Homeఅంతర్జాతీయంIran US peace talks: ఇరాన్‌–అమెరికా శాంతి చర్చలు.. పాకిస్తాన్‌కు తడిసి మోపెడు!

Iran US peace talks: ఇరాన్‌–అమెరికా శాంతి చర్చలు.. పాకిస్తాన్‌కు తడిసి మోపెడు!

Iran US peace talks: పశ్చిమాసియా యుద్ధం ఆగింది. ఇరాన్‌ అమెరికా మధ్య రెండు వారాల సీజ్‌ఫైర్‌ కుదిరింది. పాకిస్తాన్, టర్కీ తదితర దేశాల చొరవతో ఈ సీజ్‌ఫైర్‌ కుదిరింది. ఇక అమెరికా ప్రోత్సాహంలో పాకిస్తాన్‌ రెండు వారాల సీజ్‌ఫైర్‌ను శాశ్వత శాంతి దిశగా తీసుకెళ్లేందుకు మధ్యవర్తిత్వం వహిస్తోంది. ఇస్లామాద్‌ వేదికగా ఇరాన్, అమెరికా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేసింది. ఇరాన్‌ ప్రతిపాదించిన 10 అంశాలు, అమెరికా ఇచ్చిన 15 పాయింట్లపై ఉభయ దేశాలు 2–3 రోజుల పాటు ముఖాముఖి చర్చలు జరపనున్నాయి. ఈ సమావేశాల కోసం సెరెనా హోటల్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకుని, అత్యున్నత భద్రతా వలయంగా మార్చేశారు. ఇక్కడ ఇతర అతిథుల ప్రవేశంపై పూర్తి నిషేధం విధించారు. చర్చలు హోటల్‌లోనే జరుగుతాయా లేక సమీప ప్రభుత్వ కార్యాలయంలో నిర్వహిస్తారా అనే వివరాలను పాక్‌ అధికారులు ఇంకా బహిర్గతం చేయలేదు.

రూ.220 కోట్ల ఖర్చు?
పాకిస్తాన్‌ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయిని అందుకోవడం, రూపాయి విలువ కుప్పకూలడం వంటి సమస్యలు ఉన్న తరుణంలో ఈ చర్చల నిర్వహణ అక్కడి ప్రభుత్వానికి భారీ భారంగా మారింది. ఈ క్రమంలో రెండు మూడు రోజుల చర్చల నిర్వహణ కోసం పాక్‌ ప్రభుత్వం అక్షరాలా రూ.220 కోట్లు వెచ్చిస్తోంది. ఇది కేవలం హోస్టింగ్‌ ఛార్జెస్, భద్రతా ఏర్పాట్లు, లాజిస్టిక్స్‌ కోసం మాత్రమే. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ బృందం రవాణా, భద్రతా ఖర్చులను అమెరికానే భరిస్తున్నప్పటికీ, స్థానికంగా అదనంగా మరో రూ.25 కోట్లు పాక్‌ భరించాల్సి వస్తోంది. ఈ భారీ ఖర్చును భరించడానికి పాక్‌ ప్రభుత్వం తాజాగా పెట్రోల్‌ ధరలను లీటరుకు రూ.127 పెంచింది. ప్రజలపై భారం మోపి వచ్చిన ఆదాయాన్ని ఈ డిప్లొమాటిక్‌ ఈవెంట్‌కు వాడుతోంది.

కేవలం మధ్యవర్తిత్వం కాదు..
ఇంత భారీ మొత్తాన్ని ఖర్చు చేసి పాకిస్తాన్‌ కేవలం శాంతిదూతగా మారాలని చూడటం లేదు. దీని వెనుక మూడు స్పష్టమైన వ్యూహాత్మక లక్ష్యాలు ఉన్నాయి. ఉగ్రవాద దేశంగా ఉన్న ముద్రను చెరిపేసుకోవాలనుకుంటోంది. ‘శాంతి దూత’గా, విశ్వసనీయ మధ్యవర్తిగా ప్రపంచ ముందు నిలబడాలని చూస్తోంది. దీంతో దేశ ప్రతిష్ట పెరుగుతుందని భావిస్తోంది. ఈ చర్చల విజయవంతం నిర్వహణ ద్వారా వాషింగ్టన్‌తో దౌత్య సంబంధాలను గాఢం చేసుకోవాలనేది ఇస్లామాబాద్‌ లక్ష్యం. ఇది భవిష్యత్తులో సైనిక, ఆర్థిక సహకారానికి దారి తీస్తుంది. అమెరికా మద్దతుతో వరల్డ్‌ బ్యాంక్, ఐఎంఎఫ్‌ నుంచి మరింత భారీ రుణాలు, గ్రాంట్లు రాబట్టాలనేది అసలు ఉద్దేశం. ఈ రూ.220 కోట్ల ఖర్చును పాక్‌ ఒక ’డిప్లొమాటిక్‌ పెట్టుబడి’గా చూస్తోంది.

భద్రతా కవచం..
ఈ చర్చల విజయానికి భద్రత కీలకం. అమెరికా, ఇరాన్‌ ప్రతినిధుల భద్రత కోసం పాక్‌ సైన్యం ’బ్లూ బుక్‌’ ప్రొటోకాల్‌ను అమలు చేసింది. సెరెనా హోటల్‌ చుట్టూ ముమ్మరమైన తనిఖీలు, స్నైపర్ల మోహరింపు, మొబైల్‌ సిగ్నల్‌ జామర్లు, డ్రోన్‌ నిఘా ఏర్పాటు చేశారు. నగరంలోని కీలక మార్గాలను మూసివేసి, VVఐ్కల కోసం ప్రత్యేక కారిడార్లు కేటాయించారు. ఉగ్రవాద ముప్పు ఉన్న నేపథ్యంలో ఇది అత్యంత సున్నితమైన ఆపరేషన్‌గా మారింది.

ఆర్థిక ఇబ్బందుల నడుమ కూడా పాకిస్తాన్‌ ఈ భారీ దౌత్య కార్యక్రమానికి తెరలేపడం గమనార్హం. ఈ చర్చలు విజయవంతమైతే పాక్కు దక్కే అంతర్జాతీయ గుర్తింపు, ఆర్థిక ప్రయోజనాలు రూ.220 కోట్ల ఖర్చుకు మించినవని ఇస్లామాబాద్‌ లెక్కలు. కానీ, చర్చలు విఫలమైతే మాత్రం ప్రజలపై మోపిన భారం వృథా అవుతుందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తంమీద, ఇది పాక్‌ భవిష్యత్తును నిర్ణయించే సాహసోపేతమైన పందెం.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version