Donald Trump: త్వరలో మోదీతో భేటీ.. అమెరికా ఎన్నికల వేళ డొనాల్డ్ ట్రంప్ మరో సంచలనం.. ఏం జరుగనుంది?

విశ్వగురువుగా కీర్తించబడుతున్న మోదీ కోసం ప్రపంచంలోని కీలక దేశాలు ఇప్పుడు పరితపిస్తున్నాయి. ఇటీవలే రష్యా.. శాంతి చర్చల్లో భారత్‌ కీలకంగా ఉండాలని ప్రతిపాదించారు. ఇక అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు మోదీని తమ దేశానికి ఆహ్వానించారు. తాజాగా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ కూడా త్వరలో మోదీని కలుస్తానని ప్రకటించారు. ఆ దేశ అధ్యక్ష ఎన్నికల వేళ ఈ ప్రతిపాదనలు ఆసక్తి రేపుతున్నాయి.

Written By: Raj Shekar, Updated On : September 18, 2024 4:34 pm

Donald Trump(5)

Follow us on

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇంకా 50 రోజులే సమయం ఉంది. నవంబర్‌ 5న పోలింగ్‌ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గడువు సమీపిస్తుండడంతో ఎన్నికల బరిలో ఉన్న నేతలు ప్రచారం జోరు పెంచారు. పతాకస్థాయి ప్రచారంతో అమెరికా హోరెత్తుతోంది. మరోవైపు ప్రీపోల్‌ సర్వేలతో అనేక సంస్థలు ఎన్నికల ఫలితాలను అంచనా వేస్తున్నాయి. ఇందులో ప్రధాన పోటీ అధికార డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, రిపబ్లిక్‌ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మధ్యనే ఉంది. ఇద్దరి మధ్యనే సర్వే ఫలితాలు కాస్త అటూ ఇటు మారుతున్నాయి. దీంతో అన్నివర్గాలను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు ఎత్తులు, పై ఎత్తులు వేస్తున్నారు. ఇక ఇటీవల కమలా హారిస్, డొనాల్డ్‌ ట్రంప్‌ మధ్య జరిగిన డిబేట్‌లో కమలా పైచేయి సాధించినట్లు అమెరికా మీడియా స్పష్టం చేసింది. దీంతో డెమోక్రటిక్‌ పార్టీకి భారీగా నిధులు వచ్చాయని అక్కడి మీడియా తెలిపింది. ఈ నేపథ్యంలో ఇదే ఊపు కొనసాగించేందుకు అమెరికా అధ్యక్షుడు, డెమొక్రటిక్‌ పార్టీ నేత జో బైడెన్‌ భారత ప్రధాని నరేంద్ర మోదీనికి తమ దేశానికి ఆహ్వానించారు. ఎన్నికల వేళ.. అమెరికా నుంచి ఆహ్వానం రావడంతో మోదీ వెళ్తారా లేదా అన్నది ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ కూడా త్వరలో భారత ప్రధాని మోదీని కలుస్తానని ప్రకటించారు.

ప్రవాస భారతీయుల ఓట్ల కోసమే..
మోదీని ఇరు పార్టీల నేతలు కలవడానికి ప్రయత్నిస్తుండడం చూస్తుంటే.. ఇద్దరు అభ్యర్థులు ప్రవాస భారతీయులను తమవైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు కమలా ప్రవాస భారత, ఆప్రికన్‌ సంతతి మహిళ. మోదీని ఎన్నికల ముందు కలవడం ద్వారా ప్రవాస భారతీయుల ఓటుల పొందాలని భావిస్తుంది. ఇక మోదీ.. ట్రంప్‌ మధ్య మంచి స్నేహం ఉంది. 2020 అమెరికా ఎన్నికల సమయంలో మోదీ.. ట్రంప్‌ తరఫున ఎన్నికల ప్రచారం చేశారు. అందుకే ఈసారి కూడా ట్రంప్‌ మోదీని కలిసి ప్రవాస భారతీయుల మోజారిటీ ఓట్లు పొందాలని భావిస్తున్నారు.

మోదీని పొగడ్తలతో ముంచెత్తిన ట్రంప్‌..
మిచిగాన్‌లో మంగళవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్‌ తన ప్రసంగంలో మోదీని ‘‘అద్భుతమైన వ్యక్తి’’ అని అభివర్ణించారు. పొగడ్తలతో ముంచెత్తారు. వచ్చేవారం మోదీ తనను కలవడానికి వస్తున్నారని పేర్కొన్నారు.

క్వాడ్‌ సమ్మిట్‌కు మోదీ..
ఇదిలా ఉంటే.. అమెరికాలో నిర్వహించే 4వ క్యావడ్‌ సమ్మిట్‌లో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ సెప్టెంబర్‌ 21 నుంచి 23 వరకు అమెరికా పర్యటనకు వెళ్తున్నారు. మోదీ పర్యటన షెడ్యూల్‌లో ట్రంప్‌తో భేటీకి సంబంధించిన ఎజెండా లేదు. 4వ క్వాడ్‌ సమ్మిట్‌కు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌ ఆతిథ్యం ఇవ్వనున్నారు. ఇది డెలావేర్‌లోని అతని స్వస్థలమైన విల్మింగ్టన్‌లో జరుగుతుంది. ఆ తర్వాత మోదీ న్యూయార్క్‌కు వెళ్లనున్నారు. సెప్టెంబరు 22న న్యూయార్క్‌లో భారత కమ్యూనిటీని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. అక్టోబర్‌ 23న ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీలో జరిగే ‘‘సమ్మిట్‌ ఆఫ్‌ ది ఫ్యూచర్‌’’లో పాల్గొంటారు. అదే రోజున అమెరికాకు చెందిన ప్రముఖ కంపెనీల సీఈవోలతో మోదీ సమావేశమవుతారు. మోదీ షెడ్యూల్‌లో ట్రంప్‌తో భేటీ అనే విషయం లేకపోయినా.. ట్రంప్‌ మాత్రం మంగళవారం మోదీ తనను కలవడానికి వస్తున్నాడని ప్రకటించడం చర్చనీయాంశమైంది.