Iran viral post sacrifice call controversy: పశ్చిమాసియాలో శాంతి నెలకొనే సూచనలు కనిపించడం లేదు. ప్రస్తుతం తాత్కాలిక కాల్పుల విరమణ కొనసాగుతోంది. ఏ క్షణమైనా అమెరికా ఇరాన్పై విరుచుకుపడే ప్రమాదం ఉంది. పాకిస్తాన్ మధ్యవర్థిత్వంతో జరుగుతున్న శాంతి చర్చలు కొలిక్కి రావడం లేదు. రెండో విడత చర్చలు కూడా విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇరాన్–అమెరికా మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్నాయి. హర్మూజ్ను తమ అధీనంలోకి తెచ్చుకున్న అమెరికా.. నౌకలను దిగ్బంధించింది. దీంతో ప్రపంచవ్యాప్తగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో ఇరాన్ తాజాగా చేసిన ఓ పోస్టు ఇప్పుడు సంచలనంగా మారింది. లండన్లోని ఇరాన్ రాయబార కార్యాలయం వివాదాస్పద పోస్ట్ ప్రపంచవ్యాప్త చర్చను రేకెత్తించింది.
ప్రాణత్యాగానికి సిద్ధంగా ఉండాలి..
అమెరికా–ఇజ్రాయెల్ యుద్ధ సమయంలో యూకే ఇరానీయులను ‘ప్రాణత్యాగానికి సిద్ధంగా ఉండాలి’ అని పిలుపునిచ్చింది. ఇది బ్రిటన్ అధికారుల ఆగ్రహానికి దారితీసింది. ‘జాన్ ఫదా‘ అనే ప్రచారంలో యూకేలోని ఇరాన్ పౌరులను దేశ రక్షణకు ప్రాణాలు అర్పించమని, శత్రువులకు తల వంచకూడదని పిలుపు ఇచ్చారు. ఆసక్తి ఉన్నవారు సంప్రదించాలని కోరారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్ల విమర్శలకు గురైంది.
స్పందించిన యూకే..
బ్రిటన్ విదేశాంగ శాఖ ఈ పోస్ట్ను ‘ప్రజలను రెచ్చగొట్టేలా ఉంది‘ అని ఖండించి, రాయబారి సయ్యద్ అలీ మౌసావీకి సమన్లు జారీ చేసింది. దౌత్య నిబంధనల ఉల్లంఘన అని ఆరోపించారు. అయితే ఇరాన్ ఎంబసీ దీన్ని దేశభక్తి ప్రచారంగా సమర్థించుకుంది. హింసా సందేశం కాదని, ప్రాంతీయ సమగ్రత కాపాడటానికి ఉద్దేశించినదని తెలిపింది.
సమర్థించిన అధ్యక్షుడు..
ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ తనతో పాటు 14 మిలియన్ల మంది పౌరులు దేశ రక్షణకు ప్రాణత్యాగానికి సిద్ధమని ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎంబసీ ప్రపంచవ్యాప్త ఇరానీయులు తమ మాతృభూమి కోసం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని పేర్కొంది. ఈ పోస్ట్ మరింత ఆందోళన కలిగించింది.
అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలు, హార్మూజ్ జలసంధి డెడ్లైన్ మధ్య ఈ సంఘటన భద్రతా ఆందోళనలను పెంచింది. భారత్, అమెరికా ఇరాన్లోని పౌరులకు ‘వెంటనే విడిచి వెళ్లండి‘ అని హెచ్చరించాయి. దౌత్య సంబంధాలు మరింత దెబ్బతింటాయని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.