US tariff proposal on India: భారత్పై అమెరికా మరో బాంబు పేల్చేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రతీకార సుంకాలతో భారత ఎగుమతులు తగ్గాయి. ఇక అమెరికా–ఇరాన్ యుద్ధం కారణంగా ఆయిల్ సంక్షోభం నెలకొంది. మరోవైపు ఆర్థికంగానూ సమస్యలు తలెత్తుతున్నాయి. ఇలాంటి సమయంలో అమెరికా మరోసారి తన వాణిజ్య భాగస్వామ్య దేశాలపై కఠిన వైఖరి చూపించింది. వెట్టిచాకిరీ (బలవంతపు లేబర్) నిర్మూలనలో పలు దేశాలు విఫలమవుతున్నాయని ఆరోపిస్తూ, వాటి దిగుమతులపై అదనపు సుంకాలు విధించాలని యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ (యూఎస్టీఆర్) ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలో భారత్తో పాటు మొత్తం 60 దేశాలు ఉన్నాయి.
అమెరికా తీవ్ర ఆరోపణలు..
యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ అంబాసిడర్ జెమీసన్ గ్రీర్ ఒక ప్రకటనలో వెల్లడించినట్లు, వెట్టిచాకిరీ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడాన్ని నిషేధించడంలో అనేక దేశాలు సమర్థవంతంగా వ్యవహరించలేదని ఆరోపించారు. దీని వల్ల అమెరికా కార్మికులు అంతర్జాతీయ మార్కెట్లో తీవ్ర పోటీని ఎదుర్కొంటున్నారని, ఈ అసమానతలను ఇక సహించలేమని స్పష్టం చేశారు. 54 దేశాలపై 12.5 శాతం, మరికొన్నింటిపై 10 శాతం సుంకాలు విధించాలని యూఎస్టీఆర్ ప్రతిపాదించింది.
సుంకాల జాబితాలో ఇవీ..
యూఎస్టీఆర్ సుంకాలు ప్రతిపాదించిన దేశాల జాబితాలో భారత్, చైనా, జపాన్, బ్రెజిల్, ఆస్ట్రేలియా, యూకే, సౌదీ అరేబియా వంటి ప్రధాన దేశాలు ఉన్నాయి. కెనడా, ఈయూ, మెక్సికో, ఇండోనేసియా, పాకిస్తాన్, ఈక్వడార్ వంటి దేశాలు రెండవ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది.
భారత్ స్పందన..
అదనపు సుంకాల ప్రతిపాదన అంశంపై భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ స్పందించింది. సెక్షన్ 301 దర్యాప్తు సంబంధించి అమెరికాతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని తెలిపింది. అంతేకాకుండా, మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడం సంబంధించి కూడా సమాంతర చర్చలు జరుగుతున్నాయని వెల్లడించింది. ప్రస్తుతం ఈ సుంకాలు ఇంకా ఖరారు కాలేదని, జూన్ 22లోగా సంప్రదింపులు జరపాలని, జులై 6 వరకు లిఖితపూర్వక అభిప్రాయాలు సమర్పించవచ్చని యూఎస్టీఆర్ ఆ దేశాలను ఆహ్వానించింది.
ఈ పరిణామాలు భారత్తో సహా పలు దేశాల వాణిజ్య సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అమెరికా ఈ కొత్త చర్యల ద్వారా తన కార్మికులను రక్షించుకోవాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది.
