Iran US Conflict Escalation: కొద్ది రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో జరుగుతున్న ఘర్షణ త్వరలో ముగుస్తుందని, శాంతి చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని ప్రకటించారు. ఈ ప్రకటనతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన, సహజవాయువు ధరలు తగ్గే అవకాశం ఉందని ఆశలు చిగురించాయి. కానీ ఆ ఆశలు కొన్ని రోజుల్లోనే బూడిద అయ్యాయి. రెండు దేశాలు కూడా సెల్ఫ్ డిఫెన్స్ పేరుతో సీజ్ఫైర్ను ఉల్లంఘించాయి. అమెరికా ఇరాన్పై భారీ వైమానిక దాడులు చేయగా, ఇరాన్ ప్రతిస్పందనగా హార్ముజ్ జలసంధిని పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది.
హర్మూజ్ క్లోజ్..
పశ్చిమ ఆసియాలోని ఈ వ్యూహాత్మక జలసంధి హర్మూజ్ ప్రపంచ ఇంధన సరఫరాలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇరాన్ ఈ మార్గాన్ని మూసివేయడంతో ప్రపంచ మార్కెట్లలో మళ్లీ ఆందోళన వ్యాపించింది. అమెరికా మాత్రం వాణిజ్య నౌకలు ఇంకా ఆ మార్గంలో సాగుతున్నాయని చెబుతోంది. అయితే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ నేవీ ఆ మార్గాన్ని ఉల్లంఘించిన రెండు నౌకలపై దాడి చేసినట్లు ప్రకటించింది.ఈ పరిణామాలు ప్రపంచ ఇంధన ధరలను మళ్లీ పెంచే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఆసియా, యూరప్ దేశాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా.
ఇజ్రాయెల్–హెజ్బొల్లా దాడులు..
ఇరాన్తో జరుగుతున్న ఘర్షణతోపాటు ఇజ్రాయెల్ లెబనాన్పై తన సైనిక కార్యకలాపాలను తీవ్రం చేసింది. హెజ్బొల్లా నుంచి వచ్చిన రాకెట్ దాడులకు ప్రతిగా బీరూట్ దక్షిణ ప్రాంతాలు, దక్షిణ లెబనాన్ పట్టణాలపై వైమానిక దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో అనేక మంది సాధారణ పౌరులు మరణించినట్లు నివేదికలు వస్తున్నాయి.
అంతర్జాతీయ ఆందోళన
ఈ పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగించాయి. ఐక్యరాష్ట్ర సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ను వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు. స్థానిక స్థాయి ఘర్షణ పెద్ద స్థాయి ప్రాంతీయ యుద్ధంగా మారే ప్రమాదం ఉందని, ఇది లక్షలాది మంది ప్రాణాలను బలిగొనడమే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం కలిగిస్తుందని హెచ్చరించారు.
ఈ ఘర్షణ ప్రారంభమై నాలుగు నెలలు దాటినా, ఇరు పక్షాల మధ్య శాంతి చర్చలు ఇంకా స్థిరంగా సాగడం లేదు. హార్ముజ్ జలసంధి మూసివేత, లెబనాన్లో ఇజ్రాయెల్ దాడులు, ఇరాన్–అమెరికా మధ్య నేరుగా జరుగుతున్న సైనిక చర్యలు పరిస్థితిని మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. రెండు దేశాలు వెంటనే యుద్ధ విరామం చేసి, నిజమైన శాంతి చర్చలకు కుదుర్చకపోతే సంక్షోభం మరింత విస్తరించే అవకాశం ఉంది.

