US Iran ceasefire: అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా సానుకూల దృక్పథం కనిపిస్తోంది. హర్ముజ్ జల సంధిని తెరవడానికి ఇరాన్ ఒప్పుకోవడంతో.. అంతర్జాతీయంగా వాణిజ్యానికి మళ్లీ దారులు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ప్రపంచ దేశాలు చమురు కొరత ఎదుర్కొంటున్నాయి.. ఈ జాబితాలో భారత్ కూడా ఉంది.
చమురు కొరత ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. ఇరాన్ నుంచి ఏడు సంవత్సరాల తర్వాత భారతదేశానికి చమురు నౌక రాబోతోంది.. (ఎల్ఎస్ ఈజీ, కేపీఎల్ ఏఆర్ నుంచి షిప్ ట్రాకింగ్ డేటా ప్రకారం) కొరకావో ప్రాంతం నుంచి జయ అనే కార్గో నుంచి చమురును ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కొనుగోలు చేసింది.. ఈ నౌక భారతదేశంలోని తూర్పు సముద్ర తీరానికి రాబోతోంది..
ఇరాన్ నుంచి వచ్చే ఆ నౌక చైనా జలాల మీదుగా జోర్డాన్ నుంచి మనదేశంలో అడుగుపెడుతోంది. ఇటీవల అమెరికా ఒత్తిడి చేసిన తర్వాత ఇరాన్ నుంచి భారత కొనుగోలును నిలిపివేసింది.. చివరిసారిగా 2019 మే నెలలో భారత్ ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేసింది. ఆ తర్వాత ఇంధన సవాళ్లు ఎదురు కావడంతో భారత్ కొనుగోలు ప్రక్రియను నిలిపివేసింది. చివరికి ఇన్ని సంవత్సరాల తర్వాత భారత్ చమురు కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని భారత ఇంధన మంత్రిత్వ శాఖ ధ్రువీకరించింది.
ఇరాన్ నుంచి ఏ స్థాయిలో చమురు వస్తోందనే విషయంపై అధికారికంగా వివరాలు లేకపోయినప్పటికీ.. దీని ద్వారా భారత దేశ అవసరాలు తీరుతాయని ఇంధన వర్గాలు చెబుతున్నాయి. కాగా, భారత్ ప్రపంచంలోనే చమురు దిగుమతిలో అతిపెద్ద మూడవ వినియోగదారుగా ఉంది. నాడు అమెరికా ఆంక్షలు విధించిన నేపథ్యంలో.. భారత్ ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంది. రష్యా నుంచి కూడా భారతదేశం చమురు కొనుగోలు చేసింది. ఇటీవల కాలంలో యుద్ధ వాతావరణం ఏర్పడటం.. అంతర్జాతీయంగా పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేకపోవడంతో.. భారత్ ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తన అవసరాలు తీర్చుకుంది. ప్రపంచంలో మిగతా దేశాలు ఇబ్బంది పడుతుంటే.. భారత్ మాత్రం స్వీయ సమృద్ధి సాధించింది. అందువల్లే ఇక్కడ లాక్ డౌన్ లాంటి పరిస్థితులు ఏర్పడలేదు.