Homeఅంతర్జాతీయంAsim Munir: పాకిస్తాన్‌లో పవర్‌ పాలిటిక్స్‌.. మునీర్‌కు ముప్పు తప్పదా?

Asim Munir: పాకిస్తాన్‌లో పవర్‌ పాలిటిక్స్‌.. మునీర్‌కు ముప్పు తప్పదా?

Asim Munir: పాకిస్తాన్‌ రాజకీయాల్లో ఎవరు నిజంగా అధికారం చెలాయిస్తున్నారనే ప్రశ్న మళ్లీ తీవ్రంగా చర్చకు వస్తోంది. సైన్యం ప్రభావం, మతపరమైన రాజకీయ శక్తులు, ఆఫ్ఘనిస్తాన్‌తో ఉన్న సంక్లిష్ట సంబంధాలు ఒకేసారి ఢీకొంటూ ఇస్లామాబాద్‌లో కొత్త ఉద్రిక్తతలు సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జమియత్‌ ఉలేమా–ఎ–ఇస్లాం (జెయూఐ–ఎఫ్‌) అధినేత మౌలానా ఫజ్లుర్‌ రెహ్మాన్‌ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌ అయ్యాయి.

ఫజ్లుర్‌ రెహ్మాన్‌ ఎవరు?
ఫజ్లుర్‌ రెహ్మాన్‌ సాధారణ రాజకీయ నాయకుడు కాదు. ఖైబర్‌ పఖ్తూన్‌ఖ్వా, బలూచిస్తాన్‌ ప్రాంతాల్లో బలమైన పట్టు ఉన్న మతపరమైన రాజకీయ నాయకుడు. ఆయన నేతృత్వంలోని జెయూఐ–ఎఫ్‌ పార్టీ దశాబ్దాలుగా ఆ ప్రాంతాల్లో ప్రభావం చూపుతోంది. పార్లమెంటులో అనేక సార్లు సభ్యుడిగా ఉన్న ఆయన, ఇస్లామిక్‌ చట్టాల అమలుకు మద్దతు ఇచ్చే వర్గానికి ప్రతినిధిగా గుర్తింపు పొందారు. ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్‌తో చారిత్రక సంబంధాలు ఉన్న మత నాయకుల్లో ఒకరిగా కూడా ఆయన పేరు వినిపిస్తుంది.

రెహ్మాన్‌ ఏమన్నారు..
ఆర్మీ చీఫ్‌ ఫీల్డ్‌ మార్షల్‌ ఆసిమ్‌ మునీర్‌పై ఫజ్లుర్‌ రెహ్మాన్‌ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చకు తెరతీశాయి. ‘‘రాజకీయాలు చేయాలనుకుంటే యూనిఫాం తీసేసి ఎన్నికల్లో పోటీ చేయండి. ప్రజల నిర్ణయాన్ని ఎదుర్కోండి’’ అని ఆయన స్పష్టంగా అన్నారు. ఈ వ్యాఖ్యలు సైన్యం రాజకీయాల్లో ఎంతవరకు జోక్యం చేసుకోవాలనే పాత ప్రశ్నను మళ్లీ లేవదీశాయి.

ఆఫ్ఘనిస్తాన్‌తో సంబంధాలు
ఫజ్లుర్‌ రెహ్మాన్‌ పేరు వినగానే ఆఫ్ఘనిస్తాన్‌ విషయం వస్తుంది. 1990 నుంచి తాలిబాన్‌ భావజాలంతో సన్నిహిత సంబంధాలు ఉన్న మత వర్గాలతో ఆయన సంబంధాలు కొనసాగించారు. పలువురు తాలిబాన్‌ నాయకులు పాకిస్తాన్‌లోని ఆయన పార్టీ అనుబంధ మదర్సాల్లో చదివినట్లు నివేదికలు ఉన్నాయి. 2001లో అమెరికా ఆఫ్ఘనిస్తాన్‌పై దాడి చేసినప్పుడు ఆయన అమెరికా వ్యతిరేక ర్యాలీలు నిర్వహించారు. 2021లో తాలిబాన్‌ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాబూల్‌తో సంబంధాలు మెరుగుపరచాలని, అంతర్జాతీయ గుర్తింపు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. అయితే ప్రస్తుతం పాకిస్తాన్‌–ఆఫ్ఘనిస్తాన్‌ సంబంధాలు ఉద్రిక్తంగా ఉన్నాయి.

ఇమ్రాన్‌ ఖాన్‌పై వ్యతిరేకత..
2018లో ఇమ్రాన్‌ ఖాన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత 2020లో ప్రతిపక్షాలు కలిసి పాకిస్తాన్‌ డెమొక్రటిక్‌ మూవ్‌మెంట్‌ (పీడీఎం) ఏర్పాటు చేశాయి. దీనికి ఫజ్లుర్‌ రెహ్మాన్‌ నాయకత్వం వహించారు. ఇమ్రాన్‌ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానం తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. 2022లో ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వం కూలిపోయింది. అదే సమయంలో ఆసిమ్‌ మునీర్‌ ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఇప్పుడు ఫజ్లుర్‌ రెహ్మాన్‌ సైన్యం రాజకీయ నిర్ణయాల్లో జోక్యం చేసుకోకూడదని, రక్షణ వ్యవహారాలకే పరిమితం కావాలని డిమాండ్‌ చేస్తున్నారు.

సైన్యం చరిత్రాత్మక నేపథ్యం..
పాకిస్తాన్‌ ఏర్పడినప్పటి నుంచి సైన్యం రాజకీయాల్లో బలమైన ప్రభావం చూపుతోంది. 1958లో జనరల్‌ అయూబ్‌ ఖాన్, 1977లో జనరల్‌ జియా ఉల్‌ హక్, 1999లో జనరల్‌ పర్వేజ్‌ ముషారఫ్‌ సైనిక పాలనలు అమలు చేశారు. ప్రస్తుతం ప్రత్యక్ష సైనిక పాలన లేనప్పటికీ, విదేశాంగ విధానం, భద్రత, పొరుగు దేశాలతో సంబంధాల్లో సైన్యం ప్రభావం కొనసాగుతోందని విమర్శకులు అంటున్నారు.

బలమైన సైన్యం, ఎన్నికల ద్వారా వచ్చే రాజకీయ నాయకత్వం, మతపరమైన రాజకీయ శక్తులు మధ్య సమతుల్యత ఎలా నెలకొంటుందనేది పాకిస్తాన్‌లో అతిపెద్ద సవాల్‌.. ఈ మూడు శక్తుల మధ్య జరుగుతున్న పోరు కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య కాదు. అధికారం ఎవరి చేతుల్లో ఉండాలనే దశాబ్దాల నాటి ప్రశ్నకు కొనసాగింపు మాత్రమే. రాబోయే రోజుల్లో ఈ సమతుల్యత ఎటు వెళ్తుందో పాకిస్తాన్‌ భవిష్యత్తును నిర్ణయిస్తుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular