇరుదేశాల అగ్రనేతలు ఈ సందర్భంగా చర్చించారు. ఈనేపథ్యంలోనే ఇరాన్ అధ్యక్షులు రైసీ పాకిస్తాన్కు అవసరమైన గ్యాస్,చమురు సరఫరా,దాని అవసరాలు తీర్చడంపై స్పష్టమైన హామీని ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇరాన్తో జరిగిన చర్చలు కూడా సంతృప్తినిచ్చినట్లు పాకిస్థాన్ ప్రకటించింది. అయితే ఇరాన్-పాక్ దేశాల అగ్రనేతల మధ్య జరిగిన ఈ మంతనాలు పైకి గ్యాస్,చమురు ముచ్చట్లపైనే అయినా..అంతర్గతంగా మాత్రం ఇజ్రాయిల్ వ్యవహారంపై చర్చించి ఉంటారని అమెరికా అనుమానం వ్యక్తం చేస్తోంది.
ఇరాన్కు పాకిస్థాన్ దగ్గరవుతే పశ్చిమాసియాలో తమకు కాస్తా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయనే అంచనాలో అమెరికా ఉంది. ఈనేపథ్యంలోనే అమెరికా అధ్యక్షులు పాకిస్థాన్ను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు సమాచారం. అందులో భాగంగానే ఇరాన్ నుంచి పాకిస్తాన్ ను దూరం చేసేందుకు దానికి ఆర్థిక,సామాజిక,సైనిక పరమైన అంశాల్లో తమ వంతు సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ ను కనుక ఇరాన్ నుంచి దౌత్యపరంగా దూరం చేయగల్గినట్లైతే..ఇజ్రాయిల్పై ఇరాన్ వ్యవహరిస్తున్న తీరు విషయంలో ఆ దేశం ఏకాకిగా మారుతోందనే అంచనాలో యూఎస్ ఉంది. వాస్తవానికి పాకిస్తాన్ ఇజ్రాయిల్కు బద్ద శత్రువే. అందువల్ల ఇలాంటి టైంలో ఇజ్రాయిల్ శత్రువైన ఇరాన్తోనూ పాకి దౌత్యపరంంగా ఏకీభావంతో ఉంటే అది తమకు అంతర్జాతీయ ఇబ్బందికర పరిస్థితులను సృష్టిస్తుందనే భావనలో యూఎస్ ఉంది. అందుకే తాజాగా పాకిస్థాన్ ను మచ్చిగా చేసుకునేందుకు అమెరికా అన్ని రకాల ప్రయత్నాలను మొదలుపెట్టినట్లు అర్థమవుతోంది. ఇదన్న మాట యూఎస్-పాక్ దోస్తానా కోసం చేస్తున్నప్రయత్నాల్లోని అసలు ముచ్చట.