ISI Cyber Trap India: పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ తన కుట్రల కోసం సాధారణ సిమ్ కార్డులను కూడా ఆయుధంగా మార్చుకుంటోంది. తాజాగా జరిగిన ఘటనలు ఇందుకు నిరద్శనం. తెలిసో తెలియకో అనేక మంది ఈ ఉచ్చులో పడుతున్నారు. ఇటీవల పశ్చిమ బెంగాల్లోని పశ్చిమ మేదినిపూర్ జిల్లా ఆపింగ్లా ప్రాంతంలో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు.
సిమ్ కార్డుల వ్యాపారం వెనుక ఐఎస్ఐ
అరెస్టు అయినవారు స్థానికంగా సిమ్ కార్డులు అమ్ముతున్నట్లు తెలిసింది. ఈ సిమ్లను పాకిస్తాన్కు చెందిన ఐఎస్ఐ ఏజెంట్లు కొనుగోలు చేస్తున్నారు. బెంగాల్లోని సాధారణ వ్యక్తుల పేర్లతో సిమ్లు కొని, యాక్టివేషన్ కోసం వచ్చే ఓటీపీలను ఐఎస్ఐకి అందిస్తున్నారు. ఇందుకు వారి ఖాతాల్లో రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు డబ్బు జమ చేస్తున్నట్లు పోలీసు విచారణలో వెల్లడైంది.
300 సిమ్ల విక్రయం..
తాజాగా పట్టుబడిన ఇద్దరు ఇప్పటికే 300 సిమ్ కార్డులు అమ్మినట్లు తెలుస్తోంది. అరెస్ట్ అయినవారిలో షేక్ ముర్సాలిన్, అతని వద్ద పనిచేస్తున్న గౌతమ్ ఖారా ఉన్నారు. గౌతమ్ ఖారా ఈ కుట్ర గురించి తెలియకుండానే ఈ పనిలో పాల్గొన్నట్లు ప్రాథమిక సమాచారం.
ఐఎస్ఐ లక్ష్యం ఏమిటి?
ఈ సిమ్ కార్డులను ఐఎస్ఐ ఏజెంట్లు భారతీయ సమాచార వ్యవస్థలను హ్యాక్ చేయడం, అసత్య సమాచారాన్ని వ్యాప్తి చేయడం, దుష్ప్రచారాలను వైరల్ చేయడం వంటి కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారని అనుమానం వ్యక్తమవుతోంది. ఒక్క సాధారణ సిమ్ కార్డు ద్వారా ఎంతటి జాతీయ భద్రతా సమస్య ఏర్పడుతుందో ఈ ఘటన తెలియజేస్తోంది. ఐఎస్ఐ తన కార్యకలాపాలను ఎంత సూక్ష్మంగా, సామాన్యుల ద్వారా నడుపుతోందో ఈ ఘటన చూపిస్తోంది. డబ్బు ఆకర్షణతో సాధారణ యువకులను ఉపయోగించడం ద్వారా తన ఏజెంట్ల నెట్వర్క్ను విస్తరించే వ్యూహంలా ఉంది.
సైబర్ యుద్ధం, సమాచార యుద్ధం ప్రధానమవుతున్న నేటి కాలంలో సిమ్ కార్డులు, మొబైల్ నంబర్లు వంటి ప్రాథమిక వనరులను కూడా ఆయుధాలుగా మార్చుకోవడం ఆందోళన కలిగించే విషయం. పోలీసులు పట్టుబడినవారి నుంచి మొత్తం నెట్వర్క్ను బయటపెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కేసు ఇతర రాష్ట్రాల్లోనూ అలాంటి కుట్రలు ఉన్నాయా అని పరిశీలించాల్సిన అవసరం ఉంది.
