China Covid: కొద్ది రోజులుగా జీరో కోవిడ్ పాలసీ ఎత్తేసిన చైనాలో ఇప్పుడు వైరస్ ఉత్పాతం జరుగుతున్నది. వృద్ధులు నరకం చూస్తున్నారు. బ్లూమ్ బర్గ్ నివేదిక ప్రకారం రోగులతో ఆసుపత్రులు కిటికిటలాడుతున్నాయి. గంటలపాటు నిరీక్షిస్తే తప్ప ఆసుపత్రుల్లో బెడ్ దొరకడం లేదు. స్మశాన వాటిక లకు రోజు వందల్లో శవాలు వస్తున్నాయి. చైనా దేశంలో ఏం జరిగినా బయటకు తెలియదు. కానీ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వీడియోలు, ఫోటోలు ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. సాధారణంగా బీఎఫ్. 7 అనే వైరస్ అంత ప్రాణాంతకం కాదని వైద్యనిపుణులు చెప్తున్నారు. కానీ చైనాలో పరిస్థితిని చూస్తే అంతకుమించిన వైరస్ ఉత్పాతం లేదా వైరస్ ల కలయిక జరుగుతోందని వారు అనుమానిస్తున్నారు.
కోవిడ్ ప్యానల్ చీఫ్ ఏమంటున్నారంటే
చైనాలో పరిస్థితిపై భారత్ కోవిడ్ ప్యానల్ చీఫ్ డాక్టర్ అరోరా కీలక వ్యాఖ్యలు చేశారు. బీ ఎఫ్. 7 కేవలం 15% కేసులకు మాత్రమే కారణమని అని చెప్పారు. బీఎన్, బీ క్యూ సీరిస్ 50 శాతం, ఎస్వీవీ వేరియంట్ లు 15 శాతం కేసులకు కారణమని ఆయన వివరించారు. కానీ చైనాలో ప్రస్తుతం గమనిస్తే బీఎఫ్. 7 వేరియంట్ కాకుండా అంతకంటే బలమైన వేరియంట్ల సమూహం వ్యాప్తిలో ఉందేమోనన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో చైనీయులకు హైబ్రిడ్ ఇమ్యూనిటీ లేకపోవడం వల్ల త్వరగా వైరస్ బారిన పడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పైగా చైనాలో తయారు చేసిన వ్యాక్సిన్ వేయడం వల్ల వారు వైరస్ నుంచి అంతగా రక్షణ పొందలేదని ఆయన వ్యాఖ్యానించారు.. బహుశా వ్యాక్సిన్ తయారీలో సరైన నాణ్యత ప్రమాణాలు పాటించలేకపోవడం వల్లే ఈ దుస్థితి దాపురించిందేమోనన్న అనుమానం వ్యక్తం చేశారు..
తక్కువ ప్రతిరోధకాలను ఉత్పత్తి చేస్తున్నది
భారతదేశంలోని వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో వైరస్లపై అధ్యయనం చేస్తున్న డాక్టర్ గగన్దీప్ కాంగ్ చైనాలో పరిస్థితిపై పలు వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ వైరస్ ప్రపంచంలోని ఇతర దేశాలలో మాదిరి పరిణామ విధానాన్ని చైనాలో అనుసరిస్తుందో, లేదో చెప్పలేమన్నారు. ఇటీవల, ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాలో తీవ్రమైన వ్యాధి నివేదికల గురించి ఆందోళన వ్యక్తం చేసిందని ఆయన గుర్తు చేశారు. బీజింగ్ వెలుపల ఉన్న బాడింగ్, లాంగ్ఫాంగ్ నగరాల చుట్టూ, తీవ్రమైన కేసులు పెరగడంతో ఆసుపత్రులలో ఇంటెన్సివ్ కేర్ పడకలు సరిపోవడం లేదని ఆయన వివరించారు. ప్రతి ప్రావిన్స్లోని మూడు నగర ఆసుపత్రుల చుట్టూ వైరస్ కేంద్రాలను ట్రాక్ చేయాలని చైనా ప్రణాళిక రచించిందని, అనారోగ్యంతో ఉన్న రోగులు, ప్రతి వారం మరణించే వారందరి నుంచి నమూనాలను సేకరిస్తున్నదని ఆయన పేర్కొన్నారు. అంతే కాదు చైనాలో కనుగొన్న 130 ఓమిక్రాన్ వెర్షన్లలో 50 వ్యాప్తికి కారణమయ్యాయని ఆయన చెప్పారు.
అయితే చైనాలో వివిధవివిధ జాతులు ఎలా అభివృద్ధి చెందుతున్నాయి? ప్రజారోగ్యాన్ని ఎందుకు ఇబ్బందులకు గురి చేస్తున్నాయి? ఇప్పుడు ఈ ప్రశ్నలే చైనా వాసుల మెదళ్లను తొలిచేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు చైనా పాలకులు జాతీయ జన్యు డేటాబేస్ను సృష్టించే పనిలో ఉన్నది.. అయితే, ఈ సమయంలో, చైనా నుంచి వస్తున్న జన్యు వైరల్ సీక్వెన్సింగ్ గురించి పరిమిత సమాచారం ఉందని మసాచుసెట్స్ మెడికల్ స్కూల్ విశ్వవిద్యాలయంలో వైరాలజిస్ట్ జెరెమీ లుబాన్ అన్నారు. “అక్కడ ఏమి జరుగుతుందో మాకు పూర్తిగా తెలియదు,” అని లుబన్ చెప్పాడు. అంటే దీనిని బట్టి చైనా తన దేశంలో వైరస్ ఉత్పాతం జరుగుతున్నప్పటికీ ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్త పడుతోందనేది అర్థమవుతున్నది.
K.R. is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read More