Bangladesh crisis : షేక్ హసీనా ప్రాణాలకు ముప్పు.. ఆమె ప్రయాణిస్తున్న విమానానికి భారత్ ఏ స్థాయిలో బందోబస్తు కల్పించిందంటే?

భారత వాయుసేనకు సంబంధించిన రాడార్లు బంగ్లాదేశ్ గగనతలాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాయి. సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో బంగ్లాదేశ్ నుంచి విమానం మన భూభాగం వైపు వస్తున్నట్లు భద్రతా దళాలు గుర్తించాయి. ఆ విమానంలో షేక్ హసీనా వస్తున్నట్లు గుర్తించిన భద్రతా దళాలు.. దానిని మన భూభాగంలోకి అనుమతించారు.

Written By: Anabothula Bhaskar, Updated On : August 6, 2024 1:36 pm
Follow us on

Bangladesh crisis : మనకు పొరుగున ఉన్న బంగ్లాదేశ్ లో శాంతి భద్రతలు దారుణంగా మారాయి. అక్కడ అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆ దేశానికి చెందిన ప్రధానమంత్రి షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేశారు. బతుకు జీవుడా అనుకుంటూ భారత వచ్చేశారు. ఈ క్రమంలో ఆమె ప్రయాణిస్తున్న విమానాన్ని భారత్ నిరంతరం పర్యవేక్షించింది. అనితర సాధ్యమైన స్థాయిలో రక్షణ కల్పించింది. వాస్తవానికి బంగ్లాదేశ్ లో గత కొన్ని రోజులుగా శాంతిభద్రతలు క్షీణించాయి. అక్కడ ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. రోడ్లమీద కర్ఫ్యూ వాతావరణం కొనసాగుతోంది.. ఆందోళనలు తారస్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో అక్కడి పరిస్థితులను భారత్ ఎప్పటికప్పుడు పర్యవేక్షించింది. నిశితంగా పరిశీలించింది. సోమవారం బంగ్లాదేశ్ లో పరిస్థితులు తీవ్ర రూపు దాల్చాయి. ఫలితంగా ప్రధానమంత్రి షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో భారత్ పూర్తి స్థాయిలో అప్రమత్తమయింది. ఆమె భారత వస్తున్నారని తెలుసుకున్న అనంతరం భద్రతా దళాలు పూర్తిస్థాయిలో గగనతలంపై నిఘా ను పటిష్టం చేశాయి. బంగ్లాదేశ్ నుంచి వచ్చే విమానం భారత్ లో సురక్షితంగా ల్యాండ్ అయ్యేలాగా భద్రతా దళాలు చర్యలు తీసుకున్నాయి.

భారత వాయుసేనకు సంబంధించిన రాడార్లు బంగ్లాదేశ్ గగనతలాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాయి. సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో బంగ్లాదేశ్ నుంచి విమానం మన భూభాగం వైపు వస్తున్నట్లు భద్రతా దళాలు గుర్తించాయి. ఆ విమానంలో షేక్ హసీనా వస్తున్నట్లు గుర్తించిన భద్రతా దళాలు.. దానిని మన భూభాగంలోకి అనుమతించారు. అభిమానానికి సెక్యూరిటీ ఇచ్చేందుకు వెస్ట్ బెంగాల్ లోని హాసీమారా వైమానిక స్థావరం నుంచి 101 స్వాకాడ్రస్ లోని రఫెల్ యుద్ధ విమానాలను రంగంలోకి దించారు. హసీనా ప్రయాణిస్తున్న విమానానికి అవి బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల మీదుగా పూర్తిస్థాయిలో రక్షణ కల్పించాయి. ఇది ఇలా జరుగుతుండగానే ఉత్తర ప్రదేశ్ లోని హిండన్ విమానాశ్రయంలో హసీనా విమానం దిగే వరకు భద్రతా నిరంతరం పర్యవేక్షించాయి. ఉన్నతాధికారులు విమానంలోని సిబ్బందితో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపారు. ఈ వ్యవహారాన్ని భారత వాయుసేనాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌధరి, పదాతిదళాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది ఎప్పటికప్పుడు పరిశీలించారు. ఇక ఇదే సమయంలో భద్రతా దళాలకు చెందిన గుణతాధికారులతో పాటు నిఘా విభాగానికి చెందిన అధిపతులు, జనరల్ ద్వివేది, ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ లెఫ్ట్నెంట్ జనరల్ జాన్సన్ ఫిలిప్ మ్యాథ్యూ కాన్ఫిడెన్షియల్ మీటింగ్ నిర్వహించారు..

షేక్ హసీనా ప్రయాణిస్తున్న విమానం హిండన్ ఎయిర్ బేస్ లో సోమవారం సాయంత్రం 5:45 నిమిషాలకు ల్యాండ్ అయింది. ఆమెను మనదేశంలోకి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఆహ్వానించారు. ఆమెకు భారతదేశం తరఫున ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం గంటసేపు ఆమెతో చర్చలు జరిపారు. “బంగ్లాదేశ్ లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు.. ఏర్పాటయ్యే కొత్త ప్రభుత్వం.. భారతీయులకు కల్పిస్తున్న రక్షణ” వంటి విషయాలపై వారిద్దరూ చర్చించుకున్నారు. అనంతరం అజిత్ అక్కడి నుంచి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో సమావేశమైన భద్రత వ్యవహారాల కమిటీకి పరిస్థితిని వివరించారు. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్, ప్రధాని మోడీ అజిత్ దోవల్ ఏకాంతంగా భేటీ అయ్యారు. పలు విషయాలపై చర్చించారు. కాగా, హసీనా ప్రాణాలకు ముప్పు ఉండడం వల్లే భారత ప్రభుత్వం ఈ స్థాయిలో భద్రత కల్పించిందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.